కల్లూరు: తెలంగాణ ప్రభుత్వం కళాశాల విద్యకు పెద్దపీఠ వేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ కుతుంబాక శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, విద్యార్థుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళాశాలలో విద్యార్ధులు చదివేందుకు అన్ని మౌలికసదుపాయాలు కల్పించిందని, ఇంటర్ విద్య పూర్తయిన తర్వాత డిగ్రీతో పాటు ఇతర దేశాలకు వెళ్లేలా ప్రభుత్వం అన్నివిధాలుగా ఏర్పాట్లు చేస్తుందన్నారు.
కళాశాల స్థాయిలో విద్యార్థులు నిరంతరం కళాశాలలకు సక్రమంగా వెళ్లి చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యార్థులు కళాశాలలకు వెళ్లేలా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం కళాశాల అభివృద్ధి కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే సండ్రను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ నిర్వాహకులు పసుమర్తి చందర్రావు, అత్తులూరి రంగారెడ్డి, లక్కినేని కృష్ణ, గొర్రెపాటి రాధయ్య, భద్రయ్య, తోపుడుబండి ఫౌండేషన్ చైర్మన్ సాధిక్అలీ, సొసైటీ చైర్మన్ నర్వనేని అంజయ్య, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.