ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 31: ఉపాధ్యాయులు బదిలీలు, ఉద్యోగోన్నతులకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీ ప్రక్రియ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభమైనప్పటికీ కొందరు కోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయింది. కోర్టు సూచనలతో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమైంది. 3వ తేదీ నుంచి ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నది. ఈ మేరకు డీఈవో సోమశేఖరశర్మ గురువారం కార్యాలయ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు.
వివరాల సేకరణ…
రాష్ట్ర విద్యాశాఖ డైరక్టర్ శ్రీదేవసేన విద్యాశాఖ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో బదిలీలు, ఉద్యోగోన్నతులపై మార్గదర్శకాలు ఇచ్చారు. వెంటనే జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం గురువారం సాయంత్రం నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన పీజీ హెచ్ఎంలు, ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన టీచర్ల వివరాలను సేకరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో సేకరించిన వివరాలతో పాటు ప్రస్తుత డాటాను అదనంగా తీసుకున్నది.
1 సెప్టెంబర్ 2023 వరకు గరిష్ఠ వయసు లెక్కింపు..
విద్యాశాఖ తప్పనిసరి బదిలీకి పీజీ హెచ్ఎంలు ఒకే పాఠశాలలో 5 సంవత్సరాలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఒకే చోట గరిష్ఠంగా 8 సంవత్సరాల సర్వీసును పరిగనలోకి తీసుకోనున్నది. గరిష్ఠ వయస్సు 1 సెప్టెంబర్ 2023 ప్రకారం ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా సిద్ధమైంది. ప్రక్రియ ద్వారా ఖమ్మం జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం జరుగుతుంది. కనీసం రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి బదిలీకి అవకాశం ఉంటుంది. ఎనిమిదేళ్లుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఏలు, ఎస్జీటీలతో పాటు ఇతర కేటగిరీల ఉపాధ్యాయులు 918 మంది బదిలీ, హెచ్ఎంలుగా ఐదేళ్లుగా పనిచేస్తున్న 60 మంది బదిలీ తప్పనిసరి.
నేడు ఎంఈవోలతో సమావేశం..
ఖమ్మం నగరంలోని డీఈవో కార్యాలయంలో శుక్రవారం డీఈవో సోమశేఖరశర్మ ఎంఈవోలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎంఈవోలు మండలవ్యాప్తంగా బదిలీకి అర్హులైన పీజీ హెచ్ఎంలు, ఎస్ఏలు, ఎస్జీటీలతోపాటు ఇతర కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయుల జాబితాతో సమావేశానికి హాజరుకావాల్సి ఉంటుంది.