ఖమ్మం, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : బయోమెట్రిక్ హాజరు అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులు, రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ప్రతినిధులతో బయోమెట్రిక్ హాజరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన, సాంఘిక సంక్షేమశాఖల వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరును వందశాతం అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ప్రతినిధులు సమస్యలు గుర్తించి అన్నిచోట్లా హాజరు బయోమెట్రిక్లో నమోదయ్యేలా చూడాలని, ట్రెజరీ అధికారులకు బయోమెట్రిక్ హాజరుతో బిల్లుల స్క్రూట్నీని చేసేలా సూచనలు చేయాలని తెలిపారు.
విద్యాశాఖలో బయోమెట్రిక్ హాజరు అమలుకు ఉద్దేశించిన జిల్లాల జాబితాలో ఖమ్మం జిల్లాను చేర్చుటకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరుకు ఉన్న పరికరాల పరిస్థితిని చూసి, వాటి పునరుద్దరణకు చర్యలు చేపట్టాలన్నారు. బీసీ సంక్షేమ వసతిగృహాల్లో కరోనాకు పూర్వం ఉన్న బయోమెట్రిక్ హాజరు పరిస్థితిని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.యాదయ్య, సాంఘిక సంక్షేమశాఖ డీడీ సత్యనారాయణ, జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి కృష్ణానాయక్, బీసీ సంక్షేమ అధికారి జ్యోతి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు, ఈడీఎం దుర్గాప్రసాద్, టీఎస్ ప్రతినిధులు అభిషేక్, పవన్కుమార్, భానుతేజ, ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.