భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన, అభయహస్తం గ్యారెంటీలకు ఈ నెల 28వ తేదీ గురువారం నుంచి గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంపై నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో బుధవారం కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల స్థాయిలో పర్యవేక్షణకు ఐదుగురు ప్రత్యేకాధికారులు, 22 మండలాలకు మండల ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, వార్డుల్లో నిర్వహించే గ్రామసభలపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. దరఖాస్తు ప్రతి కుటుంబానికి చేరాలని, దరఖాస్తులు పూర్తి చేసేందుకు హెల్ప్డెస్కులు ఏర్పాటు చేయాలన్నారు.
జనవరి 6వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తుకు నంబర్ వేసి అదే నంబర్ రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఏ అంశంపై దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తులో టిక్ చేయాలని సూచించారు. మండలస్థాయి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని, గ్రామసభ నిర్వహించే ప్రాంగణంలో టేబుల్స్, కుర్చీలు, తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తుతోపాటు రేషన్కార్డు, ఆధార్కార్డు జిరాక్సు, కుటుంబ పెద్ద పాస్ఫొటో జత చేయాలని సూచించారు.