ఖమ్మం జనవరి 16 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలో ఈనెల 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభతో దేశంలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని సభ ఇన్చార్జి, రాష్ట్ర ఆర్థిక, వైదారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో సోమవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు మాటలు చెప్పి, గుజరాత్కు మూటలు తరలిస్తున్నదన్నారు. ఖమ్మం సభ చరిత్రాత్మకమైన సభ అన్నారు.
తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో కరీంనగర్లో టీఆర్ఎస్ మొట్టమొదటి సభ సింహగర్జన సభ జరిగిందని, ఈ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిందన్నారు .టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అవతరించిన తరువాత ఖమ్మం సభ కూడా అలాగే రాజకీయాలను మలుపు తిప్పుతుందన్నారు. మలి దశ ఉద్యమానికి ఖమ్మమే స్ఫూర్తి అన్నారు. నాడు కేసీఆర్ ఉద్యమించినప్పుడు అప్పటి పాలకులు ఆయన్ను ఖమ్మం జైలుకు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఖమ్మం ప్రజలు ఆయనకు అండగా నిలబడి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసేలా స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఉద్యమానికి జర్నలిస్టులు, టీఎన్జీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, కార్మికులు, విద్యార్థులు అందించిన స్ఫూర్తి వెలకట్టలేనిదని కొనియాడారు. అదే ఖమ్మం ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు వేదిక కాబోతున్నదన్నారు. 100 ఎకరాల సువిశాల స్థలంలో జరిగే ఈ సభ చరిత్రలో కని వినీ ఎరుగని రీతిలో జరుగుతుందన్నారు. సభా స్థలికి తూర్పు వైపున 230 ఎకరాలు, పడమర వైపు 210 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 20 పార్కింగ్ స్థలాలను గుర్తించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
18న రెండో దశ ‘కంటి వెలుగు’ ప్రారంభం
మొదటి దశ ‘కంటివెలుగు’ మెదక్ జిల్లా తుప్రాన్ మండలంలోని మల్కాపూర్లో ప్రారంభమైందన్నారు. ఇలాంటి శిబిరాలు నిర్వహించడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి అని కొనియాడారు.. 18న ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన తరువాత భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్తో కలిసి రెండో దశ ‘కంటి వెలుగు’ ప్రారంభించనున్నారని మంత్రి హరీష్రావు తెలిపారు. కళ్లజోళ్లు అవసరమైన ఆరుగురికి అక్కడే పంపిణీ చేస్తారన్నారు. ఒక గ్రామంలో శిబిరం ఎలా నిర్వహిస్తామో అలాగే వేదికపై ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ అతిథులకు కార్యక్రమం గురించి వివరిస్తారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభమై 4:30 గంటలకు పూర్తవుతుందన్నారు. సభకు అతిథులుగా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొంటారన్నారు. సభ అనంతరం తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా అతిథులను పోచంపల్లి శాలువాలతో సత్కరిస్తామన్నారు. కరీనంగర్కు చెందిన చేతివృత్తిదారులు తయారు చేసిన జ్ఞాపికలు అందజేస్తామన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గాయకుడు సాయిచంద్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారన్నారు.
కేసీఆర్ ఎంత ఎదిగితే రాష్ర్టానికి అంత లాభం..
చరిత్రలో ఖమ్మం బీఆర్ఎస్ సభకు ఒక ప్రత్యేక మైన స్థానం ఉందని, సభకు అంచనాలకు మించి జనం వస్తారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఉత్తేజభరితంగా సభ సాగుతుందన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభమన్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంత కీలక పాత్ర పోషిస్తే రాష్ట్ర ప్రజల అంత గౌరవం అంత పెరుగుతుందన్నారు. స్వరాష్ర్టాన్ని సాధించి, రాష్ర్టాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఘనత కేసీఆర్దేనన్నారు. ఒకప్పుడు ‘బెంగాల్లో ఏం అమలవుతుందో దేశమంతా అదే అమలయ్యేది..’ అనే నానుడి ఉండేదని, దానిని తిరగ రాస్తూ ఇప్పుడు ‘తెలంగాణ ఏది ఆచరిస్తుందో దేశమంతా అదే ఆచరిస్తున్నది..’ అనే నానుడి బయటకు వచ్చిందన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలనే కేంద్ర ప్రభుత్వం పేర్లు మార్చి అమలు చేస్తున్నదన్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ మానిఫెస్లోల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు పెడుతున్నాయన్నారు. ఉమ్మడి పాలనలో నాటి నేతలు ‘తెలంగాణ వస్తే ఇక్కడి వారికి పరిపాలించడం చేతకాదు..’ అని ఎద్దేవా చేశారని, కానీ ఇప్పుడు ఆ రాష్ట్రమే దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే పాలనలో ముందున్నదని అభిప్రాయపడ్డారు. దేశానికే దిక్సూచిగా మారిందని కొనియాడారు. ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఆయా రాష్ర్టాల రైతులు తమ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ఈ పరిస్థితి కనిపిస్తున్నదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరహద్దు ప్రాంతాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.
కర్ణాటకు చెందిన ఓ ఎమ్మెల్యే వద్దకు ప్రజలు వెళ్లి తమను తెలంగాణలో కలపండని కోరారన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాల వంటివే దేశవ్యాప్తంగా అమలు కావాలని రైతాంగం కోరుకుంటున్నదన్నారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఇంతమంది జాతీయ నాయకులు వస్తున్నారంటే దానికి కారణం ఒక్క కేసీఆరేనన్నారు. ఆయన పరిపాలన దక్షతను చూసి సభకు విచ్చేస్తున్నారని కొనియాడారు. ఈ పరిణామాన్ని రాష్ట్ర ప్రజలూ స్వాగతిస్తున్నారన్నారు. మలిదశ ఉద్యమంలో జర్నలిస్టుల సహకారం మరువలేనిదన్నారు. సమావేశంలో సత్తుపల్లి, పాలేరు, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య పాల్గొన్నారు.
ఒక్కో బాధ్యత ఒక్కొక్కరికీ..
పార్కింగ్కు సబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సభావేదిక ఏర్పాట్లను టీఎస్ ఐడీసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మీడియా బాధ్యతలను రావుల శ్రీధర్రెడ్డి, ఆర్జేసీ కృష్ణ, వలంటీర్ల బాధ్యతలను పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు వ్యవహరిస్తారన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి జనసమీకరణకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మధిర నియెజకవర్గానికి జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఇల్లెందు నియోజవర్గానికి ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, టీఎస్ వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, వైరా నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు రాములునాయక్, క్రాంతికిరణ్, మరో కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, పాలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని నియమించామన్నారు.
ఖమ్మం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని సమీకరిస్తున్నామన్నారు. మిగిలిన నియోజకవర్గాలు దూరంగా ఉండడంతో అక్కడి నుంచి ముఖ్యనాయకులు మాత్రమే హాజరవుతారన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని జిల్లాకేంద్రంతో పాటు డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాలు, సూర్యాపేట జిల్లాలోని జిల్లాకేంద్రంతో పాటు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలు, తుంగతుర్తిలోని కొంత భాగం నుంచి జనసమీరణ చేస్తున్నామన్నారు. సభకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలు సభకు విచ్చేస్తున్నారన్నారు. సభకు వచ్చేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారన్నారు. వారి కోసం ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, లారీలు, ఆటోలు సమకూరుస్తున్నామన్నారు. ఖమ్మం, వైరా నియోజకవర్గాల నుంచి ప్రజలు సభకు కాలినడకన వస్తున్నారన్నారు. సత్తుపల్లి ప్రాంతం నుంచి వచ్చే వారు ఏపీ నుంచి వాహనాలు సమకూరుస్తున్నారన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యనాయకులు వారికి కేటాయించిన గ్యాలరీలో కూర్చుంటారన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, అఖిలేష్ యాదవ్ను మంత్రి శ్రీనివాస్యాదవ్, కేరళ ముఖ్యమంత్రి విజయన్ను రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాను బీఆర్ఎజ్ సీనియర్నాయకుడు దాసోజు శ్రావణ్ రిసీవ్ చేసుకుంటారన్నారు. ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు 17వ తేదీ రాత్రి హైదరాబాద్ చేరుకుంటారన్నారు. 18వ తేదీ ఉదయం సీఎం కేసీఆర్తో కలిసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తారన్నారు. అనంతరం రెండు హెలికాఫ్టర్లలో యాదాద్రి వెళ్లి లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకుంటారన్నారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా అవే హెలికాఫ్టర్లలో ఖమ్మం చేరుకుంటారన్నారు.