కొత్తగూడెం టౌన్/ కొత్తగూడెం సింగరేణి, జూలై 26: కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో పలువురు ప్రజలు, కార్మికులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్లలో చేరారు. వీరికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గులాబీ కండువాలు, టీబీజీకేఎస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సుజాతనగర్ మండలంలో శనివారం రాత్రి వద్దిరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లోని పలు గ్రామాల నుంచి సుమారు 70 కుటుంబాల వారు ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కంగారుబుచ్చయ్య గుంపు నుంచి 10 కుటుంబాలు, రూప్లాతండా నుంచి 40 కుటుంబాలు, చిమ్నాతండా నుంచి 21 కుటుంబాల వారితోపాటు ఆరుగురు వార్డు సభ్యులు చేరారు.
వీరందరికీ ఎంపీ వద్దిరాజు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే స్పష్టం చేశారు. పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్తా పాటుపడాలని కోరారు. అలాగే, కొత్తగూడెంలోని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 నుంచి సూపర్వైజర్లు (ఓవర్మెన్లు) బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్లో రవిచంద్ర సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వంలోనే తమకు ఓవర్మెన్గా ఉద్యోగాలు లభించాయని, కారుణ్య నియామకాలు సహా అనేక హక్కుల వచ్చాయని గుర్తుచేశారు. టీబీజీకేఎస్లో చేరిన వారిలో కార్మికులు గోల్కొండ నవీన్, అలీమ్, సబ్బని వినీత్, వసీం, అజీజ్ తదితరులు ఉన్నారు. అలాగే, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపికైన అనంతరం వద్దిరాజు రవిచంద్ర తొలిసారిగా కొత్తగూడెంలో రావడంతో ఆ పార్టీ స్థానిక నేతలను అయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.