ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 18: పదో తరగతి వార్షిక పరీక్షలు ఖమ్మం జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుండగా విద్యార్థులు సుమారు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తొలి వార్షిక పరీక్ష కావడంతో విద్యార్థులు తమకు ఇష్ట దైవాలకు పూజలు చేయడంతో పాటు తమ హాల్ టికెట్లకు సైతం ప్రత్యేక పూజలు చేయించుకొని పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో 97 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు తెలుగు పరీక్షకు మొత్తం 16,582 మంది విద్యార్ధులకుగాను 16,543 మంది హాజరయ్యారు. 39 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 99.76 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు. ప్రైవేట్లో 58 మంది విద్యార్థులకు గాను 46 మంది హాజరై 12 మంది గైర్హాజరయ్యారు.
ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ తనిఖీ చేశారు. పరీక్ష తీరును, సౌకర్యాలను గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. జేడీ సర్వీసెస్, రెండు జిల్లాల అబ్జర్వర్ పీ.మదన్మోహన్, డీఈవో సోమశేఖరశర్మ కూడా పలు కేంద్రాలను తనిఖీ చేశారు. జేడీ సర్వీసెస్ మదన్మోహన్ జిల్లా మారుమూల ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. తొలుత సీఎస్, డీవోలతో సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. తొలి పరీక్ష కావడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా కేంద్రాల వద్దకు చేరుకుని పరీక్ష కేంద్రంలోకి వెళ్లే వరకు, తిరిగి బయటకు వచ్చే వరకూ అక్కడే వేచి ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు 144 సెక్షన్ను అమలు చేశారు. జిల్లా అబ్జర్వర్ ఐదు కేంద్రాలను, డీఈవో 10 కేంద్రాలను, ఫ్లయింగ్ స్కాడ్స్ బాధ్యులు 40 కేంద్రాలను తనిఖీ చేశారు. కాగా, ఏదులాపురం కేంద్రంలో తనిఖీ చేస్తున్న సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళా ఇన్విజిలేటర్ తన తరగతి గది ఎదుటనే తన కారును పార్కు చేసి ఉంచడాన్ని డీఈవో గమనించారు. దీనిని తీవ్రంగా పరిగణించి ఆమెను విధుల్లోంచి తొలగించారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రెగ్యులర్ విద్యార్థుల కోసం 70, ప్రైవేట్ విద్యార్థుల కోసం 3 కేంద్రాలను కలిపి మొత్తం 73 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 12,341 మందికి హాల్ టికెట్లు జారీ చేయగా 12,286 మంది హాజరయ్యారు. 55 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 74 మందికి గాను 58 మంది హాజరయ్యారు. 16 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 12,344 మంది హాజరై 71 మంది గైర్హాజరయ్యారు. 99.42 శాతం హాజరు నమోదైంది. పరీక్షా కేంద్రాలను డీఈవో వెంకటేశ్వరచారి సందర్శించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయం కంటే గంట ముందుగానే విద్యార్థులు చేరుకోవడంతో సిబ్బంది వారిని పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కలెక్టర్ ప్రియాంక రెండు కేంద్రాలను, జిల్లా పరిశీలకుడు మదన్మోహన్ ఒక కేంద్రాన్ని, ఫ్లయింగ్ స్కాడ్ 28 కేంద్రాలను పరిశీలించారు.
టెన్త్ పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగకూడదని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆదేశించారు. టెన్త్ పరీక్షల ప్రారంభం సందర్భంగా కొత్తగూడెంలోని సింగరేణి హైస్కూల్, సెయింట్ మేరీస్ హైస్కూళ్ల పరీక్షా కేంద్రాలను సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతులు, విద్యార్థుల గురించి చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష సరళిని పరిశీలించారు. మాస్ కాపీయింగ్ జరుగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్డీవో మధు, తహసీల్దార్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.