ఖమ్మం కల్చరల్, జూన్ 18: తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలంగా రాష్ట్రంలో తెలుగు భాషకు పట్టాభిషేకం జరుగుతోంది. సాహిత్య వికాసానికి, భాషాభివృద్ధికి తెలంగాణ సాహిత్య అకాడమీ అవిరళ కృషి చేస్తోంది. ‘మన ఊరు – మన చరిత్ర’లో వేలాదిమంది విద్యార్థులను భాగస్వాములను చేసి ఆయా గ్రామాల చరిత్రలను లిఖించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలోని లకారం ట్యాంక్బండ్ వద్ద సాహిత్య సదస్సులతోపాటు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ బుక్ ఫెయిర్లో ప్రతి రోజూ సాహితీ సదస్సులు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పుస్తక ప్రదర్శనను సందర్శించిన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ సాహిత్యం, బుక్ ఫెయిర్ గురించి ‘నమస్తే తెలంగాణ’తో కాసేపు ముచ్చటించారు. సాహిత్య అకాడమీ చైర్మన్గానే గాక హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్న ఆయన పలు విషయాలను పంచుకున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత బుక్ ఫెయిర్ నిర్వహణలో వచ్చిన మార్పు ఏమిటి?
గౌరీశంకర్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహా నగరాలకే పరిమితమైన పుస్తక ప్రదర్శన జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు విస్తరించింది. ఖమ్మం జిల్లాలో తొలిసారిగా కవి యాకూబ్ ఊరైన రొట్టమాకురేవు అనే చిన్న గ్రామంలో పుస్తక ప్రదర్శన నిర్వహించాం. ఈ ప్రదర్శనతో కొత్త ఉత్సాహం వచ్చి మరిన్ని గ్రామాలకు విస్తరించాం. ప్రస్తుతం ఈ ప్రదర్శనలు జాతీయ స్థాయికి ఎదగడం ఎంతో ఆనందాన్నిస్తోంది.
జిల్లాలో ప్రోత్సాహం ఎలా ఉంది?
గౌరీశంకర్: ఖమ్మం జిల్లాలో ఏటా క్రమం తప్పకుండా పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నాం. రెండేళ్లుగా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు, పుస్తక ప్రియుల పాత్ర అపూర్వం.
జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల భాగస్వామ్యం ఉందా?
గౌరీశంకర్: జిల్లాలో 200 ఉన్నత పాఠశాలల్లో ఒకే రోజు పుస్తక ప్రదర్శనలు చేశాం. ఈ ప్రదర్శనలు రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచాయి. ఈ ప్రదర్శనలో విద్యార్థులంతా పాల్గొని తమ ఆసక్తిని కనబరచడం మర్చిపోలేనిది. ఈ స్ఫూర్తితో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పాఠశాల స్థాయి ప్రదర్శనలు నిర్వహించాం. ఇలా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలలో ప్రదర్శనలు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాం.
ఖమ్మం ప్రదర్శన వివరాలు ఏమిటి?
గౌరీశంకర్: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాం. ఈ నెల 11 నుంచి 18 వరకు కొనసాగిన ఈ ప్రదర్శనకు అపూర్వ స్పందన వచ్చింది. ఈ ప్రదర్శనకు విశేష స్పందన లభించడం జిల్లా ప్రజల సాహిత్యాభిరుచిని చాటుతోంది.
సాహితీ కార్యక్రమాల వివరాలు ఏమిటి?
గౌరీశంకర్: సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో సాహిత్య అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహించాం. మరుగున పడిన ప్రాచీన సాహిత్యాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టాం. తెలుగు భాషను విశ్వ వ్యాప్తం చేసేందుకు నిరంతర కృషి చేస్తున్నాం.