అభివృద్ధి.. సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది.. అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇస్తూ తనదైన విజన్తో పద్దుకు రూపకల్పన చేసింది. ప్రగతికి కొనసాగింపుగా ప్రవేశపెట్టిన బడ్జెట్కు సకల జనుల ఆమోదం లభించింది. ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు బడ్జెట్లోని అంశాలను ఒక్కొక్కటిగా వివరించారు.. సీతారామ ప్రాజెక్ట్తో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. రుణమాఫీతో కర్షకులకు ఊరటనిచ్చారు. ఆయిల్పాం విస్తరణ, ప్రోత్సాహకాలకు రూ.వెయ్యి కోట్ల కేటాయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేస్తామనే ప్రకటనతో కాంట్రాక్ట్ ఉద్యోగులు, దళితబంధుకు రూ.17,700 కోట్లు కేటాయింపుపై ఎస్సీలు, కొత్త ఈహెచ్ఎస్ విధానం అమలుపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– ఖమ్మం, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సీతారామ ప్రాజెక్ట్కు ఊతం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నీటిపారుదల రంగానికి భారీగా నిధుల కేటాయింపు జరిగింది. సర్కార్ ఏకంగా రూ.26,885 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో సాగునీటి రంగానికి ఊతమిచ్చినట్లయింది. నిధుల్లో సీతారామ ప్రాజెక్ట్కూ కేటాయింపులు ఉంటాయి. దీంతో ప్రాజెక్ట్ పనులు వేగవంతం కానున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రాజెక్టు నిర్మాణం గురించి ప్రత్యేకంగా మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఏటా రెండు పంటలు పండించుకునే అవకాశం ఉందని మంత్రి మాట్లాడడంతో రైతులు ఆనందపడుతున్నారు.
ఖమ్మం, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ను అన్నివర్గాల ప్రజలు ఆమోదించారు. సంక్షేమ బడ్జెట్ అని కితాబునిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు భరోసానిచ్చే విధంగా బడ్జెట్ ఉందని అన్ని వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.
రైతులకు అనుకూలమైన బడ్జెట్..
రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలకూ బడ్జెట్లో ప్రాధాన్యత ఉంది. రైతుబంధుకు కేటాయించిన రూ.15,075 కోట్ల నిధుల్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా 3.6 లక్షల మంది రైతులు ఏడాదిలో రెండు సార్లు సొమ్ములు పొందనున్నారు. రూ.90 వేల వరకు ప్రకటించిన రుణమాఫీకి జిల్లావ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు. అలాగే రైతుబీమాకూ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. రైతులు చనిపోయిన కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నది.
దళితబంధుకు దండిగా నిధులు..
రైతుబంధు అమలుకు చింతకాని మండలం పైలట్ ప్రాజెక్ట్గా ఎంపికైంది. మండలవ్యాప్తంగా 3 వేల మందికి పైగా లబ్ధిదారులు యూనిట్లు అందుకున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి వంద మందికి చొప్పున 11 వేల మందికి యూనిట్లు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. బడ్జెట్లో రూ.17,700 కోట్ల నిధులు కేటాయింపు జరగడంతో దళితబంధు యూనిట్ల కేటాయింపునకు మార్గం సుగమం కానున్నది. దళితబంధుకు బడ్జెట్ కేటాయింపులపై ఎస్సీ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పల్లె ప్రగతికి బాటలు..
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సర్పంచ్లే నేరుగా డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడంతో ఇకనుంచి సులభంగా నిధులు వినియోగించుకోవచ్చు. ఈ నిర్ణయంతో భద్రాద్రి జిల్లాలో పంచాయతీలు 381, ఖమ్మం జిల్లాలో 598 పంచాయతీల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగనున్నాయి.
ఆయిల్పాం తోటల విస్తరణకు ప్రోత్సాహకాలు..
ఆయిల్పాం సాగు విస్తరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా రైతులు ప్రస్తుతం 48,000 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు సాగు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాతో పోలిస్తే ఖమ్మం జిల్లావ్యాప్తంగా విస్తీర్ణం కాస్త తక్కువ. ఆయిల్ పాం సాగు చేసి ఒక్కో రైతు ఎకరాకు రూ.1.20 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. వారికి ప్రభుత్వం ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నది. ప్రోత్సాహకాలు అందిస్తున్నది. తిరిగి గెలలను పామాయిల్ ఫ్యాక్టరీల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. కొత్తగా పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మించేందుకు స్థలాలను గుర్తించింది. తోటలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆయిల్పాం సాగుకు బడ్జెట్లో ఏకంగా రూ.1000 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఆయిల్పాం సాగు విస్తరణకు వడివడిగా అడుగులు పడనున్నాయి.
ఎస్సీల అభివృద్ధికి ప్రాధాన్యం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీలకు ప్రాధాన్యం ఇచ్చింది. దళితబంధు పథకానికి ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించి దళతబంధు ఆగిపోతుందని ఆరోపణలు చేసిన వారి నోళ్లు మూయించింది. నేను ఓ ప్రైవేట్స్కూల్లో అరకొర జీతానికి ఉపాధ్యాయుడిగా పని చేసేవాడిని. నేను దళితబంధుకు ఎంపికయ్యాను. వైరా పట్టణంలో వస్త్ర దుకాణం తెరిచాను. ప్రస్తుతం అన్ని ఖర్చులు పోను నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్నాను. ఈ పథకం నా జీవితాన్ని మార్చింది. ఎస్సీల కోసం రాష్ట్ర బడ్జెట్లో విరివిగా నిధులు కేటాయించారు. వీటితో ఎంతోమంది జీవితాలు మారనున్నాయి.
– మోటపోతుల సురేశ్, వైరా పట్టణవాసి
తెలంగాణ బడ్జెట్.. దేశానికి మోడల్..
అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచింది. మొత్తానికి తెలంగాణ బడ్జెట్ దేశానికి మోడల్గా నిలుస్తోంది. మహిళలు ఆర్థికంగా మరింత ప్రగతి సాధించేందుకు బడ్జెట్లో పెద్దపీట వేయడం సంతోషకరం. దళితులు, మైనారిటీల భద్రత, సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారనేందుకు ఈ బడ్జెట్టే నిదర్శనం. సమస్త వర్గాల ప్రయోజనాలను పరిరక్షించే ఈ సమగ్ర బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేకూరుస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగు నీళ్లు అందిస్తాం. ఎన్నెస్పీలో నీటి లభ్యత లేని సమయాల్లో ఆయకట్టును స్థిరీకరించడం కోసం పాలేరు రిజర్వాయర్కు అనుసంధానం చేసి రెండు పంటలకూ సాగు నీరు అందిస్తాం.
-పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్..
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఉన్నది. రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా పథకాలకు భారీగా కేటాయింపులు జరిగాయి. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించి మరోసారి రైతులపై ఆయనకున్న ప్రేమను చాటి చెప్పారు. కేసీఆర్ ప్రతి క్షణం రైతుల మంచి కోరుకుంటున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుబాంధవుడిగా నిలిచిన కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– పెరుగు సత్యనారాయణ, కోయగూడెం, టేకులపల్లి మండలం
ఇది ప్రజా సంక్షేమం..
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇన్ని రంగాలకు కేటాయింపులు ఉండవు. అన్నివర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. రూ.90 వేల వరకు రుణమాఫీ ప్రకటన రైతులకు భరోసానిచ్చింది. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం బడ్జెట్ రూపొందించింది.
– మరికంటి ధనలక్ష్మి, జడ్పీ వైస్చైర్మన్, ఖమ్మం
విద్యాశాఖకు పెద్దపీట..
