ఖమ్మం, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో గురువారం చేపట్టే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉంది. బుధవారం సాయంత్రానికి సదరు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. అంతకుముందే నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల విధుల సిబ్బందికి రిటర్నింగ్ అధికారులు పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు.
అక్కడి నుంచి ఆ సామగ్రి సహా ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పటిష్ట బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అలాగే, పోలింగ్ శాతాన్ని మరింతగా పెంచేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గతంలో నమోదైన ఓటింగ్ శాతాన్ని బట్టి ఆయా పోలింగ్ కేంద్రాలను ఆదర్శ, యువ ఆదర్శ, దివ్యాంగుల ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా అలంకరించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షించారు. పోలీసులు నిర్వహించాల్సిన విధుల గురించి సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆ శాఖ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.