భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను దాటుతున్నాయి. దీంతో ఎండ వేడిమి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప జిల్లా ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఎండలు దంచి కొడుతున్న వేళ బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణ శాఖ కూడా భద్రాద్రి జిల్లాను డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపిస్తోంది. ఏప్రిల్ నెలలోనే 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే.. ఇక మే నెల వస్తే మరీ డేంజర్లో పడినట్లేనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజులపాటు ఇవే ఎండలు కొనసాగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 10 గ్రామాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చుంచుపల్లి మండలం గరిమళ్లపాడు, సుజాతనగర్ మండల కేంద్రం, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం మండల కేంద్రాల్లో 42 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు భద్రాచలం, పాల్వంచ, సీతారాంపురం, ఇల్లెందు, ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు మండల కేంద్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కాగా.. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో జిల్లా ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎండల వేళ జిల్లా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా వారిని అప్రమత్తం చేయాలంటూ సీఎస్ శాంతికుమారి కూడా ఇటీవలే కలెక్టర్ ప్రియాంకను ఆదేశించారు. దీంతో కలెక్టర్ కూడా జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇక వైద్యారోగ్య శాఖ తరఫున ఆ శాఖ జిల్లా అధికారి శిరీష కూడా పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక వైద్యారోగ్య సిబ్బందికి కూడా పలు సూచనలు చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.