పైవేటు స్కూళ్లను తలదన్నేలా సర్కారు స్కూళ్లను ముస్తాబు చేస్తోంది. ఎక్కడా ఏ లోటూ రాకుండా కార్పొరేట్ స్థాయి చదువులను విద్యార్థుల దరిచేర్చేందుకు పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం. పాఠశాలల నిర్వహణతోపాటు వాటిలో సకల సౌకర్యాలు కల్పించేందుకు ఎస్ఎంసీల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. తెలంగాణలోని సర్కారు స్కూళ్లలో చదివి ఈ స్థాయికి చేరామని వేదికలపై విద్యార్థులు గొప్పగా చెప్పుకునే స్థాయిలో తీర్చిదిద్దుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం మొదటి విడతగా ప్రభుత్వం రూ.1.66 కోట్లు జమ చేసింది.
-అశ్వారావుపేట, జూలై 14
అశ్వారావుపేట, జూలై 14 : గతంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు నిధుల కొరత ఉండేది. ఎస్ఎంసీ కమిటీలు ఏడాదంతా నిర్వహణ నిధుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు కనీసం చాక్పీస్లైనా ఉండేవి కాదు. దీంతో యాజమాన్యాలు సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధుల సాయం తీసుకుని వసతులు సమకూర్చుకునే అగత్యం ఉండేది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కేటాయిస్తున్నది. అలాగే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కార్ బడులను బలోపేతం చేస్తున్నది. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది.
50శాతం నిధులు విడుదల..
2023-24 విద్యా సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ఉన్న 1,257 ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు మొదటి విడతగా ఈనెల 6న 50 శాతం నిధులు మంజూరు చేసింది. ఇలా అన్ని పాఠశాలలకు కలిపి రూ.1.66 కోట్లు విడుదల చేసింది. వీటిలో స్పోర్ట్స్ నిధులు రూ.38 లక్షలు. నిధులు ఎస్ఎంసీ ఖాతాల్లో జమ అయిన తర్వాత ఎస్ఎంసీ కమిటీ తీర్మానం ప్రకారం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిధులు వినియోగిస్తారు. నిధుల వినియోగంపై ఏటా ఆడిటింగ్ కూడా ఉంటుంది. రెండో విడత నిధులు 50 శాతం సెప్టెంబర్ లేదా నవంబర్లో విడుదలయ్యే అవకాశం ఉన్నది.
పాఠశాల నిర్వహణకు..
జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం రూ.1.66 కోట్లు జమ చేసింది. సొమ్ము ఈ విద్యాసంవత్సరం విడుదల కావాల్సిన నిధుల్లో సగానికి పైగానే ఉంటుందని యాజమాన్యాలు తెలిపాయి. నిధులతో యాజమాన్యాలు మెయింటెనెన్స్, కంప్యూటర్ సర్వీసింగ్, పుస్తకాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, స్టేషనరీ,క్రీడాసామగ్రి కొనుగోలుకు వినియోగించుకోనున్నాయి. వాటికి వినియోగించే ప్రతి పైసాను పాఠశాల యాజమాన్య కమిటీ తీర్మానం చేయాల్సిందే. నిధుల వినియోగంపై యాజమాన్యాలు డీఈవో కార్యాలయానికి నివేదికలు అందించాల్సిందే.
నిధుల కేటాయింపు ఇలా..
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని సర్కార్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల చేస్తుంది. ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 30 మంది ఉంటే ఏడాదికి రూ.11,000, 31-100 మందికి రూ.25 వేలు, 101- 250 మందికి రూ.50 వేలు, 251- 1,000 మందిరి రూ.75 వేలు, వెయ్యి మందికి పైగా ఉంటే రూ.లక్ష చొప్పున నిధులు విడుదలవుతాయి.
మొదటి విడుత నిధులు విడుదల..
పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం మొదటి విడతగా 50 శాతం నిధులు మంజూరు చేసింది. నిధులను ఎస్ఎంసీ తీర్మానం ప్రకారం ప్రధానోపాధ్యాయులు వినియోగిస్తారు. ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీలపై ఆర్థిక భారం పడకుండా సర్కార్ ముందుగానే విడుదల చేసింది. నిధుల వినియోగంపై ఏటా ఆడిట్ ఉంటుంది. ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– సోమశేఖరశర్మ, జిల్లా విద్యాశాఖాధికారి, కొత్తగూడెం
ఆర్థిక ఇబ్బందులు తొలిగాయి..
పాఠశాలల నిర్వహణకు సర్కార్ ముందుగానే నిధులు విడుదల చేయడం హర్షణీయం. నిధులతో యాజమాన్యాల ఆర్థిక ఇబ్బందులు తొలిగాయి. ఎస్ఎంసీల తీర్మానం మేరకు నిధులను వినియోగిస్తాం. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తాం. సామగ్రి కొనుగోలు చేస్తాం. పారిశుధ్య నిర్వహణ చేపడతాం.
– దివిలి ప్రసాద్, ప్రభుత్వ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్, అశ్వారావుపేట