అశ్వారావుపేట టౌన్, మే 28 : గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు, ఇండ్లు నేలకూలాయి.. పూరిళ్లు నేలమట్టమయ్యాయి.. రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, అశ్వారావుపేట మండలాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గాలివాన అతలాకుతలం చేసింది. సాయిరాంతండా సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు పడిపోవడంతో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్లు పడడంతో తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు యుద్ధ్దప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. మాచినేనిపేటతండాలో రేకులషెడ్డులో ఉన్న బానోత్ సరోజిని తలకు రేకులు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి.
గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పలు గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. భారీ వృక్షాలు నేలకూలగా.. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పూరిళ్లు నేలమట్టంకాగా.. రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి గాలి తోడయ్యింది. భారీ వర్షంతోపాటు సుడిగాలి వీచడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్రం అంతరాయం వాటిల్లింది. విద్యుత్ అధికారులు సరఫరాను పునరుద్ధరించేందుకు తీవ్రంగా శ్రమించారు. గుర్రాలచెరువు రోడ్డులోని కాళింగుల బజార్లో విద్యుత్ స్తంభం విరిగిపడింది. జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమైంది. మల్లాయగూడెంలో పలు ఇళ్లు నేలకూలాయి. సారిన నాగేశ్వరరావుకు చెందిన పెంకుటిల్లుపై భారీ వేప చెట్టు విరిగిపడడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఇదే వ్యక్తికి చెందిన మరో తాటాకు ఇల్లు పూర్తిగా నేలకూలింది. గురివింద బాలుకు చెందిన రేకుల షెడ్డు పైకప్పు పూర్తిగా ఎగిరిపోయింది. పోతునూరి సత్తిబాబుకు చెందిన తాటాకు ఇల్లు నేలకూలింది. వీరితోపాటు పలు ఇళ్లు కూలినట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకూలినట్లు సమాచారం.
మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన అతలాకుతలం చేసింది. గాలి ధాటికి ఇళ్ల పైకప్పులు లేచి ఎగిరిపడడం.. భారీ వృక్షాలు నేలకొరగడం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. కాకర్ల, మాచినేనిపేటతండా, దండుమిట్టతండా, పడమటనర్సాపురం గ్రామాల్లోని పలు రేకుల షెడ్లు గాలికి తట్టుకోలేక పైకప్పులు లేచి దూరంగా పడ్డాయి. సాయిరాంతండా సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు పడిపోవడంతో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు, ప్రయాణికులు చెట్లను తొలగించారు. బేతాళపాడు-పడమటనర్సాపురం మధ్య చెట్లు రహదారికి అడ్డంగా పడ్డాయి. కాకర్ల గ్రామంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్లు పడడంతో తీగలు తెగిపడ్డాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ్దప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. మాచినేనిపేటతండాలో రేకులషెడ్డులో ఉన్న బానోత్ సరోజిని తలకు రేకులు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి.