గతంలో పంట వేయడానికి విత్తనాల దగ్గర నుంచి పంట అమ్మేదాక దళారుల రాజ్యం నడిచేది. కానీ ఇయ్యాల ఆ పరిస్థితి లేదు. ఇదంతా కూడా ధరణి పోర్టల్ వల్లనే సాధ్యమైంది. ధరణితో రైతుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి ఎన్ని ఎరువులు కావాలి, ఎప్పటికి కావాలో సమయానికి పంపిస్తున్నారు. పంట అమ్మిన పైసలు కూడా ధరణి ద్వారానే వస్తున్నాయి. ఇన్ని విధాలుగా రైతులు లబ్ధి పొందుతుంటే ధరణిని తీసేస్తామని చెప్పడం రైతులకు చేటు చెయ్యడమే. అప్పుడు సాగు మొదలెట్టిన దగ్గర నుంచి దళారీల రాజ్యమే.. ఇక పంట అమ్మడానికి అయితే నానా కష్టాలు పడేటోల్లం. ఇయ్యాల పంట అమ్మేటప్పుడు పట్టాదార్ పాస్ పుస్తకం తీసుకుపోతే చాలు ఒక్కల్లకు పైసా ఇవ్వకుండానే మా డబ్బులు మా అకౌంట్లో పడుతున్నాయి. ఇదంతా కూడా ధరణి వల్లనే సాద్యమైంది అందుకే బీఆర్ఎస్ను గెలిపిద్దాం.
మూడు గంటల కరెంటు సాలు అంటే భూములు పడావు పడాల్సిందే. అయ్యాల ఆరు గంటల కరెంటు అని మూడు గంటలు కూడా ఇయ్యలేదు. ఇయ్యాల మల్లా మూడు గంటలు అంటున్నరు. అసలు కరెంటు వస్తదో రాదో తెలియదు. 24 గంటల కరెంటు ఇస్తుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకూ పొలానికి నీల్లు పెడుతున్నం. చీకటి పండగనే ఇంటికి పోయి హాయిగా కంటి నిండా నిద్రపోతున్నం. కానీ అయ్యాల కంటి నిండా నిద్ర లేదు చేతిలో పంట లేదు. అయ్యాల కరెంటు లేక రాత్రిపూట కూడా చేలల్లో పడుకుని ఎప్పుడొస్తదా అని చూసేటోల్లం కంటిమీద కునుకు ఉండేటిది కాదు. కరెంటు లేక సగం పొలం తడిచి సగం తడిచేది కాదు. సగం భూమిలోనే వ్యవసాయం చేసి మిగిలినది పడావు పెట్టేటోల్లం.. మల్లా కాంగ్రెస్ పాలన వస్తే అదే పని అయ్యేటట్లున్నది.
కాంగ్రెసోల్లు చెప్పేవన్ని వట్టి సొల్లు కల్లబొల్లి మాటలు. ఎన్నో ఏండ్ల పాటు అధికారంలో ఉన్నారు. రైతులకు మేలు జరిగి చరిత్రలో మరిచిపోలేని పనులు ఏమైనా చేశారా…?చేస్తే చెప్పమనండి. సీఎం కేసీఆర్ చేసి చూపించిండు. ధరణీని తీసుకువచ్చి భూ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపించిండు. ఎప్పటి నుంచో పట్టా కానీ నా భూమికి ధరణి వచ్చిన తర్వాత పాసు పుస్తకం వచ్చింది. ధరణీ కనుక లేకపోతే నా భూమిని నేను అనుభవించినా రికార్డుల్లో మాత్రం తారుమారయ్యేది. పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. రైతుబంధు వస్తుంది. ఉచిత కరెంట్ అందుతుంది. ఇంకా ఏం కావాలి. ఏ రైతుకైనా రైతు కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఎప్పటికీ కేసీఆర్ సారే సీఎంగా ఉండాలి. నా ఓటు కారు గుర్తుకే వేస్తా.. బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తా…మూడో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలన్నదే నా ఆకాంక్ష.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 24 గంటల విద్యుత్ విధానాలతో వ్యవసాయం పండువగా గ్రామాల్లో విరాజిల్లుతోంది. నాడు ఉమ్మడి పాలకుల విద్యుత్, సాగునీటి విధానాలతో పొలాలను కౌలుకు తీసుకొమ్మని బతిమాలినా రైతులు ముందుకొచ్చేవారు కాదు. పట్నాలకు వెళ్లి పోయేవారు. కానీ నేడు పట్నాలకు వెళ్ళిన రైతులు, కూలీలు తిరిగి వచ్చి వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్నారంటే సీఎం కేసీఆర్ అందిస్తున్న 24 గంటల కరెంట్, కొరత లేకుండా ఎరువులు పంపిణీ…. నాడు పొలాన్ని కౌలుకు తీసుకున్న రైతులు ఏడాది పంట పండి… పంటలు అమ్మిన తర్వాత వచ్చే డబ్బును యజమానికి అందించేవారు. నేడు సంవత్సరం ముందుగానే కౌలుకు పొలాలు పోటీ మరీ తీసుకుంటున్నారంటే…. ఓన్లీ కేసీఆర్…సారే.. చింతకాని మండలంలో కొన్ని గ్రామాల్లో వానాకాలం, యాసంగిలకు వేర్వేరు కౌలు విధానాలు అమల్లో ఉంటాయంటే అతిశయోక్తి కాదు.. వ్యవసాయంలో ఇలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకోచ్చిన కేసీఆర్ మరో 30 యేళ్ళు అధికారంలో ఉండాలని రైతులమంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నాం.
కాంగ్రెసోళ్లు మల్లా వ్యవసాయాన్ని ఆగం చేసే కుట్ర చేస్తున్నట్లుంది. ఇయ్యాల రైతు హాయిగా వ్యవసాయం చేస్తుంటే ఒకల్లు మూడు గంటల కరెంటు సాలు అంటరు, అదేమంటే పెద్ద మోటరు పెడితే సరిపోద్ది అంటున్నారు. మల్లా రైతు బంధు బిచ్చం ఏస్తున్నరు అంటున్నరు. కేసీఆర్ సారు వచ్చినంక హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నం.. ఎప్పుడైనా పొలానికి నీల్లు పెడుతున్నం, పంట పడినంక మా ఊళ్లోనే అమ్ముతున్నం. ఇయ్యాల రైతుకు కరెంటు, నీల్లు, ఎరువులే కాక పండించిన పంటను కూడా కొంటున్నరు, సీదా అకౌంటులోనే డబ్బులు పడుతున్నయ్. ఇంత మంచిగున్న వ్యవసాయాన్ని మూడు గంటలు, అయిదు గంటలు, పెద్ద మోటర్లు అని ఆగం చేసే కుట్ర చేస్తున్నరు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల ఏలుబడిలో పల్లెల్లో పడిన కరెంట్ కష్టాలు మళ్లీ కలలో కూడా రావద్దని, పొలం తడవడానికి రాత్రిపూట గట్లపై జాగారాలు చేసిన విషయాలు పల్లెల్లోని ఏ ఒక్క రైతు మరచిపోలేదు. పదేళ్ల ముందు వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు కరెంట్ ఇచ్చిన పద్దతి.. నేడు సీఎం కేసీఆర్ పాలనలో విద్యుత్ అందిస్తున్న విధానాన్ని రచ్చబండల వద్ద రైతులు పల్లెల్లో మాట్లాడుకుంటున్నారు. మతిలేని రేవంత్రెడ్డి మాటలను యావత్ తెలంగాణ రైతులు గమనిస్తున్నారని, రేవంత్కు, ఆ పార్టీ నాయకులకు భంగపాటు తప్పదు. పల్లెల్లో రైతులు కేసీఆర్ను గెలిపించుకోని 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను వ్యవసాయరంగానికి ఇప్పించుకుంటాం.
నాడు వ్యవసాయం చేయాలంటే కరెంటుతో పాటు సీజన్ ప్రారంభంలో విత్తనాలకు చాలా ఇబ్బందిగా ఉండేది. మా మండలంలో రెండు సొసైటీ కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు అందించేవారు. రాత్రికి వెళ్లి క్యూలో నిల్చుని ఎరువులు విత్తనాలు తెచ్చుకునే వాళ్లం. కొన్ని సార్లు చెప్పులు, బస్తాలను క్యూ లైన్లో పెట్టేవాళ్లం. పోలీసులు రైతులపై లాఠీలు విదిల్చిన సందర్భాలు మరచిపోలేదు. కానీ నేటి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తో పాటు సహకార కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతుల డిమాండ్కు తగినన్ని ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అధికారులు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. పదేళ్లుగా వ్యవసాయ, సహకార సంఘ అధికారులు పక్కా ప్రణాళికతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నారు. సహకార కేంద్రాల్లో రైతుల అవసరాలకు తగ్గట్టుగా ముందుగా ఎరువులు అందుబాటులో ఉంచుతున్నారు.
ధరణి వచ్చాక రైతుల జీవితాలు కుదుటపడ్డాయి. తమ భూములకు ఢోకాలేదని గుండెలమీద చేయివేసుకుని హాయిగా ఉన్నాం. సీఎం కేసీఆర్ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైతుల కష్టాలు తీర్చేందుకు ధరణి పోర్టల్ రూపకల్పన చేశారు. వ్యవసాయ భూముల వివరాలు పొందుపరిచి పాస్బుక్లు ఇవ్వడంతో రైతుల కష్టాలు తీరాయి. రైతులు వచ్చి వేలిముద్ర వేస్తే కానీ భూమి పట్టా మార్పిడి జరగదు. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు రైతుబీమా, పంట కొనుగోలు వంటి ప్రయోజనాలు కలిసివచ్చాయి. కానీ కాంగ్రెస్ నాయకులు ధరణిని తీసేస్తామంటే మళ్లీ రెవెన్యూ రికార్డులు తారుమారై గ్రామాల్లో గొడవలు ప్రారంభమవుతాయి. కాంగ్రెస్ పాలన మాకొద్దు… కేసీఆర్ పాలనే ముద్దు.
గతంలో కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ భూములు అమ్మాలన్నా… కొనాలన్నా దళారులను ఆశ్రయించి రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ధరణి వచ్చాక ఆ పరిస్థితి లేదు. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి క్రయ, విక్రయాలు నిముషాల్లో జరిగిపోతుంది. ధరణి తీసేస్తే మళ్లీ దళారులను పట్టుకుని రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ పరిస్థితి మాకొద్దు. ధరణి ఉండాలి…. కేసీఆర్ రావాలి.