– ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 05 : బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు కోతలకే, ఉత్తుత్తి మాటలకే పరిమితం అవుతున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు యందు గల పల్లెగూడెం కొత్తకాలనీ, రెడ్డిపల్లి, రాజీవ్ నగర్, 2వ వార్డు పరిధిలోని రాజీవ్ గృహకల్పలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దుంపల నాగరాజ్, పల్లపు సంధ్య విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ర్యాలీ, ప్రచార సభలు నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ తో కలిసి వారు మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పదేళ్ల కాలంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి కుటుంబానికి తెలుసన్నారు. గర్భిణీ నుండి మొదలుకుని పండు ముసలి వరకు అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టి సమాజంలో అన్ని వర్గాలను బీఆర్ఎస్ సర్కారు సమంగా చూసిందన్నారు.
మాయ మాటలు, అలివి కాని హమీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండున్నర ఏండ్లు గడుస్తున్నా మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చింది మొదలు నేటి వరకు ప్రతి సభలో రాబోతుంది, కాబోతుంది అని మాటల ప్రలోభాలే తప్ప ఏదులాపురంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది లేదన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వెంకటగిరి క్రాస్ రోడ్ నుండి పల్లెగూడెం వరకు రహదారి విస్తరణ బీఆర్ఎస్ హయాంలో జరిగిందని, తీగల వంతెన, మున్నేరు రిటర్నింగ్ వాల్ రూపకల్పన సైతం కేసీఆర్ హయాంలో జరిగిందన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు చెల్లిందన్నారు. ప్రతి డివిజన్లో కనపడుతున్న సిసి రోడ్లు, ప్రతి ఇంటికి అందిన సంక్షేమ పథకాలు సజీవ సాక్షాలుగా ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు. రైతులను, రైతు కూలీలను, గృహిణులను ఎన్నికల హామీలతో కాంగ్రెస్ పార్టీ బోల్తా కొట్టించిందని, మరోసారి మోసపోతే గోసపడతారని వారు పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికి ఎంతో ఆప్యాయంగా అందరూ నా వాళ్లే, రాజకీయాలకు అతీతంగా సేవలు చేసిన వ్యక్తి కందాల ఉపేందర్ రెడ్డి అని, అలాంటి నాయకుడిని ఓడించుకోవడం బాధాకరమన్నారు. జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కాందాల, కేసిఆర్ కు విజయాలను బహుమతిగా ఇద్దామన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టలేక కాంగ్రెస్ నాయకులు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సిపిఎం శ్రేణులు అభ్యర్థుల విజయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. అధికార పార్టీకి అభ్యర్థులు కరువై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఆధారపడ్డారని, అయినా ఓటమి భయంతో అర్ధరాత్రి ఫోన్ చేసి ప్రలోభాలకు గురి చేసే పరిస్థితికి దిగజారారన్నారు. రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండి బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులను ఘన విజయంతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, ప్రజా సంక్షేమం గుర్తుకు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నేత తాళ్లూరి జీవన్ కుమార్, మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, గద్దే సతీష్, ఉపేందర్, భార్గవ్, పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు.