ఖమ్మం సిటీ, ఆగస్టు 26: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో అడ్మిషన్ల ప్రక్రియ శనివారంతో పరిసమాప్తమైంది. మొదటి విడతలో తెలంగాణ కోటా 78కు గాను 77 సీట్లు, ఆలిండియా కోటా 15కు గాను 13 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ప్రకారం మొత్తం 90 మంది విద్యార్థులు చేరారు. నిబంధనల మేరకు మిగిలిన పది సీట్లను వికలాంగులు, క్రీడలు, ఎక్స్ సర్వీస్మెన్ కోటాల కింద భర్తీ చేయనున్నట్లు తెలిసింది. వారం వ్యవధిలోనే వారికి సైతం అడ్మిషన్ ఇవనున్నట్లు సమాచారం. కాగా, అడ్మిషన్ల సమయంలో పొరపాట్లు, విద్యార్థులకు ఇబ్భందులు తలెత్తకుండా ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు సారథ్యంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం సెప్టెంబర్ 1 న తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఒక్కో విద్యార్థికి వంద మొక్కల టార్గెట్..: మెడికల్ కళాశాలలో నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందించే నిమిత్తం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఒక్కో విద్యార్థి కళాశాలలో 50, దవాఖానలో 50 కలిపి మొత్తం వంద మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్..: తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని విభాగాల్లో పనిచేసేందుకు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 32 మందిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వారిని ఎంపిక చేసేందుకు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు నోటిఫికేషన్ వెలువరించారు. వీరికితోడు వైద్య కళాశాలకు అవసరమైన 59 మంది సీనియర్ రెసిడెంట్లు, 60 మంది హౌస్ కీపర్ల భర్తీకి అనుమతి ఇవ్వాలని నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.
ఇద్దరు సూపరింటెండెంట్ల నియామకం..: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నూతన సూపరింటెండెంట్ రాబోతున్నారని ‘నమస్తే తెలంగాణ’ ముందే చెప్పింది. ఈ నెల 23న కలెక్టర్ గౌతమ్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా ప్రచురించిన కథనంలో పేర్కొంది. ఆ ప్రకారం కేఎంసీకి ఇద్దరు సూపరింటెండెంట్లు నియమితులయ్యారు. డీఎంఈ రమేశ్రెడ్డి, కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశానుసారం ఇప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జనరల్ సర్జన్ హెచ్వోడీ డాక్టర్ బీ.కిరణ్కుమార్ను ఇన్చార్జి సూపరింటెండెంట్గా, ఆర్థోపెడిక్ హెచ్వోడీ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ను ఇన్చార్జి డిఫ్యూటీ సూపరింటెండెంట్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. శనివారం ఇద్దరూ కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. కాగా, సార్వజనీన ఆసుపత్రికి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు త్వరలోనే వైరా వంద బెడ్ల దవాఖానకు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది.