Fish seeds | తెలంగాణ సిద్ధించిన తొలినాళ్లలోనే గొలుసుకట్టు చెరువులను బాగు చేయాలని కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్.. మిషన్ కాకతీయతో వాటికో రూపం తీసుకొచ్చారు. రెండు పంటలకు నీరందించే స్థాయిలో అభివృద్ధి చేశారు. ‘మత్స్యకారులు సొంతంగా కొనొద్దు.. మేమే ఉచితంగా చెరువుల్లో పిల్లలు పోస్తాం. ఎదిగిన చేపలు అమ్ముకునేందుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం’ అంటూ జిల్లాలోని చెరువుల్లో రూ.4 కోట్ల విలువైన చేప పిల్లలను వదిలారు. ఊరిలో ఏ చెరువు వద్దకు వెళ్లినా చేపలు దొరుకుతాయి.. అనే రీతిన ఉత్పత్తికి సహకరించారు. చెరువులపై ఆధారపడిన రైతులు, మత్స్యకార కుటుంబాలు, పశుపక్షాదులకు వనరులుగా మార్చి నిరంతరం నీరు లభించేలా చేశారు.
మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సరుకు రవాణాకు వాహనాలు, మోపెడ్లు ఇవ్వడంతోపాటు మార్కెటింగ్, రాయితీ సౌకర్యాలు కల్పించారు. 2023-24 సంవత్సరానికి జిల్లాలో 903 చెరువుల్లో 3.5 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు.
– కూసుమంచి, అక్టోబర్ 5
కూసుమంచి, అక్టోబర్ 5 : గత పాలకుల హయాంలో గ్రామాల్లో చెరువులు ఉన్నా వాటిలో నీరు లేదు. వాటిలో పూడిక తీసే నాథుడు లేక ఎడారులుగా మారాయి. చెరువుల కింద ఆయకట్టు పొలాలకు నీరందక బీళ్లుగా మారిన పరిస్థితులు ఉండేవి. బావులు, బోర్లలో నీరున్నా విద్యుత్ సమయానికి రాకపోవడంతో మోటార్లతో పంటలకు నీరందక ఎండిపోయేవి. దీంతో రైతులు కూలీలుగా మారడంతోపాటు ఊళ్లను వదిలి వలసపోయి ఎన్నో ఇబ్బందులుపడ్డారు. చేపల పెంపకానికి చెరువుల్లో నీరు లేక మత్స్యకారులు ఇతర వృత్తులను చేసుకోవాల్సిన దుస్థితి ఉండేది.
కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయతో చెరువులన్నీ బాగుపడ్డాయి. వర్షాలతో చెరువుల్లోకి నీరు సమృద్ధిగా చేరి రెండు పంటలు పండడంతోపాటు మత్స్య సంపద మరింతగా వృద్ధి చెందింది. రైతులకు, మత్స్యకారులకు చేతినిండి పని దొరికింది. అయితే ఉమ్మడి పాలనలో మత్స్యకారులే తలాకొంత వాటాలు వేసుకొని భాగస్వామ్యంతో ఇతర రాష్ర్టాలకు వెళ్లి చేప పిల్లలు కొనుగోలు చేసేవారు. రవాణాతోపాటు చేప పిల్లల కొనుగోలు ఖర్చు కూడా మత్స్యకారులే భరించే వారు. దీంతో పెట్టుబడికి డబ్బులున్న మత్స్యకారులే చేపలు పట్టుకునేందుకు అర్హత కలిగేది. చెరువుల్లో నీరు లేక దొరికిన కొద్ది చేపలు గ్రామానికే సరిపోని పరిస్థితి ఉండేది.
కానీ.. నేడు ప్రతి గ్రామంలో మిషన్ కాకతీయ పనులు పూర్తయిన తర్వాత చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా చేరింది. ఆరేళ్లలో స్వరాష్ట్ర పాలనలో చేపల ఉత్పత్తులు బాగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం మత్స్య సహకార సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో 1.5 లక్షల టన్నుల నుంచి 3.10 లక్షల టన్నులకు చేపల ఉత్పత్తి రెట్టింపు అయ్యిందంటే ఇక్కడ చేపల పెంపకం.. దానిపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ ఎంతో అర్థమవుతోంది. 2023-24 సంవత్సరానికి జిల్లాలో 903 చెరువుల్లో 3.5 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మార్కెట్లో ఐస్ చేపలు, సముద్రపు చేపలు మాత్రమే దొరికేవి.
కానీ.. నేడు బతికున్న(లైవ్) చేపలు అమ్ముతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో కరువు జాబితాలో మొదటి స్థానంలో ఉన్న తిరుమలాయపాలెంలో నేడు చెరువుల్లో భక్తరామదాసు ప్రాజెక్టుతో జలకళ సంతరించుకుంది. దశాబ్దాలుగా నిండని గట్టుసింగారం చెరువు అలుగుపారి నీటితో కళకళలాడుతోంది. కరువుతో సాగునీరందక దినదిన గండంగా మారిన రోజులు పోయి సమృద్ధిగా నీటి నిల్వలతో రెండు పంటలు పండుతున్నాయి. చెరువుల్లో చేపలు పుష్కలంగా లభిస్తున్నాయి. ప్రభుత్వమే మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం, మోపెడ్లు, వాహనాలు ఇవ్వడం, రుణాలు అందించడం, పలు ప్రాంతాల్లో మార్కెటింగ్తో సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నది.
మాంసం కిలో రూ.750కి పైగానే.. చేపలు కిలో రూ.150&
ఇటీవల మాంసకృత్తుల వినియోగం పెరగడంతో కిలో మాంసాన్ని రూ.800లకు పైగానే పెట్టి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో చేపలు రూ.120 నుంచి రూ.150 చొప్పున లభిస్తున్నాయి. దీంతో ఆదివారం వచ్చిందంటే చాలు చేపల మార్కెట్ వద్ద, ద్విచక్ర వాహనాలపై రోడ్ల వెంట బుట్టల్లో పెట్టుకొని అమ్ముకునే వారి వద్ద కొనేందుకు జనం ఎగబడుతున్నారు. ప్రజలు పోటీపడి కొనుగోలు చేస్తుండడంతో ముందు వెళ్లిన వారికే చేపలు దొరుకుతున్నాయి. అయితే బయటి నుంచి దిగుమతి చేసి తెచ్చిన ఐస్ చేపలు మార్కెట్లో నిత్యం లభిస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో మాత్రం స్థానికంగా చెరువుల్లో పట్టిన చేపలను మాత్రమే విక్రయిస్తున్నారు. ధర తక్కువగా ఉండడం.. గ్రామాల్లోని అన్ని చెరువుల్లో చేపలు లభిస్తుండడంతో ప్రజలకు కొంత వరకు ఇబ్బందులు లేకుండా ఉంది.
కొర్రమేన్లు పెంచుతున్నా
చేను వద్ద నాకున్న స్థలంలో చేపల పాండ్ తీసి కొర్రమేను పిల్లలు వేసి పెంచుతున్నా. ప్రస్తుతం అవి కిలో సైజులోకి వచ్చాయి. చేపలు పెంచాలనే మక్కువతో ఒక పాండ్ తీశాను. వచ్చే ఏడాది ఉన్న భూమిలో మరికొన్ని చేపల పాండ్స్ తీసి వాటిల్లో వివిధ రకాల చేపలు పెంచుతాను. చేపలకు మార్కెట్లో మంచి డిమండ్ ఉంది. అదనపు ఆదాయం కోసం రైతులు చేప పిల్లలను పోసి పెంచుకుంటే లాభాలు సాధించొచ్చు. చేపలు పెంచే వారికి గతం కంటే ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నాయి.
– నాగరాజు, రైతు, కేశ్వాపురం
గణనీయంగా మత్స్య సంపద
తెలంగాణ వచ్చిన తర్వాత చేపల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ఉదా.. తిరుమలాయపాలెం మండలంలో ఒక్క చెరువులో చేపలు లేవు. కానీ.. నేడు 20కి పైగా నీటి వనరులు ఉన్న కుంటలు, చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ, రుణాలు, మార్కెటింగ్ సదుపాయం, సమీకృత చేపల మార్కెట్ ఏర్పాటు, మత్స్య కారులకు బీమా ఇలా అనేక వసతులు కల్పించడంతో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. నేడు రాష్ట్రంలోని ఏకైక మత్స్య పరిశోధనా కేంద్రం పాలేరులో ఉంది. అక్కడ చేపల పెంపకం, యాజమాన్య పద్ధతులపై ఇస్తున్న శిక్షణ ఎంతో ఉపయోగపడుతున్నది.
– ఆంజనేయస్వామి, జిల్లా మత్స్యశాఖ అధికారి
2,700 మందికి శిక్షణ ఇచ్చాం
అవసరాలకు తగ్గట్టుగా చేపల ఉత్పత్తి జరగడం లేదు. గతంతో పోలిస్తే మాత్రం రెట్టింపు ఉత్పత్తులు అయ్యాయి. నాలుగేళ్లుగా రైతులు చేపల పెంపకం వైపునకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన మత్స్య రైతులకు ఐదేళ్లలో పాలేరులో వివిధ దశల్లో 2,700 మందికి శిక్షణ ఇచ్చాం. యాజమాన్య పద్ధతులు నేర్పించాం. మహిళా మత్స్యకార కుటుంబాలకు శిక్షణ ఇచ్చాం. చేపల ఉత్పత్తులతో వంటకాల తయారీపై తర్ఫీదు ఇచ్చాం. ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో శిక్షణ ఇస్తున్నాం. గతంతో పోలిస్తే చాలా మంది రైతులు చేప పిల్లలు పెంచడానికి మక్కువ చూపుతున్నారు.
– డాక్టర్ జీ.విద్యాసాగర్రెడ్డి, మత్స్య శాఖ శాస్త్రవేత్త, పాలేరు