భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం: వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు అధికారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లెఫ్ట్ వింగ్ ఎక్స్రీమిజం(ఎల్డబ్ల్యూఈ) నిధులను పక్కాగా వినియోగించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్లోని సీఎంవో కార్యాలయంలో గురువారం ఆయన భద్రాద్రి జిల్లాలో చేపట్టిన ఎల్డబ్ల్యూఈ పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఏజెన్సీలో రహదారులు, బ్రిడ్జీల నిర్మాణంలో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు.
జిల్లావ్యాప్తంగా 76 పనులను రూ.341 కోట్లతో చేపట్టామని అధికారులు మంత్రికి వివరించారు. ఆయా పనుల్లో కేవలం 38 రహదారులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. మరో ఏడు రహదారులకు అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందన్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన అటవీశాఖ అనుమతులు ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఏజెన్సీలో వ్యవసాయ రంగ అభివృద్ధి జరగాలంటే రహదారులతోనే సాధ్యమన్నారు. అభివృద్ధి పనులు సత్వరం పూర్తి చేసి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు.