రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, దేశ ప్రజలందరూ కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఎర్రుపాలెం మండలంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఎర్రుపాలెం, జనవరి 7: రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని గమనించిన దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ పాలనవైపు చూస్తున్నారని అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత ఎర్రుపాలెంలో రూ.1.54 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల నూతన బిల్డింగ్ను, భీమవరంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన సబ్స్టేషన్ను, ‘మన ఊరు – మన బడి’లో భాగంగా బనిగండ్లపాడు ప్రభుత్వ పాఠశాలలో రూ.40 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
అనంతరం బనిగండ్లపాడు పీహెచ్సీలో రూ.1.56 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి, బనిగండ్లపాడు – తక్కెళ్లపాడు రహదారిలో రూ.2.80 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి కమ్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బనిగండ్లపాడులో మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మేళతాళాలు, పూలవర్షంతో ఘనంగా స్వాగతం పలికారు.
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు రంగిశెట్టి కోటేశ్వరరావు, దేవరకొండ శిరీష, శీలం కవిత, చావా రామకృష్ణ, చిత్తారు నాగేశ్వరరావు, పంబి సాంబశివరావు, మొగిలి అప్పారావు, శీలం జయలక్ష్మి, జంగా పుల్లారెడ్డి, సోమశేఖర్, తిరుమలాచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన వైపు దేశ ప్రజలంతా చూస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని బనిగండ్లపాడులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాను కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని స్పష్టం చేశారు. నాయకులంతా సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ఖమ్మం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నామని అన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం గురించి పార్లమెంటులో తాను ప్రస్తావిస్తున్నప్పుడు మిగతా రాష్ర్టాల సభ్యులంతా వింటూ ఆశ్చర్య పోతుంటారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ కార్యకర్తలందరూ ఇప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు పార్టీకి సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు.
మండలంలోని బంజర గ్రామానికి చెందిన కాంగ్రెస్ సర్పంచ్ బానావత్ రంగా తన అనుచరులతో కలిసి మంత్రి అజయ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శీలం ఉమామహేశ్వరి, కొండేపాటి సాంబశివరావు, వేమిరెడ్డి బాలరాఘవరెడ్డి, రామిశెట్టి సుజాత, శ్రీనివాసరెడ్డి, మూల్పూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.