ఖమ్మం, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రగతి, పథకాలపై దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి” అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఖమ్మంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అభివృద్ధి, సంక్షేమంలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. భూ క్రయ విక్రయాలు పారదర్శకంగా ఉండేందుకు ధరణి పోర్టల్ ప్రారంభించామన్నారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఖమ్మానికి మెడికల్ కళాశాల మంజూరు చేశారన్నారు. ఈ సందర్భంగా కళాకారులు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, జడ్పీచైర్మన్ కమల్రాజు, కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఖమ్మంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కొనియాడారు. ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం రూ.14.70 కోట్లతో రెండు వెజ్, నాన్-వెజ్ మారెట్లు నిర్మించామన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న గొల్ల, కురుమలకు రూ.205 కోట్లు వెచ్చించి గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం వందశాతం రాయితీపై చేపపిల్లలు పంపిణీ చేశామన్నారు. గత యాసంగిలో 69 ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో 152 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 6,412 మంది రైతుల నుంచి 5,5926.80 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా నాలుగు విడతల్లో చెరువుల్లో పూడిక తీయించామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నామన్నారు.
పారదర్శకత కోసం ‘ధరణి’
భూ క్రయ విక్రయాలు పారదర్శకంగా ఉండేందుకు ధరణి పోర్టల్ ప్రారంభించామన్నారు. తహసీల్దార్లకు జాయింట్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించామన్నారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇచ్చామన్నారు. జిల్లాలో 286 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కొలువులు రెగ్యులరైజ్ చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మానికి మెడికల్ కళాశాల మంజూరు చేశారన్నారు. కలెక్టరేట్, ఆర్అండ్బీ భవనాలను వైద్య కళాశాలకు కేటాయించామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 100 సీట్లతో తరగతులు ప్రారంభ కానున్నాయన్నారు. రెండో విడత కంటి వెలుగులో భాగంగా 5,91,503 వైద్య పరీక్షలు చేసి 1,77,691 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామన్నారు.
మహిళల సంక్షేమంపై శ్రద్ధ..
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారత కోసం పనిచేస్తున్నదని మంత్రి అన్నారు. ప్రతి మంగళ వారం ఎంపిక చేసిన ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. గర్భిణులకు ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు వారి ఖాతాల్లో రూ.44.69 కోట్లు జమ చేశామన్నారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ కోసం నూట్రిషన్ కిట్ అందిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల కోసం తొలిమెట్టు కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామాల్లో 65,807 మరుగుదొడ్లు నిర్మించామన్నారు. డబుల్ బెడ్ రూం పథకం కింద 5,442 మందికి గృహాలను అప్పగించామన్నారు.
దళితబంధుతో మార్పు..
దళితబంధు పథకంలో భాగంగా చింతకాని మండలం ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. దీనిలో భాగంగా మండలవ్యాప్తంగా 3,462 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.346.20 కోట్ల విలువైన యూనిట్లు అందాయి. ఇవి కాక ఐదు నియోజకవర్గాల పరిధిలో 483 మందికి యూనిట్లు అందాయి. మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్య పథకం ద్వారా 71 మంది విద్యార్థులకు రూ.11 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆసరా పథకం ద్వారా ప్రతి నెల వృద్ధులు, వితంతువులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్ అందిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించేందుకు ఎన్నెస్పీ స్థలాన్ని సర్కార్ ‘కేసీఆర్ జర్నలిస్టు మ్యూచవల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్’కు కేటాయించిందన్నారు. అనంతరం టీఎస్ఎస్ కళాకారులు, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, మేయర్ పునుకొల్లు నీరజ, కేఎంసీ కమిషనర్ ఆదర్శ సురభి, జడ్పీ, సుడా, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు లింగాల కమల్రాజు, బచ్చు విజయ్కుమార్, కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, అదనపు కలెక్టర్లు స్నేహలతా మొగిలి, ఎన్.మధుసూదన్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ట్రైనీ ఐఏఎస్లు మయాంక్సింగ్, రాధికా గుప్తా, ట్రైనీ ఐపీఎస్ అభినాశ్, మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ పాల్గొన్నారు.
రైతు సర్కార్..
2014-15లో రైతులు జిల్లావ్యాప్తంగా 1,63,180 ఎకరాల్లో సాగు చేసి 2,93,724 మెట్రిక్ టన్నుల పంటలను ఉత్పత్తి చేశారు. 2022-23 నాటికి సాగు విస్తీర్ణం 2,89,899 ఎకరాలకు చేరుకున్నదన్నారు. పంటల ఉత్పత్తి 7,24,747 మెట్రిక్ టన్నులకు చేరుకున్నదన్నారు. రైతుబంధు ద్వారా 3.16 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. రైతు బీమా పథకం ద్వారా ఇప్పటివరకు 4,268 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా అందిందన్నారు. 6979 మంది ఆయిల్పాం రైతులకు రూ.23.26 కోట్ల సబ్సిడీ అందిందన్నారు. ప్రతి ఐదు వేల ఎకరాల క్లస్టర్కు ఒకటి చొప్పున 129 రైతువేదికలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రుణమాఫీ కింద 2,73,554 మంది రైతులకు సంబంధించిన1,185.15 కోట్ల రణాలు మాఫీ అయ్యాయన్నారు. రైతులు సజావుగా పంటలు సాగు చేసుకునేందుకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.