ఆంగ్లమంటే వారికి భయం లేదు.. అవలీలగా మాట్లాడేస్తారు.. తోటి మిత్రులతో సైతం ఇంగ్లిష్లోనే సంభాషిస్తారు.. వారు అనర్గళంగా మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండాల్సిందే.. వారంతా కార్పొరేట్ స్కూలులో చదవలేదు.. పోస్ట్ గ్రాడ్యు యేట్లు కాదు.. విదేశాల్లో విద్యాభ్యాసం చేయలేదు.. అయినా.. ఇంగ్లిష్ను ఒడిసిపట్టారు. ఈ చిచ్చర పిడుగులు ఎవరోకాదు ఖమ్మం నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థి నులు. ఆ పాఠశాలలో అమలువుతున్న విద్యా విధానాలు, ఉపాధ్యాయులు విద్యార్థులపై తీసు కుంటున్న ప్రత్యేక శ్రద్ధపై ప్రత్యేక కథనం.
ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 10 : ఖమ్మం జిల్లా ఒకప్పుడు వరంగల్లో అంతర్భాగమైన నాటి నుంచి పాఠశాల చరిత్ర ప్రారంభమవుతుంది. బాలికలకు విద్య అందించాలనే ఉద్దేశంతో మీర్జా మహ్మద్, హయల్ బేగ్ 1925లో ఈ పాఠశాలను ప్రారంభించారు. మొదటి ప్రధానోపాధ్యాయినిగా ఫాతీమాబీ, ఉపాధ్యాయురాలిగా ఫాతీమాబీ పనిచేశారు. పాఠశాలకు మొదట్లో శాశ్వత వసతి లేకపోవడంతో రాతిదర్వాజా అజీజ్ గల్లీలో కొంత కాలం తరగతులు నిర్వహించారు. 1969లో ప్రస్తుత భవనంలోకి పాఠశాల వచ్చింది. బడి ఇప్పటికే 97 ఏళ్లు పూర్తి చేసుకుని శత వసంతాల వైపు అడుగులు వేస్తున్నది. నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మొదట్లో సామాన్యమైన ప్రాథమిక పాఠశాలగా ప్రారంభమైంది. ఇప్పుడు మోడల్ స్కూల్ స్థాయికి ఎదిగింది. పాఠశాల యాజమాన్యం దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో విద్యార్థులకు ఒక్కో వసతి సమకూర్చింది.
పాఠశాలకు మొదట ఉర్దూ మీడియంతో ప్రారంభమైంది. ఆ తర్వాత తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియం వచ్చాయి. పేరెంట్స్ కమిటీ, అధికార, పుర ప్రముఖులు సహాయ సహకారాలతో పాఠశాల తరగతి గదులు సమకూరాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు విద్యార్థుల చదువుకోవడానికి సహకరించాయి. విద్యార్థుల కోసం వైద్యశిబిరాలు నిర్వహించాయి. విద్యాసామగ్రి అందించాయి. వారందరి సహకారంతో పాఠశాల దినదినాభివృద్ధి చెందింది.
‘ఆంగ్ల మాధ్యమంలో చదివితే జీవితంలో రాణించవచ్చు..’ అనే విషయాన్ని పాఠశాల విద్యార్థినులు నిరూపిస్తున్నారు. సర్కార్ బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంగ్ల విద్యకు పెద్దపీట వేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తున్నది. ‘మన ఊరు- మన బడి’ అమలైతే పాఠశాల మరింత అభివృద్ధి చెందనున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనున్నది.
పాఠశాల ఉపాధ్యాయులు ప్రాక్టికల్స్కు పెద్దపీట వేశారు. బడిలో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, వాటర్ ప్లాంట్, క్రీడా సామగ్రి అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు అన్ని విభాగాల్లో ప్రావీణ్యం సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. గతంలో హెచ్ఎంగా పనిచేసిన రావూరి సంధ్యశ్రీ విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు సైతం నిర్వహించారు. ప్రస్తుతం ఈ బడిలో 340 మం ది విద్యార్థినులు చదువుతున్నారు. వీరిలో 220 మంది ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. మరో 80 మంది ఉర్దూ మీడియం, 40 మంది తెలుగు మీడియం చదువుతున్నారు. పదోతరగతి విద్యార్థులు 54 మంది ఉండగా వీరిలో 36 మంది ఇంగ్లిష్ మీడియం, తొమ్మిది మంది తెలుగు మీడియం, తొమ్మిది మంది ఉర్దూ మీడియం చదువుతున్నారు.
పాఠాలు బోధించే విషయంలో ఉపాధ్యాయులమంతా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమవుతారు. 6వ తరగతి నుంచే ఇంగ్లిష్లో పాఠాలు బోధిస్తాం. ఆంగ్లం అంటే భయపడే వారిని ముందుగా గుర్తిస్తాం. వారికి పాఠాలు అర్థమయ్యేలా బోధిస్తాం.
-జోగిపర్తి శ్రీనివాసరావు, గణితశాస్త్ర ఉపాధ్యాయుడు
ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు వివరిస్తాం. పాఠశాలలో చేరిన తర్వాత విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. బాలికలు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నాం.
– ఆర్వీ వరలక్ష్మి, సామాన్యశాస్త్ర ఉపాధ్యాయురాలు
నేను 7వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను. 8వ తరగతి సర్కారు బడిలో చేరాను. ఇక్కడి టీచర్లు బాగా చెప్తున్నారు. అన్ని సబ్జెక్ట్లను సులువుగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు. సర్కార్ బడిలో ఇంగ్లిష్ మీడియం ఇంత సులువుగా ఉంటుందని ఊహించలేదు.
-ఆర్పీ భావన, 8వ తరగతి విద్యార్థిని
నేను 7వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివాను. ఇంగ్లిష్ నేర్చుకోవడంతోనే భవిష్యత్తు ఉంటుందని తెలుసుకుని 8వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలోకి మారాను. టీచర్లు స్నేహపూర్వకంగా పాఠాలు బోధించడం వల్ల నాకు ఆంగ్లం అంటే భయం పోయింది. ఇప్పుడు మిగతా పిల్లల్లా నేనూ చదువుతున్నాను.
– ఎండీ యాస్మిన్, పదో తరగతి విద్యార్థిని
మా బడిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు చెప్తారు. ఇంగ్లిష్ నేర్పిస్తారు. మాట్లాడేందుకు ప్రోత్సహిస్తారు. వారి ప్రోత్సాహంతోనే మేమంతా ఆంగ్లం నేర్చుకుంటున్నాం.
– ఎస్కే నూర్జహాన్, పదో తరగతి విద్యార్థిని
మా బడిలో ప్రతిరోజు చివరి గంట లైబ్రరీలో చదువుకోవడానికి అవకాశం ఉంది. అక్కడి పుస్తకాలు చదువుతాం. ఏం చదివామో టీచర్లకు వివరిస్తాం. మాకు తెలియనివి టీచర్లు చెప్తారు. మాలో భయాన్ని పోగొడతారు. చదువుపై దృష్టి సారించేలా చేస్తారు.
– జి.ఉజ్వల, 9వ తరగతి విద్యార్థిని
ఇంగ్లిష్ నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం వచ్చింది. ప్రస్తుతం ఉన్న చదువులు చదవాలన్నా, విదేశాల్లో స్థిరపడాలన్నా ఇంగ్లిష్ తప్పనిసరి అని అర్థమైంది. భవిష్యత్తులో ఏదైనా సాధిస్తాననే నమ్మకం వచ్చింది.
-వెన్నెల, పదో తరగతి విద్యార్థిని