భద్రాచలం, ఫిబ్రవరి 23 : మాఘమాసోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం ఏకోత్తర సహస్ర కలశవాహన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కలశాల్లో శుద్దోదకాలు, ద్రవ్య కలశాల్లో ఆయా దేవతలను ఆవాహనం చేశారు. మరికొన్ని కలశాల్లో ఫలోదకం, ఇక్షోదకం(చెరకు రసం) కషాయోదకం, లవణోదకం, హరిద్రోదకం, వర్షోదకం, తటాకోదకం, దిగుడు బావులు, నదులు, ఉపనదుల నుంచి తీసుకొచ్చిన తీర్థ్ధాన్ని, అయోధ్యలోని సరయూ నది నుంచి తీసుకొచ్చిన తీర్థ్ధాన్ని మహాకుంభంలో ఉంచారు. ఏటా మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని సహస్ర కలశాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏకోత్తర సహస్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి సహస్ర కలశాభిషేకానికి అంకురార్పణ చేశారు. వేడుకలో భాగంగా స్వామివారికి ప్రతి రోజు నిర్వహించే నిత్య కల్యాణాన్ని నిలిపివేశారు. సాయంత్రం యాగశాలలో లఘుతిరువారాధన, సహస్ర కలశాభిషేకాన్ని ఆయా దేవతలకు సంబంధించిన మంత్రాలతో హవనం ద్వారా పఠించారు.
యాగశాలకు అభిముఖంగా వాస్తు పురుషుడి విగ్రహాన్ని వేసి శిరస్సు, బాహువులు, తొడలు, ఉరువులు, కుక్షి, పృష్ణక భాగం, పాదాల వద్ద పొంగలి ముద్దలను ఉంచి పంచ రంగులతో వసంతాన్ని చల్లారు. ‘భం భానవే నమః’ అనే మంత్రంతో వాస్తు హోమం నిర్వహించారు. సమస్త మంగళవాయిద్యాలతో తెరను తొలగించి పొంగలి ముద్దలను, తెల్లాన్ని దేవస్థానం చాకలితో గోదావరిలో నిమజ్ఞనం చేయించారు. శనివారం సీతారామ, లక్ష్మణ స్వామివార్ల ఉత్సవ మూర్తులకు ఏకోత్తర సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. అలాగే రంగనాయకుల గుట్టపై వేంచేసి ఉన్న శ్రీరంగనాథ స్వామివారికి వార్షిక తిరుకల్యాణం జరుపనున్నారు. ఆదివారం నుంచి నిత్య కల్యాణం పునఃప్రారంభమవుతుందని దేవస్థానం అధికారులు తెలిపారు.