ఖమ్మం, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ సభ్యుల పదవుల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం ఖరారైన సంగతి తెలిసిందే. ఆయా పదవులకు మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రక్రియ తర్వాత బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన రేణుకా చౌదరి, అనిల్కుమార్ యాదవ్ నామినేషన్లు మాత్రమే మిగిలాయి. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవంగా లాంఛనమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వారి ఎన్నికను ధ్రువీకరించింది. తాజాగా పెద్దల సభకు వెళ్లే ముగ్గురిలో ఒక్క ఖమ్మం జిల్లా నుంచే ఇద్దరు ఉండడం విశేషం. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి రాజ్యసభ సభ్యులుగా వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, లోక్సభ సభ్యుడిగా నామా నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తుండగా, వీరిలో వద్దిరాజుకు తిరిగి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా గారపాటి రేణుకా చౌదరికి ఆ పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. దీంతో జిల్లా నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు పెద్దల సభలో తమ గొంతుక వినిపించే అవకాశం ఉందని, మున్ముందు జిల్లా ప్రజలకు మరింత మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ అధిష్ఠానం రెండేళ్ల క్రితం వద్దిరాజుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. వద్దిరాజు మొదటి నుంచీ పార్టీకి విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల గొంతుకను వినిపించారు. గత శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకుని అభ్యర్థుల గెలుపునకు శాయశక్తులా కృషి చేశారు. ఫలితాలు ఏమైనప్పటికీ ఆయన కృషి మాత్రం ఎనలేనిది. ఆయనకు ఇప్పటికే వ్యాపారవేత్తగా జిల్లాలో పేరున్నది. అలాగే సౌమ్యుడిగా, పేదల పెన్నిధిగా పేరు తెచ్చుకున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజును ప్రకటించడంపై గులాబీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. రాజ్యసభ పరిధిలో ముగ్గురి స్థానాలు ఖాళీ అవుతుండగా వాటిలో రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, ఒక స్థానం బీఆర్ఎస్కు దక్కాయి. దీనిలో భాగంగా బీఆర్ఎస్ తరఫున వద్దిరాజుకు అవకాశం లభించింది. వద్దిరాజుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వద్దిరాజు ఎన్నికపై గులాబీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
రేణుకా చౌదరి 1999 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజకీయాల్లో అరంగేట్రం చేసి గెలిచారు. తర్వాత 2004 లోక్సభ ఎన్నికల్లోనూ ఖమ్మం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నుంచి పోటీ చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రేణుకా చౌదరికి రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించింది. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో ఆమె కేంద్ర మంత్రిగా పని చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా సీపీఐ ఉన్నది. దీంతో సీపీఐ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత నారాయణ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆ ఎన్నికలకు రేణుకా చౌదరి దూరంగా ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నుంచి రేణుకా చౌదరి పోటీచేసినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా రేణుకాచౌదరికి పేరున్నది. ఆమె ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ అది జరగలేదు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఉన్నప్పటికీ, ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ విషయమై రేణుకా చౌదరినే ఓ సందర్భంలో సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయకపోతే తనదే సీటు అని మీడియా సమక్షంలో ప్రకటించారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రస్తుతం ఆమెకు రాజ్యసభ సభ్యురాలిగా మరో అవకాశం కల్పిస్తున్నది. ఆమె ఎన్నికపై జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.