భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 368 పాఠశాలలకు రూ.60 కోట్ల నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. మరో రెండు నెలల్లో విద్యాలయాలు పూర్తిస్థాయిలో అందాల నిలయాలుగా మారబోతున్నాయి. ప్రతి స్కూల్ టాయిలెట్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, ఆట స్థలం, వాటర్ ట్యాంక్, పచ్చని మొక్కల ఆహ్లాదంతో విరాజిల్లబోతున్నది. జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 368 పాఠశాలల్లో 204 సూళ్లల్లో 12 రకాల సమస్యలను గుర్తించి రూ.2 కోట్లతో వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 60శాతం పాఠశాలల్లో ఉపాధి హామీ నిధులతో ప్రహరీ, టాయిలెట్స్, వంట గదులను నిర్మించారు. వంద శాతం పనులు 54 పాఠశాలల్లో పూర్తికాగా, 80శాతం పనులు 50 పాఠశాలలు, 60శాతం పనులు 150 పాఠశాలల్లో పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో అన్ని పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తికానున్నాయి.
ప్రతి స్కూల్లో సకల సౌకర్యాలు
నిధుల కొరత లేకుండా కలెక్టర్ అనుదీప్ ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేస్తున్నారు. వీసీ, టీసీ ద్వారా అధికారులను అప్రమత్తం చేసి మన ఊరు మన బడి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. కార్పొరేట్కు దీటుగా ప్రతి పాఠశాలలో సకల సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు.
టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ నిర్మాణాలను ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనుండగా, నామినేషన్ పద్ధతిలో పనులు చేపట్టి పనులు వేగవంతం చేస్తున్నారు. ప్రతి బడిలో బల్లాలు, డ్యూయల్ డెస్క్ బెంచీలు, డిజిటల్ స్మార్ట్క్లాస్ రూం పరికరాలు, పేయింట్స్, గ్రీన్ చాక్పిస్ బోర్డులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ల ఫర్నీచర్ను టెండర్ల ద్వారా కొనుగోలు చేసి ఇప్పటికే అందుబాటులో ఉంచారు. ఈ మేరకు అధికారులు అంచనాలు తయారు చేసి కార్యరూపం దాల్చారు. దీంతోపాటు పచ్చని మొక్కలను వేసి ఆవరణలకు ప్రకృతి నిలయాలుగా మార్చారు. తాగునీటి సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి నీరు వృథా కాకుండా చర్యలు తీసుకున్నారు.