రాష్ట్ర బడ్జెట్లో సర్కార్ విద్యాశాఖకు పెద్దపీట వేసింది. విద్యాశాఖకు ఏకంగా రూ.19,093 కోట్లు కేటాయించడం సంతోషదాయకం. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఆనందపడుతున్నారు. ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమంతో ప్రభుత్వ బడులు బలోపేతం అవుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసే బడ్జెట్ నిధులతో బడులు మరింత బలోపేతమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం.
– డి.వెంకటేశ్వరరావు, పీఆర్టీయూ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ ప్రజల ఆకాంక్షల బడ్జెట్..
తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా ఉంది. సీఎం కేసీఆర్ నిర్మాణాత్మక ఆలోచనలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది పూర్తిగా అన్ని వర్గాలకు, పేదలకు చెందిన బడ్జెట్. కేటాయింపుల్లో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం కల్పించి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ బడ్జెట్ మిగతా రాష్ర్టాలకు రోల్మోడల్గా నిలిచింది. మానవీయ దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచన, దార్శనికమైన ప్రణాళికా రచన, పారదర్శకమైన పరిపాలనకు నిలువెత్తు నిదర్శనంగా ఈ బడ్జెట్ నిలుస్తోంది. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగింది. వ్యవసాయానికి అగ్రతాంబూలం ఇచ్చి, ముఖ్యంగా రైతుబంధుకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం సీఎం కేసీఆర్కు రైతన్నపై ఉన్న అధికమైన మక్కువకు నిదర్శనం. సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందడుగు వేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఉంది. రానున్న రోజుల్లో జాతి నిర్మాణంలో తెలంగాణ మరింత ఉజ్వల పాత్ర పోషిస్తుంది. సీఎం కేసీఆర్ మహా సంకల్పానికి తెలంగాణ ప్రజానీకం సంపూర్ణమైన అండదండలు అందించాలి.
-నామా నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ
రైతు పక్షపాత బడ్జెట్..
తెలంగాణ బడ్జెట్లో అన్ని రంగాలకూ ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా రైతు పక్షపాత బడ్జెట్గా నిలిచింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ‘తెలంగాణ ఆచరిస్తున్నది. యావత్ దేశం అనుసరిస్తున్నది’ అని చెప్పుకునే స్థాయికి తెలంగాణ చేరుకున్నది. తెలంగాణ మోడల్ అభివృద్ధి ప్రణాళికకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు లభిస్తున్నాయి. కరోనా వంటి సంక్షోభ సమయంలో సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా అమలు చేయగలగడం ఒక్క తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన ఈ మేలైన బడ్జెట్ గురించి ఊరూవాడల్లో విశేషంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణ మోడల్ అభివృద్ధి యావత్ దేశంలోనూ రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగంగా ప్రజలు మెచ్చే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
-తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ
ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా..
రాష్ట్రప్రభుత్వ బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్. అన్ని వర్గాలకు న్యా యం జరిగింది. అన్నిరంగాలకు సమాన కేటాయింపులు జరిగాయి. రూ.2.90 లక్షల కోట్ల పెద్ద బడ్జెట్ను ప్రవేశ పెట్టి రాష్ట్రాన్ని మరింత ముందుకు నడిపించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. సామాన్యుడిపై భారం పడకుండా బడ్జెట్ రూపకల్పన జరిగింది. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పద్దు ఉంది.
– కందాళ ఉపేందర్రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే
వ్యవసాయానికి సముచిత స్థానం..
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయ రంగానికి వేలాది కోట్లాది రూపాయలు కేటాయించింది. ఆయిల్ పాం రైతులకు భరోసానిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. పశుసంవర్ధకశాఖ, చేపల పెంపకం, రాయితీపై గొర్రెల పథకానికి ప్రాధాన్యం ఉంది. సమీకృత రైతుబజార్ల నిర్మాణానికి భారీ కేటాయింపులు ఉన్నాయి. ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యం ఉంది. విత్తనం నుంచి దిగుబడి మార్కెట్ వచ్చే వరకు ప్రభుత్వం రైతుకు వెన్నంటి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారు.
– దోరేపల్లి శ్వేత, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్
పట్టణ ప్రగతికి అధిక నిధులు కేటాయించారు..
పట్టణాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో సంతోషకరమైన విషయం. మున్సిపాలిటీలు ఇక సుందర నగరాలుగా రూపొందుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇక్కడకు వచ్చినప్పుడు కూడా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేశారు. ఇప్పుడు మళ్లీ పట్టణాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ నిధులతో కొత్తగూడెం, పాల్వంచ జంట పట్టణాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు.
-కాపు సీతాలక్ష్మి. మున్సిపల్ చైర్పర్సన్, కొత్తగూడెం
మైనార్టీలకు న్యాయం..
రాష్ట్ర బడ్జెట్లో సర్కార్ మైనార్టీల సంక్షేమానికి న్యాయం చేసింది. మైనార్టీల అభివృద్ధికి రూ.2,200 కోట్లు కేటాయించడం సంతోషాన్నిచ్చింది. సీఎం కేసీఆర్ మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లల కోసం గురుకులాలు ఏర్పాటు చేసి విద్యావెలుగులకు బాట వేశారు. షాదీముబారక్కూ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ఎస్డీ హైమత్, కొత్తగూడెంవాసి
అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యమైన బడ్జెట్..
అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం హర్షణీయం. ఈ బడ్జెట్లో అన్ని రంగాలకూ నిధులు కేటాయించారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏటా సంక్షేమ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా బీసీలకు, పేద కుటుంబాలకు, ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్న వారందరికీ నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు.
-రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు
‘ఆసరా’కు రూ.12 వేల కోట్ల కేటాయింపు సంతోషకరం..
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆసరా పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నిరుపేదలను ఆదుకుంటున్నారు. ప్రతినెలా ఠంచన్గా ఆసరా పింఛన్ అందిస్తూ మా బతుకుదెరువుకు భరోసా ఇస్తున్నారు. తెలంగాణ బడ్జెట్లో ఈసారి ఆసరా పింఛన్ల పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చల్లంగుండాలి. ఇలాంటి పథకాలు అమలు చేస్తుంటే మాలాంటి పేదలకు బతుకుదెరువు లభిస్తుంది.
– కందాళ రామయ్య, లబ్ధిదారుడు, సారపాక బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు
వెచ్చించడం హర్షణీయం..
తెలంగాణ ప్రభుత్వంలో బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారు. బీసీల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.6,229 కోట్లు కేటాయించడం హర్షణీయం. దీంతో బీసీలు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతారు. అంతేగాకుండా వ్యవసాయ, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే నెంబర్వన్ స్థానంలో ఉంది. ఆయా రంగాలకు కూడా అధికంగా నిధులను కేటాయించడం గొప్ప విషయం. తెలంగాణ బడ్జెట్ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంది.
-బెజ్జంకి కనకాచారి, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి, సారపాక
మహిళా, శిశు సంక్షేమానికి రూ.2,331 కోట్లు..
రాష్ట్ర బడ్జెట్లో మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,331 కోట్లను ప్రభుత్వం కోటాయించడం హర్షించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు చేపడుతున్నారు. వాటన్నింటికీ పుష్కలంగా నిధులు కేటాయిస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రకటించి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. మహిళల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో బడ్జెట్లో నిధుల కేటయింపే రుజువు చేస్తోంది.
