బోనకల్లు, సెప్టెంబర్ 30 : నాడు సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నెరవేర్చారు. బోనకల్లు మండలం మొత్తానికి దళితబంధు పథకాన్ని ప్రకటిస్తామని సత్తుపల్లిలో శనివారం జరిగిన సభలో మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో దళిత కుటుంబాలు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. ఈ ఏడాది మార్చి 23న సీఎం కేసీఆర్ మొక్కజొన్న పంట నష్టం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు బోనకల్లు మండలం గార్లపాడు, రావినూతల గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు ఎస్సీ మహిళలు తమ కుటుంబాలను ఆదుకొని చింతకాని మండలంలో దళితబంధు పథకం వర్తింపజేస్తున్నట్లు తమకు కూడా ఇవ్వాలని వేడుకున్నారు. దీంతో ఆనాడు సీఎం కేసీఆర్ అన్న మాటలను గుర్తు పెట్టుకొని జడ్పీ చైర్మన్, మధిర బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై క్షుణ్ణంగా ఆలోచించి ఆరోజు మహిళలకు ఇచ్చిన మాటను కమల్రాజు విజ్ఞప్తి మేరకు దళితబంధు పథకానికి బోనకల్లు మండలాన్ని ఎంపిక చేస్తున్నట్లు ఇటీవల స్వయంగా కేసీఆర్యే జడ్పీ చైర్మన్కు తెలియజేశారు. కానీ.. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ సత్తుపల్లిలో జరిగిన బహిరంగ సభలో మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలాన్ని రెండో పైలెట్ ప్రాజెక్టుగా రెండో మండలంగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మండలంలోని 22 గ్రామాల దళిత కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది. ఇప్పటికే ఈ పథకంపై కార్యాచరణ వేగవంతం చేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మండలంలోని దళిత కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నాయి. దళితులంతా మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
దళితవాడలను ధనికవాడలు చేస్తున్నారు
రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. గతంలో మధిర నియోజకవర్గం చింతకాని మండలాన్ని దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించి 3,462 మంది కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున యూనిట్లు మంజూరు చేశారు. అలాగే నియోజకవర్గంలోని బోనకల్లు మండలాన్ని కూడా పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ స్వయంగా సత్తుపల్లి బహిరంగ సభలో ప్రకటించి సంతోషాన్ని కలిగించారు. ప్రతి దళిత వాడను ధనిక వాడ చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లో అర్హులందరికీ 1100 యూనిట్లు మళ్లీ మంజూరు చేస్తున్నారన్నారు.
పెనుబల్లిలో సంబురాలు
పెనుబల్లి, సెప్టెంబర్ 30 : దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేది కేసీఆర్యే, దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అని మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకట్రావు అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా దళితబంధు ప్రతి గ్రామంలో అందరికీ అందిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించడంతో శనివారం రాత్రి వీఎం బంజర రింగ్సెంటర్లో మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, ఎంపీపీ లక్కినేని అలైఖ్య, ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్లతోపాటు, దళిత ప్రజాప్రతినిధులు సంబురాలు ఘనంగా నిర్వహించారు. పారాషిట్లు, బాంబులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేసుకొని సంబురాలు అంబరాన్నంటాయి. ఒక్కసారిగా దళితుల కళ్లల్లో ఆనందం వెల్లువిరిసి జై కేసీఆర్.. జైజై కేసీఆర్, జై కేటీఆర్.. జైజై కేటీఆర్.., జై సండ్ర.. జైజై సండ్ర అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కనగాల వెంకట్రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తారని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో దళితబంధు అందిస్తామని కేటీఆర్ ప్రకటించడం చాలా సంతోషకరమని, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సండ్రకు దళితుల కుటుంబాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పెనుబల్లి సర్పంచ్ తేజావత్ తావునాయక్, సీనియర్ నాయకులు కోటగిరి సుధాకర్బాబు, లక్కినేని వినీల్, సర్పంచ్ మామిడి మైసయ్య, ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కొలికపోగు వెంకటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కొలికపోగు వెంకటేశ్వరరావు, కోట ప్రసాద్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్, పరకాల చంటి, జుజ్జురపు పుల్లయ్య, తుల్లూరి నాగేశ్వరరావు, మద్దెల పుల్లయ్య, పాన్నెం నాగేశ్వరరావు, వంగా గిరిజ, మల్లెల శ్రీను, వంగా చిన్నపండు, మరకాల వెంకి, గంధం దుర్గయ్య, కోట శ్రీను పాల్గొన్నారు.