భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 29 (నమస్తే తెలంగాణ):చరిత్రలోనే నిలిచిపోయేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువమంది పోడు పట్టాలు అందనున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా 1,51,195 ఎకరాల భూమిపై హక్కులు కల్పిస్తూ 50,595 మంది పోడు పట్టాలను అందించనున్నారు. అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న భద్రాద్రిలో 21 మండలాల్లో ఉన్న 726 హేబిటేషన్లలో 332 గ్రామ పంచాయతీల పరిధిలో రైతులు పోడు సాగు చేస్తున్నారు. ఇందులో గిరిజనులు 65,616 మంది 2,41,107 ఎకరాల్లో పోడు చేస్తున్నారు. ఇతరులు 17,725 మంది 58,161 ఎకరాలను సాగు చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఫారెస్టు కమిటీ ద్వారా సర్వే చేయించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది. వారందరికీ శుక్రవారం హక్కు పత్రాలు అందించనుంది. వారికి రైతుబంధును, రైతుబీమాను వర్తింపజేయనుంది. ఇలా ఒకవైపు పోడు రైతులను ఆదుకుంటూనే కొత్తగా మరెవ్వరూ అడవిని ధ్వంసం చేయకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తులో అటవీ భూముల జోలికి వెళ్లబోమంటూ గిరిజనులు అంగీకారానికి వచ్చారు. గిరిజన సంఘాల నాయకులు కూడా దీనికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు.
పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
జిల్లాలో పోడు పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. గురువారం పాల్వంచలోని సుగుణ గార్డెన్స్లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం నిర్వహించే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గానికి 500 మంది చొప్పున మొత్తం 2,500 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 50,595 మందికి పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పట్టాల పంపిణీకి సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.
ఎంపీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి పోడు పట్టాలు తీసుకోనున్న లబ్ధిదారులను మొబలైజ్ చేయాలన్నారు. ఆయా గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్యదర్శులు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని జెడ్పీ సీఈవోకు సూచించారు. ప్రాంగణాన్ని సుందరదంగా ముస్తాబు చేయాలని ఉద్యాన అధికారికి సూచించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేస్తున్నట్లు చెప్పారు. పోడు పట్టాల పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో పట్టాలు తీసుకోనున్న లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు.
భోజనాల వద్ద రద్దీ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో హెలీక్యాప్టర్ ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో మధుసూదన్రాజు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, జెడ్పీ సీఈవో విద్యాలత, డీపీవో రమాకాంత్, డీసీవో వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమాధికారి సంజీవరావు, ఆర్అండ్బీ డీఈ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, డీఆర్వో అశోక్ చక్రవర్తి, ఏవో గన్యా, పాల్వంచ తహసీల్దార్ రంగా ప్రసాద్ పాల్గొన్నారు.