ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 24 : ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల నిర్వహణలో లోపాలు ఏర్పడకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సూచనలు చేస్తున్నారు. ప్రతి సెంటర్కు సిట్టింగ్ స్కాడ్లను నియమించడంతోపాటు వారిలో పూర్తి స్థాయిలో విద్యాశాఖేతర అధికారులను ఉంచుతున్నారు. పరీక్షలు విజయవంతం అయ్యేందుకు, ఆరోపణలకు తావు లేకుండా ఉండేందుకు పర్యవేక్షణ అధికారులను నియమించారు. మరో పది రోజుల్లో ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు 101 రెగ్యులర్ కేంద్రాలు, ప్రైవేట్ విద్యార్థులకు మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు 20 కేంద్రాలను సీ – కేటగిరీ కేంద్రాలుగా (సమస్యాత్మక) గుర్తించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించడంతోపాటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 3న ప్రారంభమయ్యే ఈ పరీక్షలు 11 ముగియనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
కేంద్రానికో సిట్టింగ్ స్కాడ్..
గతంలో నిర్వహించిన పరీక్షల్లో కేవలం ‘సీ’ సెంటర్లు, ఆరోపణలు ఉన్న కేంద్రాల వరకే సిట్టింగ్ స్కాడ్లను నియమించేవారు. ఫ్లయింగ్ స్కాడ్లు ఎన్ని తిరిగినా కేంద్రాల్లో జరుగుతున్న తీరుపై కొంత అనుమానాలు ఉండేవి. ఈ నేపథ్యంలో పకడ్బందీ నిర్వహణకు కలెక్టర్ ప్రత్యేకంగా అన్ని కేంద్రాలకు సిట్టింగ్ స్కాడ్లను నియమించాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖాధికారులు జాబితా సిద్ధం చేసి ఆమోదించడం పూర్తయింది. 101 రెగ్యులర్ కేంద్రాల్లో విద్యాశాఖతో సంబంధం లేని వ్యవసాయ, రెవెన్యూ, పీఆర్, ఎన్నెస్పీ విభాగాల్లోని సీనియర్ అసిస్టెంట్లను సిట్టింగ్ స్కాడ్లుగా నియమించారు. వీరికి పరీక్షలకు రెండు రోజుల ముందు విధులపై సూచనలు చేసి అవగాహన కల్పించనున్నారు.
జబ్లింగ్ పద్ధతిలో విద్యార్థుల కేటాయింపు..
పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల కేటాయింపులు సైతం ఊహించని విధంగా మల్టిపుల్ జంబ్లింగ్ పద్ధతిన కేంద్రాలు కేటాయించారు. ఒక పాఠశాలలో చదివే 40 మంది విద్యార్థులకు 8కి పైగా పాఠశాలల్లో కేంద్రాలు వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంతోపాటు పరీక్షలు రాసేందుకు అవసరమైన, అనువైన వాతా వరణాన్ని కల్పించేలా చర్యలు తీసుకున్నారు. 503 పాఠ శాలల నుంచి పరీక్షలు రాసే 16,872 మంది విద్యార్థులను 103 కేంద్రాల్లో సర్దుబాటు చేయాలి. ఇక్కడ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను అత్యధిక మందిని ఒకే స్కూల్కు కేటాయించకుండా చర్యలు తీసుకుంటూ దగ్గరలోని కేంద్రాల్లో విభజించాలి. ఈ దఫా జరుగుతున్న కేంద్రాలన్నీ ప్రభుత్వ యాజమాన్య పరిధిలోనివే కావడంతో నిర్వహణలో పెద్దగా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
విధుల కేటాయింపుల్లోనూ..
పరీక్షలు ప్రారంభమయ్యే రోజు నుంచి పరీక్షలు ముగిసే వరకు నిర్వహణ ప్రక్రియలో ఆరోపణలకు ఆస్కారం లేకుండా కలెక్టర్ మార్గదర్శకాలతో, విద్యాశాఖ కమిషనర్ సూచనలతో డీఈవో సోమశేఖరశర్మ పర్యవేక్షణ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో కీలకమైన సీఎస్లు, డీవోల విధులు నిర్వర్తించే అధికారులతోపాటు కస్టోడియన్, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్కాడ్స్, సిట్టింగ్ స్కాడ్స్లుగా ఆయా విభాగాల్లో నిపుణులు, సమర్థుల సేవలను వినియోగించేలా కేటాయింపులు చేశారు. రెగ్యులర్ కోసం కేటాయించిన 101 కేంద్రాల్లో ‘ఏ’ కేటగిరీ కేంద్రాలు-64, ‘బీ’ కేటగిరీ కేంద్రాలు-17, ‘సీ’ కేటగిరీ కేంద్రాలు-20 ఎంపిక చేశారు. 2,266 మందికి ఇన్విజిలేటర్లుగా విధులు కేటాయించారు.
ప్రశ్నపత్రాల పంపిణీ..
టెన్త్ ప్రశ్నపత్రాలను రాష్ట్ర పరీక్షల విభాగం నుంచి స్పెల్స్ వారీగా అందజేయనున్నారు. మొదటి స్పెల్లో రెండు సెట్ల ప్రశ్నపత్రాలు మార్చి 18 నాటికే జిల్లాకు రాగా.. వాటిని ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. రెండో స్పెల్లో ప్రశ్నపత్రాలు పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి చేరుకుంటాయి. తొలివిడతలో వచ్చిన ప్రశ్నపత్రాలను ఏడీ, పరీక్షల విభాగం ఏసీలు పరీశీలించారు. ప్రతీ కేంద్రంలో ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక కానిస్టేబుల్ ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.