జిల్లాలో 753 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు
రూ.30.12 కోట్లతో అన్ని పల్లెల్లో ఆట స్థలాలు
తొలి విడతగా 43 క్రీడా మైదానాలు ప్రారంభం
వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ కోర్టుల ఏర్పాటు
ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా 5వ విడత పల్లె ప్రగతిలో గ్రామీణ క్రీడా మైదానాలను ప్రారంభిస్తున్నది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 753 గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా 43 క్రీడా మైదానాలను మంజూరు చేసింది. ఈ నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాటిని ప్రారంభించింది. అన్ని గ్రామ పంచాయతీల్లోనూ క్రీడా మైదానాల ఏర్పాటుకు స్థలాలు సేకరిస్తోంది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న చోట రెవెన్యూ అధికారులు గుర్తించి ఎంపీడీవోలకు అప్పగించారు. క్రీడా స్థలాల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ కోర్టులు నిర్మిస్తున్నారు. ప్రతి మైదానం నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.16 లక్షలను ఖర్చు చేస్తున్నది.
కూసుమంచి, జూన్ 7 : తెలంగాణ ప్రభుత్వం క్రీడలకూ పట్టం కడుతోంది. క్రీడల ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి పల్లెల్లోనూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 753 గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిల్లో తొలి విడతగా 43 క్రీడా మైదానాలను మంజూరు చేసింది. ఈ నెల 2న జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున వాటిని ప్రారంభించింది. అన్ని గ్రామ పంచాయతీల్లోనూ క్రీడా మైదానాల ఏర్పాటుకు స్థలాలు సేకరిస్తోంది. క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం 5వ విడత పల్లె ప్రగతిలో గ్రామీణ క్రీడా మైదానాల ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. అంతకుముందు నుంచే ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న చోట రెవెన్యూ అధికారులు వాటిని గుర్తించి ఎంపీడీవోలకు అప్పగించారు. ప్రతీ గ్రామానికి ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నారు. వాటిల్లో వాలీబాల్, కబడ్డీ, కోకో, అథ్లెటిక్స్ కోర్టులు నిర్మిస్తున్నారు. ప్రతీ మైదానం నిర్మాణానికి రూ.4.16 లక్షలను ఖర్చు చేస్తున్నారు. అక్కడి అవపరాలను బట్టి కొంత వరకు నిర్మాణ ఖర్చులు పెంచుతారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈజీఎస్ కింద ఈ మైదానాలను ఏర్పాటు చేస్తున్నారు.
నిర్వాహకుడి నియామకం..
క్రీడా ప్రాంగణం నిర్వహణ బాధ్యతను ఒకరికి అప్పగిస్తారు. వారికి ఉపాధి హామీ ద్వారా వేతనాన్ని చెల్లిస్తారు. ప్రతీ మండలంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి వాటి పర్యవేక్షణ బాధ్యలను అతడికి అప్పగిస్తారు. ప్రతీ క్రీడా ప్రాంగణాన్ని ఒక ఎకరం స్థలంలో ఏర్పాటు చేస్తారు. వాటిల్లో హరితహారం కింద వివిధ రకాలకు చెందిన 300 మొక్కలు నాటుతారు.
విశాలంగా ప్రాంగణాలు..
గ్రామీణ క్రీడా ప్రాంగణాల్లో ముఖ్యంగా కబడ్డీకి 13 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో కోర్టును ఏర్పాటు చేయాలి. మొత్తం మట్టితో నింపాలి. ఆటలు ఆడేవారు కింద పడినా దెబ్బలు తగలకుండా ఉండే విధంగా చూసుకోవాలి. వాలీబాల్కు 26 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో కోర్టును తయారు చేయాలి. 10.5 అడుగుల ఎత్తులో రెండు పోల్స్ పాతాలి. ఖో ఖో కోర్టును 27 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో నిర్మించాలి. ఆరు అడుగుల ఎత్తు ఉండేలా రెండు పోల్స్ పాతి వాటిని మెత్తటి మట్టితో నింపాలి. లాంగ్ జంప్ కోసం 6 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో పిచ్ తయారు చేయాలి. అర మీటరు లోతు నుంచి మెత్తటి మట్టిని నింపాలి.
అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం..
జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తాం. తొలి విడతగా జిల్లాలో 43 మైదానాలను నిర్మించి ఈ నెల 2న ప్రారంభించాం. ప్రతి మైదానాన్నీ ఎకరం స్థలంలో ఏర్పాటు చేస్తాం. దాని చుట్టూ హరితహారం కింద వివిధ రకాలకు చెందిన 300 మొక్కలు పెంచుతాం. ప్రాంగణ పర్యవేక్షణకు ఒక నిర్వాహకుడినీ నియమిస్తాం.
-డీఆర్డీవో విద్యాచందన
క్రీడా మైదానం ఏర్పాటు సంతోషంగా ఉంది..
గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం ఊహించని విషయం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మా గ్రామంలో మైదానం ఏర్పాటు పూర్తయింది. మా గ్రామ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మూడు రకాల ఆటలకు మైదానం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
–బజ్జూరి పద్మావెంకటరెడ్డి, సర్పంచ్, జుఝల్రావుపేట
క్రీడా మైదానాలు గ్రామానికి ఒక మంచి వనరు..
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు చేయడం వల్ల అక్కడి పిల్లలకు, యువతకు చాలా ఉపయోగం. మండలంలో 41 గ్రామ పంచాయతీల్లో స్థలాలు సేకరించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన ఈ నెల 2న జీళ్లచెరువు, జుఝల్రావుపేట గ్రామాల్లో ఈ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాం.
–ఎంపీడీవో కరుణాకర్రెడ్డి
స్థలం ఉంటే వెంటనే ఇస్తున్నాం..
గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం మంచి విషయం. గ్రామాల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. మండలంలో స్థలాల సేకరణ అవకాశం ఉన్న చోట్ల వెంటనే ఏర్పాటు చేస్తున్నాం. క్రీడాకారులు ఈ మైదానాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాయామంతోపాటు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. మరింత మంది యువకులు క్రీడల వైపు మళ్లే అవకాశం ఉంది.
–సునీత, ఏపీవో, నేలకొండపల్లి
యువతకు మంచి అవకాశం..
గ్రామాల్లోని యువత సాయంత్రం వేళల్లో ఆడుకోవటానికి ఈ క్రీడా ప్రాంగణం ఒక వనరుగా ఏర్పడింది. స్థానికంగా మైదానం ఉండడంతో యువకులు, విద్యార్థులు దానిలో ఆటలాడుకుంటారు. పోలీస్ సహా ఇతర ఉద్యోగాలకు అవసరమైన శారీరక దారుఢ్యం సాధించేందుకు ఈ మైదానాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గ్రామాల్లో అనేకమంది యువకులకు ఆటల పట్ల ఆసక్తి ఉన్నా మైదానాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బందులనీన తీరిపోతున్నాయి.
–గోపె వెంకయ్య, పాలే, క్రీడాకారుడు
స్థలాల సేకరణ పూర్తి చేస్తాం..
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాల ఏర్పాటు మంచి పరిణామం. కూసుమంచి మండలంలోని గ్రామాల్లో అవకాశం ఉన్నచోటల్లా క్రీడా మైదానాలకు స్థలాలు సేకరిస్తున్నాం. ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట వాటిని సేకరించి ఎంపీడీవోలకు అప్పగిస్తున్నాం. ఐదో విడత పల్లె ప్రగతిలో క్రీడా మైదానాల ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం గ్రామాలకు ఒక మంచి అవకాశం.
-శిరీష, తహసీల్దార్