భద్రాచలం, జనవరి 28: భద్రగిరికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులుగా భద్రాచలం రామాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శుక్రవారం రిపబ్లిక్ డే, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో రద్దీ కనిపించింది. కొందరు భక్తులు ముందుగా ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క, సారక్కను దర్శించుకుని భద్రాద్రి రామయ్య దర్శనానికి వస్తున్నారు. తర్వాత పాపికొండల విహార యాత్రకు వెళుతున్నారు. శనివారం ఆలయ సన్నిధిలో జరిగిన రామయ్య నిత్యకల్యాణ క్రతువుకు రికార్డు స్థాయిలో 219 దంపతుల జంటలు విచ్చేశారు. భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ అధికారులు ఒక దశలో ఆర్జిత సేవలను సైతం రద్దు చేశారు. రాత్రి 10:30 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. ఆదివారమూ ఆర్జిత సేవల రద్దు కొనసాగింది. భక్తుల రద్దీ కూడా కనిపించింది. రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
భద్రాచలం పట్టణంలోని ఓ రెస్టారెంట్లో శనివారం విధ్వంసం జరిగింది. దీంతో పట్టణంలో బంద్ కొనసాగింది. దీంతో హోటల్స్ సైతం మూతపడ్డాయి. భక్తులు అల్పాహారం, భోజనం దొరక్క ఇబ్బందులు పడ్డారు. మరోవైపు భక్తులు రవాణా ఇబ్బందులూ ఎదుర్కొన్నారు. ప్రైవేటు వాహన యజమానులు సాధారణ రేట్లకంటే అధికంగా భక్తుల నుంచి వసూలు చేశారు.
భద్రాచలం నుంచి పాపికొండల యాత్రకు వెళ్లిన యాత్రికులకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. యాత్రికులు ముందుగానే విహార యాత్ర టిక్కెట్లు కొనుగోలు చేసినప్పటికీ నిర్వాహకులు ఏపీలోని పోచవరం పాయింట్ వద్ద బోట్లు ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో వ్యయప్రయాసలకోర్చి వెళ్లిన యాత్రికులు నిరాశ చెందారు. మధ్యాహ్నం వరకు అక్కడే ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. దీంతో అక్కడి నుంచి బస్సుల్లో తిరుగుప్రయాణమై అర్ధరాత్రి భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు.