‘ఉమ్మడి పాలనలో ఖమ్మం సర్కార్ దవాఖాన ఓ మురుగు కూపం.. ఎప్పుడు చూసినా ఆసుపత్రి ఆవరణలో చెత్తాచెదారం కనిపించేది.. రోగులు రక్త పరీక్షలు, ఎక్స్రేలు, స్కానింగ్కు బయట ప్రైవేటు కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఆసుపత్రికి అన్ని వసతులు సమకూరాయి.. ఇప్పుడు హాస్పిటల్కు మెడికల్ కళాశాల అనుసంధానమైంది.. త్వరలో మెడికల్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి.. అలాగే అన్ని సర్కార్ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందుతున్నది..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించిన ‘వైద్యారోగ్యశాఖ దినోత్సవం’లో ఆయన మాట్లాడారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి దవాఖానలో రేడియాలజీ ల్యాబ్, డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. తర్వాత మంత్రి రక్తదానం చేశారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. ఉత్తమ వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు.
ఖమ్మం సిటీ, జూన్ 14: ‘ఉమ్మడి పాలనలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఓ మురికి కూపం.. మానవ వ్యర్థాలు, బయో వ్యర్థాలతో కంపు కొట్టేది.. పేరుకే ఆసుపత్రిలో 250 బెడ్లు.. కానీ అవి రోగులకు సరిపోయేవి కాదు.. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెట్టి వైద్యులు వైద్యం చేసేవారు. కనీసం మందులు ఉండవు.. రక్త పరీక్షలు, ఎక్స్రేలు, స్కానింగ్లు అవసరమైతే రోగులు బయటకు పరుగులు పెట్టాల్సివచ్చేది.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మెరుగు పరిచారు. ఇప్పుడు సర్కార్ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందుతున్నది..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించిన ‘వైద్యారోగ్యశాఖ దినోత్సవం’లో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయన్నారు. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. దీనిలో భాగంగా ఖమ్మం పెద్దాసుపత్రి 570 పడకల దవాఖానగా అప్గ్రేడ్ అయిందన్నారు. ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. త్వరలోనే 50 పడకల క్రిటికల్ కేర్ వార్డుతో క్యాన్సర్ విభాగం ఏర్పాటు కానున్నదన్నారు. ఊరూరా పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నదన్నారు. మాతా శిశు మరణాలు, బాల్య వివాహాల జాతీయ సగటులో ఉమ్మడి ఏపీ అట్టడుగున ఉండేదని, తెలంగాణ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయన్నారు. ఖమ్మానికి మెడికల్ కళాశాల తీసుకొచ్చి జిల్లా ప్రజల చిరకాల కలను సాకారం చేశానన్నారు. ఆగస్టు నుంచి 100 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసి తరగతులు ప్రారంభిస్తామన్నారు.
ఆసుపత్రికి మెడికల్ కాలేజీని పాత కలెక్టరేట్కు అనుసంధానిస్తూ రూ.3.50 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. రెండు విడతల కంటి వెలుగు కార్యక్రమాల్లో లక్షలాది మందికి వైద్య పరీక్షలు చేశామన్నారు. అవసరమైన వారందరికీ రీడింగ్ గ్లాసులు, ప్రిస్కిప్షన్ గ్లాసులు అందించామన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా గర్భిణులకు ఇంటి వద్దనే వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలతో ప్రజలకు సర్కార్ వైద్యం మరింత చేరువైందన్నారు. కంటి వెలుగు, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు అద్భుత ఫలితాలనిస్తున్నాయన్నారు. ఖమ్మానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకొచ్చేందుకు మంత్రి అజయ్కుమార్ ఎంతో కృషి చేశారన్నారు.
తొలుత కలెక్టర్ వీపీ గౌతమ్, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్తో కలిసి దవాఖానలో రేడియాలజీ ల్యాబ్, డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. తర్వాత మంత్రి రక్తదానం చేశారు. గర్భిణులకు నూట్రిషన్ కిట్లు అందజేశారు. ఉత్తమ వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు కళ్లద్దాలు, ఆశ కార్యకర్తలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం నగర డిఫ్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, నగరపాలక కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఎంహెచ్వో మాలతి, ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సరిత, మెడికల్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.