ఖమ్మం ఎడ్యుకేషన్, మే 5: పది విద్యార్థులపై రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నెలాఖరు నుంచి పది పబ్లిక్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. అధ్యయనంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారూ ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నది. ఇప్పటికే సిలబస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి ఈ నెల 12 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. సీసీఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో సబ్జెక్ట్పై పట్టు సాధించేందుకు ప్రి ఫైనల్స్ నిర్వహిస్తున్నారు. వెనుకబడిన వారిని గుర్తించి పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు వీలుగా మరోసారి ప్రతి సబ్జెక్ట్లో ఆరు ప్రత్యేక ప్రశ్నాపత్రాలు రూపొందించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షల తరహాలోనే సమగ్ర మూల్యాంకణ చేయనున్నారు. కొవిడ్ కారణంగా విద్యాశాఖ పది పరీక్షలను 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు తగ్గించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఒక్కో సబ్జెక్ట్కు ఒక్కో రోజు పరీక్ష అన్నట్లు లెక్క.
పది పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధించేందుకు కృషి చేస్తున్నాం. విద్యాశాఖ ప్రణాళికలు అమలుపరుస్తున్నాం. ప్రధానోపాధ్యాయులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలి. విద్యార్థులు ప్రీ ఫైనల్స్ పరీక్షలు బాగా రాస్తే ఫైనల్ పరీక్షల్లోనూ మెరుగ్గా రాస్తారు.
-ఖమ్మం డీఈవో యాదయ్య