ఖమ్మం, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొత్తగూడెం ఎడ్యుకేషన్ : తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గాల్లో సంబురం నెలకొంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు దాదాపు 800 మందికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఎస్ఏలు హెచ్ఎంలుగా, ఎస్జీటీలు ఎస్ఏలుగా ఉద్యోగోన్నతి పొందనున్నారు. స్కూల్ అసిస్టెంట్ కేడర్ ప్రమోషన్కు ఎస్జీటీలు, పీఈటీలు, పండిట్లు రానున్నారు. టీచర్లకు 2015లో పదోన్నతులు నిర్వహించగా.. 2018లో బదిలీలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలు ఉత్పన్నం కాకుండా…
టీచర్ల పదోన్నతులు మేనేజ్మెంట్ వారీగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వడానికి న్యాయపరమైన వివాదాలు ఉండడంతో ప్రభుత్వ, పంచాయతీరాజ్ వారీగా ప్రక్రియ చేపట్టనున్నారు. విద్యాశాఖలో ఏకీకృత సర్వీస్ రూల్స్ చిక్కులు ఉండడంతో మేనేజ్మెంట్ వారీగా ప్రమోషన్లకు సిద్ధం చేస్తున్నారు. పాఠశాలల వారీగా వాటిలోని ఖాళీలు మైదాన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాలవారీగా, జడ్పీ పాఠశాలలు వాటిలో మైదాన, ఏజెన్సీ ప్రాంతాలవారీగా అంతా పారదర్శకంగా పదోన్నతులు కల్పించనున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉన్నతాధికారుల సూచనల మేరకు వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. పదోన్నతులను భర్తీ చేసేందుకు అవసరమైన సీనియార్టీ జాబితాను రూపొందిస్తున్నారు. 800 మందికి పైగా పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
పదోన్నతులు హర్షణీయం
తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖలో అన్ని కేడర్లకు పదోన్నతులు కల్పించడం హర్షణీయం. పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను సైతం ప్రభుత్వం భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి పొందడంతో విద్యాశాఖ బలోపేతం కానుంది. నాణ్యమైన విద్యను అందించేందుకు దోహదపడుతుంది. బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు కృషి చేయాలి.
– మోతుకూరు మధు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
ఉపాధ్యాయ లోకానికి ఊరట
బదిలీలు, పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ లోకానికి ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ పెద్ద ఊరట. కోర్టు తీర్పును అనుసరించి వెంటనే షెడ్యూల్ విడుదల చేసిన సీఎం కేసీఆర్ సార్కి, విద్యాశాఖ మంత్రికి తెలంగాణ ఉపాధ్యాయ లోకం రుణపడి ఉంది. ఉద్యమ నాయకుడు సీఎం కావడం వల్లనే ఇలాంటి సాధక బాధకాలను అర్థం చేసుకుంటున్నారు.
– కొమ్మినేని అనిల్కుమార్, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి
స్వాగతిస్తున్నాం..
బదిలీలు, ప్రమోషన్స్పై హైకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కోర్టు తీర్పుపై మళ్లీ కేసులు నమోదు కాకుండా కెవిట్ వేయాలని కోరుతున్నాం. పైరవీలకు తావు లేకుండా నిర్వహించే ప్రక్రియకు సహకరిస్తాం. బదిలీలు, పదోన్నతుల సందర్భంగా ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్లో చేర్చి నింపాలి.
– విజయ్, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం
గుర్తింపు సంఘాల రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక పాయింట్లను తాత్కాలికంగా తొలగిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తున్నాం. జనవరిలో ప్రకటించిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్పై ఏడు నెలలుగా కొనసాగుతున్న స్టేను హైకోర్టు ఎత్తివేయడాన్ని స్వాగతిస్తున్నాం. నిబంధనలకు లోబడి ప్రక్రియ చేపట్టాలి.
– నాగేశ్వరరావు, టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రక్రియను స్వాగతిస్తున్నాం. దాదాపు 60 వేల మందికి బదిలీలు, వేల మందికి పదోన్నతులు కల్పించడం పట్ల కృతజ్ఞతలు. హోదా రీత్యా, ఆర్థికపరమైన లబ్ధి పొందడం ద్వారా ఉపాధ్యాయులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎలాంటి ఒడిదొడుకులు, అవంతరాలు జరగకుండా పూర్తిస్థాయిలో బదిలీలు, పదోన్నతులు జరిగేందుకు సహకరిస్తాం.
– వీరాస్వామి, హెచ్ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఉపాధ్యాయుల్లో సంతోషం
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేయడం పట్ల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించడం పట్ల ఆతృతగా చూస్తున్న ఉపాధ్యాయులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఉపాధ్యాయ లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
– యలమద్ది వెంకటేశ్వర్లు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్
పారదర్శకంగా నిర్వహించాలి
సీనియార్టీ జాబితా రూపకల్పనలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకొని పారదర్శకంగా నిర్వహించాలి. సుధీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ వల్ల పాఠశాలలు బలోపేతం అవుతాయని భావిస్తున్నాం. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– షేక్ దస్తగిరి, ఈఎల్టీఎస్ అధ్యక్షుడు, కొత్తగూడెం
సహకారం అందిస్తాం
బదిలీలు, ప్రమోషన్లకు కావాల్సిన సహకారం పీఆర్టీయూ తరఫున ప్రభుత్వానికి అందిస్తాం. కోర్టు స్టే ఎత్తివేయడానికి ప్రభుత్వం తీసుకున్న చొరవకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిరాశా నిస్పృహలతో ఉన్న ఉపాధ్యాయులకు ఇది శుభపరిణామం. ఎటువంటి ఆటంకాలు వచ్చినా ప్రభుత్వం ఈ ప్రక్రియను శరవేగంగా ముగిస్తుందని మా నమ్మకం.
– డి.వెంకటేశ్వరరావు(డీవీ), పీఆర్టీయూ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
నిరీక్షణ ఫలించింది
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడం సంతోషకరం. భార్యాభర్తలకు స్పౌజ్ కేటగిరీలో పాయింట్లు ఇవ్వడం వల్ల ఇద్దరూ ఒకే చోట, లేదా ఒకే ప్రాంతంలో, ఒకే మార్గంలో పనిచేసే అవకాశం ఏర్పడింది. పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు కూడా ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
– మేకల జ్యోతిరాణి, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు