ఊరు మేల్కొనక ముందే మేల్కొంటారు.. చెత్తాచెదారంతో నిండిన రహదారులను శుభ్రం చేస్తారు.. గ్రామాలు, పట్టణాలు, నగరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతారు.. మన ఆరోగ్య సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తారు.. వాళ్లే పారిశుధ్య కార్మికులు.. నిజమైన శ్రామికులు.. మే డే సందర్భంగా సోమవారం సీఎం కేసీఆర్ వారికి శుభవార్త అందించారు. ప్రతి కార్మికునికి రూ.వెయ్యి వేతనం పెంచుతున్నామని, వెంటనే ఉత్తర్వులు అమలులో ఉంటాయని ప్రకటించారు. ఈ ప్రకటనపై ఖమ్మం జిల్లావ్యాప్తంగా 3 వేల మంది, భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 2 వేల మంది పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబురపడ్డారు. సత్తుపల్లిలో కార్మికులు వినూత్నంగా కేసీఆర్ చిత్రపటానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం, మే 2: పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. మరో రూ.వెయ్యి వేతనం పెంచి వారి పాలిట దైవంగా నిలిచారు. ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున సఫాయి కార్మికులకు అదనంగా రూ.వెయ్యి వేతనం పెంచడం, అది తక్షణమే అమలయ్యేలా చర్యలు తీసుకోవడంతో సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అనే విషయం మరోసారి రుజువైనట్లయింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా మండలాలు, పట్టణాల్లో సఫాయి కార్మికులందరూ కలిసి మంగళవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేస్తూ తమ కృతజ్ఞతను చాటుకుంటున్నారు. తమ శ్రమకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కానుక అందించారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో 3 వేల మందికి లబ్ధి..
వేతనం పెంపు ద్వారా ఖమ్మం జిల్లాలో సుమారు మూడు వేల మంది పారిశుధ్య కార్మికులకు లబ్ధి చేకూరుతోంది. తమ శ్రమను గుర్తించడంపై పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు రూ.8 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం ఉండగా, మున్సిపాలిటీల్లో సిబ్బందికి రూ.15,500 వరకూ వేతనం వస్తోంది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ప్రతి కార్మికుడికీ మరో రూ.వెయ్యి వేతనం పెరగనున్నది. ఏళ్ల తరబడి అరకొర వేతనాలతో పనిచేసిన పారిశుధ్య సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తొలిసారి రూ.3,500 వేతనాన్ని పెంచారు. తాజాగా మే డే రోజున మరో రూ.వెయ్యి పెంచారు.
భద్రాద్రి జిల్లాలో 2 వేల మందికి..
పారిశుధ్య కార్మికులకు వేతనాల పెంపుతో భద్రాద్రి జిల్లాలో సుమారు 2 వేల మందికి లబ్ధి చేకూరుతోంది. జిల్లాలో నాలుగు మున్సిపాటీల్లో 450 మంది కార్మికులుతోపాటు అదనంగా మల్టీపర్పస్ వర్కర్లు కూడా విధులు నిర్వహిస్తున్నారు. 481 గ్రామ పంచాయతీల్లో 1,557 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. రూ.వెయ్యి అదనపు వేతనం పెంచడంతో పారిశుధ్య కార్మికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సత్తుపల్లిలో సీఎం ఫ్లెక్సీకి పుష్పాభిషేకం..
రూ.వెయ్యి వేతనం పెంచినందుకుగాను సత్తుపల్లిలో సఫాయి కార్మికులు వినూత్న రీతిలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞత తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సండ్ర చిత్రపటాలతో రింగ్ సెంటర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఆయా చిత్రపటాలకు కొబ్బరినీళ్లు, పూలతో అభిషేకం చేశారు.
తెలంగాణలోనే కార్మికుల శ్రమకు గుర్తింపు..
పంచాయతీ కార్మికుల శ్రమకు తెలంగాణలోనే గుర్తింపు లభిస్తోంది. ఇలాంటి గుర్తింపు మరెక్కడా లేదు. మా శ్రమను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మాకు మరో రూ.వెయ్యి వేతనం పెంచడం సంతోషంగా ఉంది. ఇప్పటికే పంచాయతీ కార్మికులకు నెలనెలా వేతనంతోపాటు గౌరవం దక్కుతోంది. ఇప్పుడు మరోసారి వేతనం పెంచడం హర్షణీయం. కార్మికుల కుటుంబాల పక్షాన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-పల్లపు కొండలరావు, పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్, ప్రొద్దుటూరు, చింతకాని
సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడు..
ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశుధ్య కార్మికుల పాలిట దేవుడిగా నిలిచారు. ఎవ్వరమూ అడగకపోయినా మా జీవన పరిస్థితుల గురించి తెలుసుకొని మరో రూ.వెయ్యి చొప్పున వేతనం పెంచారు. ముఖ్యంగా మే డే రోజున కార్మికులకు వేతనాలు పెండచం చరిత్రలో ఎప్పుడూ లేదు. సీఎం కేసీఆర్ ఉన్నంత వరకూ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రావు. సీఎం కేసీఆర్ మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
-సంధ్య, మున్సిపల్ కార్మికురాలు
పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది..
ష్టపడి పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందనేందుకు మేమే ఉదాహరణ. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశాం. అందుకని మా శ్రమను గుర్తించిన సీఎం కేసీఆర్ కార్మికుల దినోత్సవం రోజు మాకు తీపి కబురు చెప్పారు. రూ.వెయ్యి వేతనం పెంచడం చాలా సంతోషం ఉంది. సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
-తేజావత్ సింగ్, పారిశుధ్య కార్మికుడు, సంజయ్నగర్, కొత్తగూడెం
కార్మికులకు మంచి రోజులు..
కార్మికుల కష్టం ఎప్పటికి గుర్తుండి పో తుంది. ఉదయం 5 గంటలకు డ్యూటీ ఎక్కి తే సాయంత్రం వరకు పని చేయాల్సిందే. అలాంటి మా కష్టాన్ని సీఎం కేసీఆర్ సార్ గుర్తించారు. మేము అడగకుండానే మరోసారి రూ.వెయ్యి వేతనం పెంచారు. దానిని తక్షణమే అమలు చేస్తున్నారు. మా కార్మికులతరఫున సీఎం సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలుపుకుంటున్నాం.
-కృష్ణవేణి, పారిశుధ్య కార్మికురాలు, లక్ష్మీదేవిపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం..
మా కష్టాలను, కన్నీళ్లను అర్థం చేసుకొని మా వేతనాలను పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. అనేక సమస్యలు ఉన్పప్పటికీ వాటిని సీఎం కేసీఆర్ తీరుస్తారనే నమ్మకం మాకు ఉంది. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేసి మాకు సమాజంలో గౌరవం ఉండేలా చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే పారిశుధ్య కార్మికులకు సరైన గుర్తింపు లభించింది.
– బి.రమణ, పారిశుధ్య కార్మికురాలు ఖమ్మం
అడగకున్నా వేతనం పెంచారు..
నిత్యం మురుగు కూపంలో పనిచేస్తున్న కార్మికులకు ఊరట కలిగించేలా వేతనాలను పెంచిన సీఎం కేసీఆర్కు మున్సిపల్ కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ దశల వారీగా కార్మికుల వేతనాలు పెంచుతూనే ఉన్నారు. తాజా పెంపుతో కార్మికుల కుటుంబాలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అనేక సందర్భాల్లో కార్మికుల శ్రమను కొనియాడిన సీఎం కేసీఆర్.. ఎవరూ అడగకపోయినా మే డే నాడు వేతనం పెంచారు.
-బుర్రి వినయ్కుమార్, బీఆర్ఎస్టీయూ ఖమ్మం నగర అధ్యక్షుడు
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హాయిగా ఉన్నాం..
గత ప్రభుత్వాలు మమ్మల్ని, మా సమస్యలను పట్టించుకున్న పాపన పోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మాకు ఎంతో గుర్తింపు లభించింది. మా ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. గ్లౌజులు, బూట్లు, యూనిఫాం, సామగ్రి వంటివన్నీ అందించి మా ఆరోగ్యాన్ని కాపాడుతోంది. సఫాయి కార్మికులకు సమాజంలో గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. అందుకే ఈ ప్రభుత్వంలో ఎంతో హాయిగా జీవిస్తున్నాం.
-గార్లపాటి సుధాకర్, పారిశుధ్య కార్మికుడు, ఖమ్మం