విద్యార్థుల బంగారు భవితకు ‘తొలిమెట్టు’ పైమెట్టుగా ఉపయోగపడుతున్నది. ప్రాథమిక ‘విద్య’లోనే గట్టి పునాది వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ఈ ఏడాది ‘తొలిమెట్టు’ను మరింత పకడ్బందీగా వినూత్నంగా నిర్వహిస్తున్నది. హ్యాండ్బుక్స్, వర్క్షీట్స్ను అందించి 5ప్లస్1 పద్ధతిలో బోధన సాగించనున్నది. ఐదురోజులు విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో ప్రత్యేకంగా బోధించి 6వ రోజు పరీక్ష నిర్వహిస్తారు. ప్రత్యేక యాప్ సాయంతో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఉపాధ్యాయులకు ఇప్పటికే రాష్ట్ర, జిల్లాస్థాయిలో శిక్షణ పూర్తికాగా మండలస్థాయి శిక్షణ బుధవారం ప్రారంభంకానున్నది. తొలిమెట్టుతో ఈ ఏడాది ఖమ్మంజిల్లాలో 43,037 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 39,207 మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.
– ఖమ్మం, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)అశ్వారావుపేట
ఖమ్మం, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ అశ్వారావుపేట : ప్రాథమిక విద్య బలోపేతానికి రాష్ట్ర సర్కార్ పటిష్ఠ చర్యలు చేపట్టింది. విద్యాశాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ప్రకారం ‘ఫౌండేషన్ లిటరసీ న్యూరసీ’ ప్రోగ్రాం ద్వారా ‘తొలిమెట్టు’ను గతేడాది ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం అమలుచేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ ఏడాది కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల విద్యాశాఖ అధికారులు వినూత్న కార్యాచరణ రూపొందించారు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమాలు పూర్తికాగా మండలస్థాయి శిక్షణను బుధవారం ప్రారంభించనున్నారు. ప్రధానంగా తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులకు సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున మండలానికి ఆరుగురు ఉపాధ్యాయుల(రిసోర్స్పర్సన్)ను కేటాయించారు. మండలాల వారీగా కేటాయించబడిన ఈ ఆరుగురు ఉపాధ్యాయులు మండలస్థాయిలో ఎస్జీటీ ఉపాధ్యాయులందరికీ శిక్షణనిస్తారు.
5ప్లస్ 1 పద్ధతిలో బోధన
గత సంవత్సరం తొలిమెట్టు కార్యక్రమంలో ఉపాధ్యాయుల అభిప్రాయాల ఆధారంగా ఈ సంవత్సరం కొన్ని మార్పులు చేసింది. హ్యాండ్బుక్స్, వర్క్షీట్స్కు రూపకల్పన చేసింది. వర్క్షీట్లో 5ప్లస్1 పద్ధతిలో రూపొందించారు. ఐదు పనిదినాల్లో ఐదు పీరియడ్ ప్లాన్స్ రూపొందించారు. ప్రతిరోజు పీరియడ్ తర్వాత పిల్లలతో అభ్యాసన పత్రాన్ని పూర్తి చేయిస్తారు. ఆరోరోజు మూల్యాంకన పత్రాన్ని విద్యార్థులు పూర్తిచేస్తారు. ఈ పత్రం ఆధారంగా వారి సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఇంకా వెనుకబడి ఉండే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రైవేట్కు దీటుగా వర్క్షీట్స్ రూపొందించారు. వీటిని ఎస్సీఈఆర్టీ పర్యవేక్షణలో తయారుచేశారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, హిందీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక బోధనోపకరణాలతో పాఠాలు బోధిస్తారు. సులభంగా చదవడం, రాయడంపై ఉపాధ్యాయులు బోధించనున్నారు. గణితంలో సంఖ్యలు గుర్తించడం, చదవడం, రాయడం, సంఖ్యలను పోల్చడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలపై పాఠాలు చెబుతారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్లో విషయ అవగాహన, ప్రశ్నించడం-పరికల్పన చేయడం, ప్రయోగాలు-క్షేత్ర పరిశీలన, బొమ్మలు గీయడం-నమూనాలు తయారు చేయడం, సమాచార నైపుణ్యాలపై బోధించనున్నారు. ఇలావారంలో ఐదురోజులు విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో ప్రత్యేకంగా బోధించి 6వ రోజు పరీక్ష నిర్వహిస్తారు.
