మందమర్రి, జూన్ 27 : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) విజయం సాధిస్తుందని, మూడోసారి గెలుపు ఖాయమని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య స్పష్టం చేశారు. మందమర్రి పట్టణంలోని బీఆర్ఎస్ బీ-1 కార్యాలయం వద్ద మంగళవారం స్థానిక యూనియన్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ రక్షణగా ఉంటూ సంస్థను కాపాడుతున్నారని తెలిపారు. అలాగే 16 శాతం ఉన్న సింగరేణి వార్షిక లాభాల వాటాను 30 శాతానికి పెంచి కార్మికులకు చెల్లించిన ఘనత ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఏ సంస్థలో లేని విధంగా కంపెనీ లాభాలను పంచుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ను తమ యూనియన్ గెలిపించుకుంటుందని తెలిపారు.
సింగరేణి ఉద్యోగులు తమ యూనియన్తో పాటు సీఎం కేసీఆర్కు ఎప్పుడూ మద్దతుగా నిలువాలని ఆయన పేర్కొన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టే సత్తా కేవలం బీఆర్ఎస్కే ఉందని ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లో సింగరేణితో పాటు రాష్ట్రంలో తిరిగి గులాబీ జెండానే ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు జే రవీందర్, టీబీజీకేఎస్ కేంద్ర నాయకులు బడికెల సంపత్, ఓ రాజశేఖర్, జీఎం కమిటీ సభ్యుడు సత్యనారాయణ రెడ్డి, ఈశ్వర్, శంకర్రావు, ఏడుకోల పవన్, పోలు సంపత్, బెల్లం అశోక్, శ్రీను తదతరులు పాల్గొన్నారు.