ఇల్లెందు రూరల్, జనవరి 7 : ఆ చిన్నారి కిడ్నీ సమస్యతో బాధపడుతూ జీవన పోరాటం సాగించింది.. దాతలు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు అండగా నిలిచినా కనికరం లేనికాలం కాటేసింది.. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో గత కొంతకాలంగా దుర్భరమైన పరిస్థితుల మధ్య వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయిస్తూ తమ పాపను బతికించేందుకు తల్లిదండ్రులు తల్లడిల్లారు.. అయినా ఫలితం దక్కలేదు.. కిడ్నీ వ్యాధి ముదిరి శనివారం చిన్నారి తపస్వి(11) తనువు చాలించింది.
వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని తిలక్నగర్ పంచాయతీకి చెందిన వంశీసాగర్, గంగాభవాని దంపతుల కుమార్తె తపస్వి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నది. తండ్రి వంశీసాగర్ పంచాయతీలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమార్తెను దక్కించుకునేందుకు తమ వద్ద దాచుకున్న డబ్బులను ఖర్చుపెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ దృష్టికి పరిస్థితిని తీసుకెళ్లి వివరించగా ఆమె జూలై నెలలో ఎల్వోసీ, సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2.5 లక్షల సాయం అందజేశారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ కూడా రెండుసార్లు రూ.2.5 లక్షల సాయం అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో తల్లి తన కిడ్నీని కూతురుకు దానం చేసేందుకు ముందుకు రాగా ఆమెకు డయాబెటిక్ ఉన్న కారణంగా డాక్టర్లు సాధ్యం కాదని తెలిపారు.
నానమ్మ పద్మ తన మనవరాలికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు రాగా నిమ్స్ వైద్యశాలలో నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఈ క్రమంలో వైద్యం పొందుతూ తపస్వీ శనివారం నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూసింది. తమ చిన్నారిని కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తపస్వి భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగృహమైన తిలక్నగర్కు తీసుకొస్తున్నామని బంధువులు తెలిపారు. చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే హరిప్రియ సానుభూతి తెలిపారు.