కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 4 : ప్రయాణికుల్లో బస్సెక్కాలనే ఆతృత.. దొంగలకు జేబు కొట్టాలనే ఆలోచన.. వాటిని కట్టడి చేయడానికి పోలీసుల విధి నిర్వహణ. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. ‘మూడో’ కంట పడకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే పిక్పాకెటర్లు సుమారు ఐదుగురి జేబులను కత్తిరించారంటే వారు ఎంత చాకచక్యంగా తమ పని కానిచ్చేస్తున్నారో అర్థమవుతోంది. తాజాగా శనివారం ఒకే బస్సులో ఇద్దరు ప్రయాణికుల మొబైల్ ఫోన్లు ఒకే సమయంలో జేబు దొంగలు తస్కరించిన ఘటన చోటుచేసుకుంది. విజయవాడకు వెళ్లే బస్సు కొత్తగూడెం బస్టాండ్లోని 4వ నంబర్ ప్లాట్ఫాం వద్దకు రావడంతో ప్రయాణికులందరూ ఎక్కేందుకు గుమిగూడారు. సరిగ్గా అదే సమయంలో సదరు దొంగలు వారితోపాటు బస్సులోకి ఎక్కే క్రమంలో ఇద్దరి ఫోన్లను మాయం చేశారు. తీరా బస్సులోకి ఎక్కిన తర్వాత ప్రయాణికులు తమ ఫోన్లు లేకపోవడాన్ని గుర్తించారు. వెంటనే కిందకు దిగి వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఒక బాధితుడు వన్టౌన్ పోలీసులను ఆశ్రయించాడు.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బస్టాండ్లో పలుచోట్ల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ జేబుదొంగలు వాటికి చిక్కకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజా ఘటనలో ఇద్దరు ప్రయాణికుల సెల్ఫోన్ల్లు చోరీకి గురికావడమే కాకుండా గడిచిన వారం రోజుల్లో మరో ఇద్దరు బాధితుల సెల్ఫోన్లు, మరో బాధితుడికి చెందిన రూ.15వేల నగదు తస్కరణకు గురైనట్లు అక్కడి వారు చెబుతున్నారు. అయితే బస్టాండ్లో సీసీ కెమెరా నిఘా లేని ప్లాట్ఫాంలను గుర్తిస్తున్న చోరులు.. అక్కడ రద్దీ ఉన్న సమయంలో ప్రయాణికుల జేబుల నుంచి ఫోన్లు, నగదు అపహరిస్తున్నారు. ఇక్కడ దోచుకున్న సెల్ఫోన్లు, ఇతర వస్తువులను ఆంధ్రాలో తక్కువ ధరకే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం.
నేను వ్యక్తిగత పనిపై విజయవాడకు వెళ్దామని బస్టాండ్కు వచ్చాను. సుమారు 40 నిమిషాలపాటు బస్సు కోసం ఎదురుచూశాను. నేను ఫోన్ మాట్లాడుతుండగానే బస్సు వచ్చింది. వెంటనే ఫోన్ కట్ చేసి ప్యాంట్ జేబులో పెట్టుకున్నాను. అప్పటికే ఎక్కువ మంది ప్రయాణికులున్నారు. వారితోపాటు నేను బస్సెక్కి సీట్లో కూర్చున్నాను. వెంటనే జేబులో చూసుకోగా ఫోన్లేదు. ఎక్కడ చూసినా కనిపించలేదు. వెంటనే తోటి ప్రయాణికుడిని ఫోన్ అడిగి నా నంబర్కు కాల్ చేయగా.. అప్పటికే స్విచ్ఛాఫ్ వచ్చింది. రెండు నిమిషాల వ్యవధిలోనే ఫోన్ పోయింది. బస్సు దిగి పోలీసుల సహకారంతో సీసీ కెమెరాలను సైతం పరిశీలించాను. అయినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. అదే బస్సులోని నా తోటి ప్రయాణికుడి ఫోన్ కూడా పోయింది.
– సాంబశివరావు, బాధితుడు