ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 19 : ఎర్ర బంగారంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నిండిపోయింది. సోమవారం దాదాపు లక్ష బస్తాలు విక్రయానికి రావడంతో ఇసుకేస్తే రాలని విధంగా యార్డు తయారైంది. 2017లో ఇదే సీజన్లో లక్షా 50 వేల బస్తాల మిర్చి రికార్డు స్థాయిలో మార్కెట్కు విక్రయానికి వచ్చింది. ఆదివారం సెలవు దినం తర్వాత సోమవారం మార్కెట్ తెరుచుకోవడంతో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఒకరోజు ముందుగానే ఆదివారం సాయంత్రం వరకు 40 వేల బస్తాలను తరలించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలు, ఏపీ రాష్ట్రం నుంచి వందలాది వాహనాల్లో సరుకును మార్కెట్కు తీసుకురావడంతో యార్డు పూర్తిగా నిండిపోయింది.
తెల్లవారే సరికి త్రీటౌన్ ప్రాంతంలో ఎక్కడ చూసినా మిర్చి బస్తాల వాహనాలు దర్శనమిచ్చాయి. విషయం తెలుసుకున్న మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్కుమార్, త్రీటౌన్ సీఐ నరేశ్లు తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సీఐ స్వయ పర్యవేక్షణలో నిలిచిపోయిన వాహనాలను వివిధ మార్గాల ద్వారా దారి మళ్లించి అపరాల యార్డుకు తరలించారు. దీంతో రెండు యార్డుల్లో మిర్చి పంటను రైతులు దిగుమతి చేశారు. ఆ తర్వాత వచ్చిన వాహనాలు మార్కెట్ సమీపంలోని వీధుల్లోనే దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో వ్యాపారులు పోటీపడి పంటను కొనుగోలు చేశారు. జెండా పాటలో మిర్చి పంటకు గరిష్ట ధర క్వింటా రూ.20,850 పలికింది. మధ్య రకం క్వింటా రూ.19 వేలు, కనిష్ట ధర రూ.14 వేలు పలికింది. తాలు రకం క్వింటా రూ.12 వేలతో వ్యాపారులు కొనుగోలు చేశారు. సాయంత్రం వరకు కాంటాలు, తోలకాల ప్రక్రియ పూర్తికాకపోవడంతో వ్యాపారులు, కార్మికుల అభిప్రాయం మేరకు మంగళవారం మిర్చి యార్డుకు సెలవు ప్రకటించారు.
వారంలో మూడు రోజులపాటే మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన వర్తక సంఘం వ్యాపారులు, ట్రాలీ అసోసియేషన్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం రికార్డు స్థాయిలో పంట రావడంతో వ్యాపారులు, కార్మికుల ఆభిప్రాయం మేరకు మంగళవారం మిర్చి యార్డుకు సెలవు ప్రకటించారు. 21 యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయన్నారు. 22, 23వ తేదీల్లో మేడారం జాతరను పురస్కరించుకొని సెలవు ఉంటుందన్నారు. 24న వారాంతపు సెలవు ఉన్నప్పటికీ మిర్చి క్రయవిక్రయాలు జరుగుతాయని, 25న ఆదివారం సెలవు ఉంటుందని తీర్మానంలో పేర్కొన్నారు. తిరిగి సోమవారం యాథావిధిగా అన్ని రకాల పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు చేపడతామని, రైతులు ఈ విషయాన్ని గ్రహించి సహకరించాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.