ఇల్లెందు, సెప్టెంబర్ 17: కేంద్రం వెంటనే పార్లమెంట్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఆదివారం ఆమె బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి మహిళలపై ఏమాత్రం గౌరవమున్నా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసినప్పటి నుంచి దేశంలో మహిళా రిజర్వేషన్లపై తిరిగి పెద్ద చర్చ జరుగుతున్నదన్నారు.
పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకుండా బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతూ ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నదని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. మహిళా బిల్లుతోపాటు బీసీ రిజర్వేషన్ బిల్లునూ ప్రవేశపెట్టాలని, బీసీ గణన చెపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.
అంతకుముందు జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు శ్రీను, సుజాత, తార, నాగేశ్వరరావు, ఆజాం, కొడకంచి పద్మ, కటకం పద్మావతి, బీఆర్ఎస్ నాయకులు ధనలక్ష్మి, సరిత, మంజుల, చంద్రావతి, మనోహర్ తివారి, కృష్ణారావు, నబీ, గిన్నారపు రాజేశ్, మేకల శ్యాం, గాజీ, వీరస్వామి, చంద్, నీలం రాజశేఖర్ పాల్గొన్నారు.