భద్రాద్రి జిల్లాలో 39,297 మందికి ప్రయోజనం
తొలిమెట్టు ప్రోగ్రాం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 39,207 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. జిల్లాలో మొత్తం తొలిమెట్టు కార్యక్రమానికి 939 పాఠశాలలు ఎంపిక కాగా వీటిలో ప్రాథమిక పాఠశాలలు 777, ప్రాథమికోన్నత పాఠశాలలు 162 ఉన్నాయి. జిల్లాస్థాయిలో ఆరుగురు డీఆర్సీలు, నలుగురు సెక్టోరల్ ఆఫీసర్లు, 138 మంది రీసోర్స్పర్సన్లు ప్రోగ్రాంను పర్యవేక్షిస్తుంటారు. ఒక్కో సబ్జెక్ట్కు ఇద్దరు ఆర్పీలు చొప్పున మండలానికి ఆరుగురు ఆర్పీలను జిల్లా ఉన్నతాధికారులు ఎంపిక చేసి శిక్షణనిచ్చారు. వీరంతా జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న 1,885 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు బుధవారం నుంచి శిక్షణనివ్వనున్నారు. శిక్షణ కోసం విద్యాశాఖ ఉపాధ్యాయులకు టీచర్స్ హ్యాండ్బుక్స్, విద్యార్థులకు వర్క్బుక్స్ అందించింది.
రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ
విద్యాశాఖ ద్వారా అమలవుతున్న తొలిమెట్టు కార్యక్రమాన్ని జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. తెలంగాణ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా అధికారులు ప్రతి పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ అమలు తీరును తనిఖీ చేస్తారు. స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకింగ్ యాప్తో పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు నెలకొకసారి పరీక్షిస్తారు. ఈ యాప్ స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీస్కు అనుసంధానమై ఉంటుంది. విద్యార్థులకు జరిగిన పాఠంపై 80శాతం మంది విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధిస్తేనే ఉపాధ్యాయులు తర్వాత పాఠానికి వెళ్తారు. జరిగిన పాఠంపై విద్యార్థులందరికీ సంపూర్ణ అవగాహన వచ్చేవరకూ అదే పాఠాన్ని ఉపాధ్యాయులు బోధించాల్సి ఉంటుంది.
ఖమ్మం జిల్లాలో 43,037 మందికి ప్రయోజనం
ఖమ్మం జిల్లాలో 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించనున్నారు. ఇప్పటికే జిల్లాస్థాయిలో శిక్షణ పూర్తి చేశారు. గత నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఖమ్మం నగరంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ కల్పించారు. జిల్లావ్యాప్తంగా 21 మండలాలకు సంబంధించి తెలుగు, ఇంగ్లిష్, గణితం కలిపి 126మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. మండలస్థాయిలో ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు దశల్లో శిక్షణ కల్పించనున్నారు. సబ్జెక్ట్కు రెండురోజుల చొప్పున శిక్షణ ఇస్తారు. జిల్లాలో మొత్తం 995 ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఇందులో చదువుతున్న 43,037 మందికి ప్రయోజనం కలుగనున్నది.
ఉపాధ్యాయులకు శిక్షణ
ఈ ఏడాది కూడా తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర, జిల్లాస్థాయి శిక్షణ పూర్తయ్యింది. జిల్లాలో మండలస్థాయి ఉపాధ్యాయులకు బుధవారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ప్రోగ్రాంను ‘స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్’ యాప్ ద్వారా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
– సోమశేఖర్శర్మ, డీఈవో