ఖమ్మం, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్(సీపీ)గా సునీల్దత్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఖమ్మం సీపీగా పనిచేస్తున్న విష్ణు ఎస్ వారియర్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. గతంలో సునీల్దత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఈస్ట్జోన్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తుండగా ఖమ్మానికి బదిలీపై రానున్నారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే సమర్ధవంతమైన అధికారిగా సునీల్దత్కు పేరుంది. ఆయన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా 2018 సెప్టెంబర్ 11 నుంచి 2022 జూలై 4వ తేదీ వరకు పనిచేశారు. అంతకుముందు భద్రాచలం అసిస్టెంట్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన సునీల్దత్ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఖమ్మం సీపీగా విష్ణు ఎస్ వారియర్ 6 ఏప్రిల్ 2021న బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు గంజాయి విక్రేతలపై ఉక్కుపాదం మోపారు. జిల్లాలో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో కీలకంగా వ్యవహరించారు. గతేడాది గోదావరి వరదల నేపథ్యంలో భద్రాచలంలో బాధితులకు సహాయ సహకారాలు అందించడంలో కీలకపాత్ర పోషించారు. బూర్గంపాడు ప్రాంతంలో వరదల సమయంలో ప్రత్యేక బోటు ద్వారా పయనించి వివిధ ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించారు. ఖమ్మం సీపీగా సునీల్దత్ రెండ్రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కొత్తగూడెం క్రైం, జనవరి 3 : పోలీస్ ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా జిల్లా ఎస్పీగా బిరుదరాజు రోహిత్ రాజును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వినీత్ గంగన్నను మాదాపూర్ డీసీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్కు చెందిన రోహిత్ రాజు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించే తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని 2018లో ఐపీఎస్గా ఎంపికయ్యారు. 2020లో జిల్లాలో ట్రైనీ ఐపీఎస్గా అడుగు పెట్టిన రోహిత్ రాజు కరోనా సమయంలో తనదైన శైలిలో విధులు నిర్వర్తించి ప్రత్యేకతను చాటుకున్నారు. జిల్లాలోనే పలుచోట్ల ప్రొబేషనరీ కాలంలో విధులు నిర్వర్తించిన అనంతరం గ్రేహౌండ్స్కు బదిలీపై వెళ్లారు. కొత్తగూడెం సబ్ డివిజన్లో ప్రొబేషనరీ కాలంలో లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల, బంగారుచెలక, మైలారం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ, గిరిజనులకు సుపరిచితుడయ్యారు. 2021లో తిరిగి జిల్లాలోని భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2022లో జరిగిన బదిలీల్లో పాల్వంచ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ రామృకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిస్పక్షపాతంగా విచారణ జరిపి ఈ కేసులోని నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరి ప్రత్యేక మార్క్ వేసుకున్నారు. పాల్వంచ ఏఎస్పీగా ఉంటూనే భద్రాచలం, కొత్తగూడెం ఏఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. భద్రాచలం ఏఎస్పీగా పని చేసిన ఆయన ఉన్నతాధికారుల సూచనలతో మావోయిస్టుల చర్యలను తిప్పి కొట్టడంలో సిద్ధహస్తులయ్యారు. పాల్వంచ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఉద్యోగోన్నతి పొందిన రోహిత్ రాజు హైదరాబాద్ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా విధులు పూర్తి చేశారు. 2023 జరిగిన బదిలీల్లో భాగంగా హైదరాబాద్ సౌత్-ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయి ప్రస్తుతం అక్కడే విధులు నిర్వర్తించారు. తాజా బదిలీల్లో రోహిత్ రాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బదిలీపై రానున్నారు.