ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 14: ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇంటర్ పరీక్షలను ఎదుర్కోవడం కొంత కష్టంగానే ఉంటుంది. అవగాహన లేమి, ఆందోళన సహా ఇతరత్రా కారణాలతో ఇంటర్ ఉత్తీర్ణత శాతం అత్యధిక కాలంగా 60 శాతానికి మించట్లేదు. ప్రశ్నాపత్రం ఎంత కఠినంగా వస్తుందో, పరీక్ష ఎలా రాయాలో, ఎన్ని మార్కులు వస్తాయో, తక్కువ మార్కులు వస్తే చదువులో వెనుకబడుతామేమో అనే ప్రశ్నలు విద్యార్థులను వేధిస్తుంటాయి. ఇలాంటి ప్రశ్నలతో విద్యార్థులకు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పూర్తిగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పరీక్ష రోజు ఏం చేయాలి. పరీక్ష హాల్లో, పరీక్ష రాసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా చేస్తే మంచి మార్కులు వస్తాయి? అనే అంశాలపై‘నమస్తే’ ప్రత్యేక కథనం.
పరీక్ష ప్రారంభమయ్యాక..
ప్రశ్నాపత్రం చేతికందిన వెంటనే దానిపై హాల్ టికెట్ నెంబర్ను తప్పనిసరిగా రాయాలి. పరీక్ష పత్రాన్ని ప్రశాంతంగా చదవాలి. తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పరీక్ష రాయాలి. తొలుత బాగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. కొట్టి వేతలు లేకుండా చూసుకోవాలి. పేరాగ్రాఫ్లుగా విభజించి రాయాలి.
ఆత్మవిశ్వాసంతో…
పరీక్షా కేంద్రానికి వెళ్తున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బస్సులోనో, ఆటోలోనో కొత్తగా చదవకూడదు. కొత్త అంశాల గురించి ఆలోచించకూడదు. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆత్మ విశ్వాసంతో ఉండాలి. పరీక్ష కేంద్రానికి వెళ్లాక ఇంకా సమయం ఉంటే ముఖ్యమైన అంశాలను మననం చేసుకుంటే చాలు. పరీక్షకు బాగా సన్నద్ధమైనట్లు మానసికంగా సిద్ధపడాలి. నిర్ణీత సమయాల్లో మాత్రమే చదవాలి. రాత్రి పూట ఎక్కువ సమయం మెళకువతో ఉండకుండా చూడాలి. నిద్ర లేకుండా గడపి ఒత్తిడికి లోను కావొద్దు.
ఆందోళన వద్దు..
పరీక్ష ఉన్న రోజు టెన్షన్ పడితే మొదటికే మోసం వస్తుంది. ఇతర విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోకుండా చదివానని, పరీక్షను సమర్థంగా రాస్తాననే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. పరీక్షకు వెళ్లే ముందు హాల్టికెట్ను, ఐడెంటిటీ కార్డును తీసుకెళ్లాలి. కొత్త పెన్నులు, పెన్సిళ్లు తీసుకెళ్తే మంచిది. నిమిషం నిబంధన ఉన్నందున కనీసం అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం శ్రేయస్కరం. రాత్రి 11 గంటలకు మించకుండా చదివి ప్రశాంతంగా నిద్ర పోవాలి. మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటలకే ప్రశాంతంగా నిద్ర లేచి కొద్దిసేపు చదువుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఓ గ్లాస్ వేడి పాలు తాగడంతో శక్తి, ఉత్సాహం కలుగుతాయి.
చేయకూడనివి..
సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలాక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి తీసుకెళ్లొద్దు. హాల్టికెట్ తప్ప ఇతర పత్రాలను కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్టికెట్ నెంబర్ను అడిషనల్, బిట్ పేపర్, మ్యాప్, ఇతర షీట్లలో రాయకుడదు. విద్యార్థులు పేరు, సంతకం సహా ఏ విధమైన గుర్తింపు చిహ్నాలూ సమాధాన పత్రంలో రాయొద్దు.
సానుకూల దృక్పథమే ఆయుధం..
భయం వల్ల అలజడి కలిగి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. సానుకూల దృక్పథమే ఆయుధం. క్లాసులో పాఠాలు చెప్పడంతోపాటు పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంతో బట్టీ విధానం వద్దు. ఒత్తిడి లేకుండా చదవాలి. అర్థం కాని అంశాలపై సబ్జెక్టు లెక్చరర్లు మెళకువలు వివరించారు.
-కేఎస్ రామారావు, నయాబజార్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్
ప్రశాంతంగా ఉండాలి..
పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఒత్తిడి లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పక్క విద్యార్థి ఎలా చదువుతున్నాడనే విషయం గురించి ఆలోచించి ఆందోళన చెందొద్దు. ఒత్తిడికి గురైతే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.
– డాక్టర్ కొల్లి అనుదీప్, ఎండీ, ఆయు హాస్పిటల్
జీవితంలో ఇంటర్ కీలక దశ..
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ అనేది అత్యంత కీలక దశ. పై తరగతులకు ప్రవేశించడానికి నిర్ణయాత్మక దశ. తల్లిదండ్రులు, అధ్యాపకులు, యాజమాన్యాలు విద్యార్థుల వ్యక్తిత్వ, విద్యా వికాసాలపై దృష్టి పెట్టాలి. సానుకూల దృక్పథాన్ని నింపి విజేతలుగా తీర్చిదిద్దాలి.
– అట్లూరి వెంకటరమణ, వ్యక్తిత్వ వికాస నిపుణుడు