రఘునాథపాలెం, మే 9 : కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు తాగునీరు అందక, రైతులకు సాగునీరు, కరెంటు లేక నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్నదని, లోక్సభ ఎన్నికల్లో మరోసారి మోసపోయి.. గోసపడొద్దన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఉదయం చింతగుర్తి, చిమ్మపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలతో కలిసి ఖానాపురం హవేలీలో రోడ్ షో, నగర ప్రజలతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ.. ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినోటా ఇదే మాట వినిపిస్తోందన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక విజన్తో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారన్నారు. ఈ ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలిపించుకోవాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని పార్టీ సత్తా నిరూపించుకుంటుందన్నారు.
తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే పార్లమెంట్లో జిల్లా సమస్యలపై గళం వినిపిస్తానని నామా నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లాతో సంబంధం లేని వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా తీసుకొచ్చి పోటీలో ఉంచిందన్నారు. దీనిని విజ్ఞులైన ఓటర్లు గుర్తించి కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుత్తా రవి, గొర్రె శ్రీనివాసరావు, మెంటెం రామారావు, తాతా వెంకటేశ్వర్లు, దొంతు సత్యనారాయణ, గుండ్ల ముత్తయ్య, బచ్చు విజయ్కుమార్, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, దండా జ్యోతిరెడ్డి, కూరాకుల వలరాజు, నాయకులు కొణకంచి వరప్రసాద్, మద్దినేని వెంకటరమణ, అజ్మీరా వీరూనాయక్, పిన్ని కోటేశ్వరరావు, చిలుమూరి కోటి, హెచ్.ప్రసాద్, ఎండీ ఫయాజ్, చిలుకోటి వెంకట సుబ్బారావు, కొట్టే నాగేంద్రబాబు, మేడబోయిన ఉపేందర్, కొట్నాల ఉపేంద్రాచారి, పెద్ద మల్లేశం, కే రాజు, షేక్ మదార్, తోట సుధాకర్, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, తూటిపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.