ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 5: విద్యార్థుల్లోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు రాష్ట్రవిద్యాశాఖ సీసీఈ విధానాన్ని అమలు చేస్తున్నది. పరీక్షలు నిర్వహించి మేథస్సును పరీక్షిస్తున్నది. పాఠశాల స్థాయిలో పదోతరగతి విద్యార్థులకు ఇంటర్నల్ 20 మార్కులు వేస్తున్నది. ఫార్మెటివ్ అసెస్మెంట్ విధానంలో 20 మార్కులకు పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయింపు జరుగుతున్నది. వార్షిక పరీక్షల్లు 80 మార్కులకు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. వార్షిక పరీక్షల్లో ఏ గ్రేడ్ స్థాయిలో సత్తా చాటలేని విద్యార్థికీ 19 మార్కులు కేటాయిస్తుండడం, సమాధాన పత్రాలు వాల్యుయేషన్ చేయకుండానే మార్కులు కేటాయించిన ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. విద్యాశాఖ అధికారులు ఈ నెల 6 నుంచి 8 వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేస్తాయి.
తనిఖీలు నిర్వహించే ఒక్కో బృందంలో ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు ఉంటారు. వీరు ఆయా సబ్జెక్ట్ ఆధారంగా ప్రతి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కులను పరిశీలిస్తారు. సంబంధిత మార్కులు ప్రొఫార్మాను పోలుస్తూ విద్యార్థి రాసిన సమాధాన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూస్తారు. దీంతో పాటు విద్యార్థి రాసిన సమాధానాలను ఉపాధ్యాయులు సరిగ్గా మార్కులు వేసారా తప్పులు ఏమైనా దొర్లాయా లేదా అనే విషయం తెలుస్తుంది. ఆ సమయంలో ఉన్న సందేహాలకు అనుగుణంగా సమాధాన పత్రాలతో పాటు విద్యార్థికి సంబంధించిన హాజరు పట్టిక, ప్రాజెక్ట్ రిపోర్ట్లను పరీశీలిస్తారు. సబ్జెక్ట్ నిపుణులు పరీశీలించిన వాటిలో హెచ్చు, తగ్గులు ఉంటే సంబంధిత బృంద నాయకుడికి వివరిస్తారు. తనిఖీల్లో లోపాలు ఉంటే నివేదికను సంబంధిత తనిఖీ కన్వీనర్ డీసీఈబీ సెక్రటరీ ద్వారా డీఈవోకు అందజేస్తారు.
మండల విద్యాశాఖ అధికారుల సూచించిన విధంగా బృందాలు పాఠశాలలను తనిఖీ చేయనున్నాయి. యాజమాన్యాల వారీగా ఎయిడెడ్ , బీసీ వేల్ఫేర్, ప్రభుత్వ, ఐటీడీఏ, కేజీబీవీలు, టీఎస్ఎంఎస్, ప్రైవేట్, టీఎస్ఆర్ఎస్ , టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 16 వేల మంది పది పరీక్షలకు హాజరుకానున్నారు. 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు రోజుకు రెండు స్కూల్స్ చొప్పున 416 పాఠశాలలను బృందాలను తనిఖీలు చేయనున్నాయి. ఖమ్మం నగరంలో 10 వరకు తనిఖీలు కొనసాగనున్నాయి.
ఇంటర్నల్ మార్కుల తనిఖీకి విద్యాశాఖ నిపుణులైన ఉపాధ్యాయులు ఎంపిక చేసింది. ఇంటర్నల్ మార్కుల తనిఖీకి 57 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి బృందంలో ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుడు నాయకత్వం వహిస్తాడు. వారి ఆధ్వర్యంలో ముగ్గురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు తనిఖీ చేస్తారు. తెలుగు, హిందీ సబ్జెక్ట్లకు ఒకరు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్ట్లకు ఒకరు, సోషల్, సైన్స్ సబ్జెక్ట్లకు ఒకరి చొప్పున నియమితులయ్యారు. వీరికి కేటాయించిన సబ్జెక్ట్ ఆధారంగా పాఠశాలలో తనిఖీలు చేస్తారు. సమాచారాన్ని డీసీఈబీ సెక్రటరీ నారాయణకు అందజేస్తారు. తనిఖీల కన్వీనర్గా డీసీఈబీ సెక్రటరీ వ్యవహరిస్తారు. రోజు వారీ తనిఖీల సమాచారాన్ని డీఈవోకు డీసీఈబీ సెక్రటరీ నివేదిస్తారు.
ఇంటర్నల్ మార్కుల తనిఖీలో పక్కాగా నిబంధనలు అమలవుతాయి. బృందాలకు నిర్దేశించిన విధంగా వివరాలు సేకరిస్తారు. తనిఖీలు చేపడతారు. లోపాలను గుర్తించి యాజమాన్యాలకు తగిన విధంగా సూచనలిస్తారు. బృందాల్లోని సభ్యులకు ఇప్పటికే తనిఖీలపై అవగాహన కల్పించాం. ఎంఈవోలు వారికి మార్గదర్శనం చేస్తారు.
– సోమశేఖరశర్మ, డీఈవో, ఖమ్మం
పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. బృందాలకు తనిఖీలపై అవగాహన కల్పించాం. ఇంటర్నల్ మార్కుల విషయంలో ఏదైనా పాఠశాల యాజమాన్యాలు నిబంధనలు పాటించకున్నా, మార్క్లకు సంబంధించిన సమాధాన పత్రాల్లో లోపాలు ఉంటే డీఈవోకు నివేదిస్తాం.
– నారాయణ, డీసీఈబీ సెక్రటరీ, ఖమ్మం