‘కాంగ్రెస్ పాలకుల హయాంలో ప్రజాసంక్షేమం అన్న ఊసే లేదు.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యాయి.. సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పాలన సాధ్యం.. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష..’ అని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో శుక్రవారం ఆయన పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు 58, 59 ఇండ్ల పట్టాలు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, బీసీ రుణాలు పంపిణీ చేసి మాట్లాడారు. దీర్ఘకాలికంగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. బీసీల అభ్యున్నతికి రుణాలు, గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలు గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పాలనను బేరీజు వేసి ప్రజలు వచ్చే సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అనంతరం నగరంలోని మంత్రి కార్యాలయంలో బీసీ రుణాలపై రజకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
– ఖమ్మం, జూన్ 9
ఖమ్మం, జూన్ 9:సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆయన సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రంలోని పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కొందరు పగటి వేషగాళ్లు వస్తుంటారని, కేసీఆర్ను గద్దె దింపుతామని ప్రగల్బాలు పలుకుతుంటారని అన్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసీఆర్ను మూడోసారీ ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలోని దోరేపల్లి ఫంక్షన్ హాల్లో శుక్రవారం సంక్షేమ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు 58, 59 జీవోల కింద ఇళ్ల పట్టాలు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, బీసీ రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో వివిధ రకాల పింఛన్ల రూపేణా 37,863 మందికి నెలకు రూ.8.30 కోట్ల చొప్పున ఏడాదికి సుమారుగా రూ.100 కోట్లను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 8,426 మందికి రూ.80 కోట్లు, సీఎంఆర్ఎఫ్ ద్వారా మరో రూ.20 కోట్ల చొప్పున నియోజకవర్గ ప్రలజకు దాదాపు రూ.200 కోట్ల మేర ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. అలాగే నియోజకవర్గంలో 2 వేలమందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు అందించినట్లు చెప్పారు. దశాబ్ది ఉత్సవాలు పూర్తయిన వెంటనే సొంత స్థలం కలిగిన వారు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయాన్ని అందించే ప్రక్రియకు రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో మరో 1,100 దళిత కుటుంబాలకు దళితబంధు ద్వారా లబ్ధి చేకూర్చనున్నట్లు చెప్పారు. కుల, చేతి వృత్తులపై జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందించడం హర్షణీయమని అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ 58, 59 జీవోల కింద నగరంలో ఇప్పటి వరకు 2,500 మంది పేదలకు పట్టాలు అందించినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పునుకొల్లు నీరజ, ఫాతిమా, బచ్చు విజయ్కుమార్, ఆదర్శ్ సురభి, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, పసుమర్తి రామ్మోహన్రావు, వేణుమనోహర్, జ్యోతి, శ్రీవిద్య,. శ్రీకాంత్, శ్రీదేవి, వెంకటేశ్వర్లు, జ్యోతిరెడ్డి, హుస్సేన్, శ్రీనివాస్, లక్ష్మి, గోవిందమ్మ, ఉమారాణి, కమల, రోజ్లీనా, విజయనిర్మల, సరస్వతి, వైష్ణవి, రోషిణి, కరుణ, రమ, లక్ష్మి పాల్గొన్నారు.