రఘునాథపాలెం, డిసెంబర్ 28: పరిపాలనా సౌలభ్యం కోసం రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ను ప్రారంభోత్సవానికి ముస్తాబుచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్లతో కలిసి నూతన కలెక్టరేట్ పనులను బుధవారం ఆయన పరిశీటించారు. ప్లాన్ ప్రకారం పనులు జరుతున్నాయా? అని కలెక్టర్ను, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఎంత సమయం కావాలి? అనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సమీకృత కలెక్టరేట్లో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ నూతన కలెక్టరేట్ భవనాలను నిర్మిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో రూ.50 కోట్లతో 1.69 లక్షల చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు కొంత ఆలస్యమైనప్పటికీ దానిని అధిగమించేందుకు కొంతకాలంగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే ఈ సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు.
సీఎం పర్యటనకు అనుగుణంగా నూతన కలెక్టరేట్ను సిద్ధం చేయాలని, పనులేవీ పెండింగ్లో ఉండడానికి వీల్లేదని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, సీపీ విష్ణు ఎస్ వారియర్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, ఏఈ విశ్వనాథం, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం ప్రత్యేక విజన్తోనే
నూతన కలెక్టరేట్: ఎంపీ వద్దిరాజు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రత్యేక విజన్తో అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాన్ని చేపట్టారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ సెక్రటేరియట్ కంటే విశాల ప్రాంగణంలో మన కలెక్టరేట్లు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. సంక్రాంతి నాటికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోనున్నట్లు చెప్పారు.
గర్వంగా ఉంది: ఎమ్మెల్సీ, తాతా మధు
గతంలో నిజాం కాలంలో నిర్మించిన కలెక్టరేట్లో సరైన మౌలిక సౌకర్యాలు ఉండేవి కావని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అన్ని రకాల మౌలిక వసతులతో అన్ని శాఖలకు చెందిన కార్యాలయాలను ఒకే చోట ఉండేలా నిర్మిస్తుండడం గర్వంగా ఉందన్నారు. పంజాబ్ నుంచి స్పీకర్ వచ్చినప్పుడు నిజామాబాద్ కలెక్టరేట్ను చూసి మెచ్చుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనను అభినందించినట్లు గుర్తుచేశారు.
దూరదృష్టితోనే కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారు: ఎమ్మెల్యేలు సండ్ర, కందాళ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే విశాలమైన ప్రాంగణంలో కలెక్టరేట్ భవనాల నిర్మిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అన్ని శాఖల కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ నిర్ణయం ఆదర్శనీయమన్నారు. అన్ని కార్యాలయాలను ఒకేచోట ఉండేలా సమీకృత కలెక్టరేట్ను నిర్మించుకోవడం సంతోషమని పాలేరు ఎమ్మెల్యే కందాళఉపేందర్రెడ్డి అన్నారు.