ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 12: వేసవి సెలవుల తర్వాత పండుగ వాతావరణంలో విద్యాసంస్థలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయడంతోపాటు రంగులు, మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆహ్వానం పలికారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోగా.. తొలిరోజు కొందరు విద్యార్థులు తల్లిదండ్రుల సహాయంతో, మరికొందరు స్వతహాగా స్కూళ్లకు వెళ్లారు. ప్రైవేటు పాఠశాలల బస్సులు రోడ్లపైకి రావడంతో సందడి వాతావరణం నెలకొన్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు చేరిన పాఠ్య, నోట్పుస్తకాలు, యూనిఫాంలను కొన్ని స్కూళ్లలో అందజేశారు.
కొత్త మెనూతో అమలు
ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజు నూతన మెనూ ప్రకారం భోజనంతోపాటు గుడ్డు అందించారు. ఉదయం ప్రార్థనలో విద్యార్థులు తెలంగాణ గేయాన్ని ఆలపించారు. జిల్లాలోని పాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు హెచ్ఎంలు ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేశారు. ప్రతిరోజు పాఠశాలకు వచ్చి మంచిగా చదువుకోవాలని విద్యార్థులను కోరారు. మొదటిరోజు నూతన అడ్మిషన్ల ప్రక్రియతోపాటు పాఠాలు బోధించడంలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు.
39 శాతం హాజరు
ప్రభుత్వ, కేజీబీవీ, లోకల్ బాడీస్ పాఠశాలల్లో తొలిరోజు 39.1 శాతం హాజరు నమోదైంది. జిల్లావ్యాప్తంగా 1 నుంచి పదో తరగతి వరకు 75,362 మంది విద్యార్థులు ఉండగా.. 29,448 మంది హాజరైనట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా ఖమ్మం రూరల్ మండలంలో 49.3 శాతం, చింతకాని మండలంలో 48.2 శాతం, రఘునాథపాలెంలో 47 శాతం విద్యార్థులు హాజరయ్యారు. అతి తక్కువగా సింగరేణి మండలంలో 27.3 శాతం, ఏన్కూర్లో 31.5శాతం హాజరు నమోదైంది. నగరంలోని పలు పాఠశాలలను అకడమిక్ మానిటరింగ్ అధికారి కేశవపట్నం రవికుమార్ తనిఖీ చేశారు. డీఈవో సోమశేఖర శర్మ పెనుబల్లి జడ్పీఎస్ఎస్, వీఎం బంజర ప్రాథమిక, జడ్పీ హైస్కూల్ను సందర్శించారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూన్ 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు తొలిరోజు సోమవారం హాజరయ్యారు. డీఈవో సోమశేఖర శర్మ జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఇప్పటికే అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరాయని, 70 శాతానికి పైగా యూనిఫాంలు అందించినట్లు డీఈవో చెప్పారు. జిల్లాలో మొత్తం 54,696 మంది విద్యార్థులకు.. 28,784 మంది హాజరయ్యారని, 52.62 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో తెలిపారు. ఉపాధ్యాయులు పిల్లలకు అర్థమయ్యేలా విధంగా బోధించాలన్నారు. ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం ఎం.జ్యోతిరాణి పిల్లలకు పువ్వులు ఇచ్చి స్వాగతం పలికారు.
జిల్లాకు చేరిన నోట్ పుస్తకాలు
తెలంగాణ ప్రభుత్వం 6 నుంచి 12వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి నోటు పుస్తకాలను ఉచితంగా అందించనుంది. ఇందులో భాగంగా ఖమ్మం బుక్ డిపోకు నోట్ పుస్తకాలు చేరుకున్నాయి. జిల్లాకు 4,19,885 పుస్తకాలు అవసరం కాగా.. 79,325 పుస్తకాలు గోదాంకు చేరాయి. మరో రెండు రోజుల్లో అన్ని నోట్ పుస్తకాలు రానున్నాయి. సోమవారం మండల కేంద్రాలకు సరఫరా చేసే నోట్ పుస్తకాల ప్రక్రియను బుక్ డిపో మేనేజర్ ఎస్కే రఫీ, సీనియర్ అసిస్టెంట్ ఎండీ సాజిద్ఖాన్, సిబ్బంది పర్యవేక్షించారు.