మనిషి బతికి ఉండాలంటే ఆక్సిజన్ తర్వాత కావాల్సింది తాగునీరు. ఆ తర్వాతే ఆహారం. ప్రజలందరికీ కనీస సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ నాటి పాలకులు ఈ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నాడు జిల్లా ప్రజలు తాగునీరు సరిగా అందక ఇబ్బంది పడ్డారు. ఇక వీధి నల్లాల వద్ద యుద్ధాలే జరిగేవి. కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి మరీ తాగునీరు తెచ్చుకునేవారు. వేసవిలో నీటిఎద్దడి తీవ్రంగా ఉండేది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనతికాలంలోనే ‘మిషన్ భగీరథ’ చేపట్టారు. ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నారు. దీనిలో భాగంగా పాలేరు ఇన్టేక్ వెల్, జీళ్లచెర్వు డీడబ్ల్యూటీపీ నుంచి జిల్లావాసులకు తాగునీరు అందుతున్నది. పథకం అమలవుతున్న విధానం, ప్రజల తాగునీటి కష్టాలకు చెక్ పెట్టిన తీరుపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
– కూసుమంచి, అక్టోబర్ 12
కూసుమంచి, అక్టోబర్ 12: ఉమ్మడి పాలనలో తాగడానికి గుక్కెడు నీరు లేక ప్రజలు ఇబ్బందిపడ్డారు. వీధి పంపుల వద్ద గంటల కొద్దీ తాగునీటి కోసం నిరీక్షించారు. కిలోమీటర్ల దూరంలోని మంచినీటి బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకున్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘మిషన్ భగీరథ’ పథకం అమలు చేశారు. ఇప్పుడు ఇంటింటికీ శుద్ధజలం అందుతున్నది.
దీనిలో భాగంగా పాలేరు మిషన్ భగీరథ ఇన్టేక్ వెల్ నుంచి 12 మోటార్ల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని 30 మండలాల పరిధిలోని 7 లక్షల కుటుంబాలకు శుద్ధజలం సరఫరా అవుతున్నది. కేంద్రం పరిధిలో మొత్తం 1,050 మంచి నీటి ట్యాంకులు ఉన్నాయి. రోజుకు 125 క్యూసెక్కుల సాగర్ జలాలను ఇరిగేషన్ అధికారులు ‘మిషన్ భగీరథ’కు కేటాయించారు. పాలేరు ఇన్టేక్ వెల్ నుంచి పాత వరంగల్ జిల్లాతోపాటు తిరుమలాయపాలెం మండలానికి శుద్ధజలం తరలించేందుకు అధికారులు 540 కిలోవాట్స్ సామర్థ్యం, 724 హెచ్పీ కలిగిన ఆరు భారీ మోటర్లు, జీళ్లచెరువు డబ్ల్యూటీపీ పరిధిలో 180 కిలోవాట్ల సామర్థ్యం, 240 హెచ్పీ కలిగిన ఆరు మోటర్లు ఏర్పాటు చేశారు.
పాలేరు రిజర్వాయర్ నుంచి పంపుసెట్స్ ద్వారా రా వాటర్ను జీళ్లచెరువు దగ్గర గుట్టపై నిర్మించిన ట్యాంక్లకు తరలిస్తూ అక్కడ ట్రీట్ చేసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ప్రధాన పైప్లైన్ల ద్వారా గ్రామాలకు సురక్షిత నీటిని తరలిస్తున్నారు. జీళ్లచెరువు నుంచి 370 గ్రామాలకు రోజుకు (90 ఎంఎల్టీ) 9 కోట్ల లీటర్ల నీటిని అందిస్తున్నారు. కూసుమంచి మండలంలోని 79 గ్రామాలు, నేలకొండపల్లిలోని 37, ఖమ్మం రూరల్లోని 73, తిరుమలాయపాలెంలో 77, ఖమ్మం అర్బన్(రఘునాథపాలెం)లో 46, ముదిగొండ 32, చింతకాని మండలంలోని 26 గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నారు.
జీళ్లచెర్వు వద్ద ప్రత్యేకంగా నిర్మించిన ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంటెక్వాల్, సంపుల పైప్లైన్ల ఏర్పాటు చేశారు. వీటిద్వారా అధికారులు ఖమ్మం కార్పొరేషన్కు మంచినీటిని అందిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోనే 375 ఆవాస ప్రాంతాల్లో ఒక్కో ఇంటికీ ప్రతిరోజు 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ఒక్కొక్కరికి 100 లీటర్ల నీటిని అందిస్తున్నారు. మొత్తం 706 కిలోమీటర్ల మేర ప్రధాన పైపులైన్లు ఏర్పాటు చేశారు.
తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం మిషన్ భగీరథ డబ్ల్యూటీపీ పరిధి నుంచి మండలంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని సుమారు 300 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతున్నది. అధికారులు పాలేరు నుంచి పైపల్లైన్ ద్వారా మాదిరిపురం వరకు రా వాటర్ను తరలిస్తున్నారు. మిషన్భగీరథ పథకంతో ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
జిల్లా పరిధిలో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తినా తక్షణ స్పందిస్తున్నాం. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పట్టణం నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఎలాంటి సమస్య మా దృష్టికి వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది సహకారం తీసుకుంటున్నాం. ఇప్పటికీ అక్కడక్కడా చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యాం.
– పుష్పలత, ఈఈ