– లక్కినేని అలేఖ్య, ఎంపీపీ, పెనుబల్లి
ఇది రైతుల బడ్జెట్..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ రైతుల బడ్జెట్. తెలంగాణ ప్రభుత్వంలో అన్నదాతలు ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు కేటాయించి బీఆర్ఎస్ సర్కారు రైతు ప్రభుత్వంగా మరోసారి నిరూపించుకుంది. 2023-24 ఆర్థిక బడ్జెట్ యావత్ తెలంగాణ ప్రజలకు ఆమోదంగా ఉంది. అన్ని రంగాల వారికి బడ్జెట్లో సమన్యాయం జరిగింది. కేంద్ర బడ్జెట్కు తెలంగాణ బడ్జెట్ చెంపపెట్టుగా ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ జనరంజకమైనది.
-కామిరెడ్డి శ్రీలత, జడ్పీటీసీ, బూర్గంపహాడ్
కల్యాణలక్ష్మికి రూ.2 వేల కోట్ల కేటాయింపు శుభపరిణామం..
నిరుపేద కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ ఆడపిల్లల వివాహాలు చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ సార్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ నిరుపేద యువతుల వివాహాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. తద్వారా ఆ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. నా ఇద్దరు కుమార్తెలకూ కల్యాణలక్ష్మి పథకం ద్వారా సాయం సీఎం కేసీఆర్ సార్ ఆర్థిక సాయం అందించారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. పేద కుటుంబాల్లోని యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ బడ్జెట్లో కల్యాణలక్ష్మి పథకానికి రూ.2 వేల కోట్లు కేటాయించడం శుభపరిణామం. తెలంగాణ బడ్జెట్ ఎంతో ఆమోదయోగ్యంగా ఉంది.
-లెక్కల ఇందిర, మహిళ, సారపాక
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రకటన సంతోషం..
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నా తోటి ఉద్యోగులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి మాకు తీపికబురు అందించారు. కేంద్రం ఒక వైపు ఉద్యోగాలను తొలగిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొత్త ఉద్యోగాలు ఇస్తోంది. పైగా కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయడం చాలా గొప్ప విషయం. మా సంఘం తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
-బండి వెంకటేశ్వరరావు, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటున్న బడ్జెట్..
రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఉంది. రైతును రాజును చేసేలా వ్యవసాయ రంగానికి మరోసారి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. విద్య, వైద్య రంగాలకూ పెద్దపీట వేశారు. తెలంగాణ బడ్జెట్ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సకల జనుల సంక్షేమమే ధ్వేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించినట్లుగా ఉంది.
-పప్పుల నిర్మల, సీతారామా హోటల్ యజమాని, కారేపల్లి
సొంత జాగా ఉన్న వారికి భరోసా
సొంత జాగా ఉన్న వారు సొంతిల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షల చొప్పున ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంతోమందికి మేలు చేస్తుంది. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పడం నిరుపేదలకు భరోసా కలిగింది. ఇప్పటికే ముసలోళ్లకు పింఛన్ పెంచి సీఎం కేసీఆర్ మంచిపని చేసిండు. కన్నకొడుకులా ఆందుకుంటున్నడు. రైతులకు మంచి చేసిండు. రైతులు కూలీలకు పని ఇస్తున్నరు. ఏరోజు పని దొరకలేదనే రంది లేదు. పేదోళ్లకు మంచి చేసేలా కేసీఆర్ సారు మరిన్ని పథకాలు అమలు చేయాలె.
– పట్ల బక్కమ్మ, కూలీ, ముత్తగూడెం, ఖమ్మం రూరల్
గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపు హర్షణీయం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ, నీటిపారుదల రంగాలకు అధిక నిధులు కేటాయించడం హర్షణీయం. ముఖ్యంగా ఈ బడ్జెట్లో గ్రామ పంచాయతీలకు నిధులు నేరుగా కేటాయించడం గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులను నేరుగా గ్రామ పంచాయితీల అకౌంట్లోకి బదిలీ చేయడం వల్ల పంచాయతీల అభివృద్ధికి నిధుల ఇబ్బంది లేదు. పల్లెప్రగతి, పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు కేటాయించి పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేశారు.
-నాయుడు రమాదేవి, సర్పంచ్, పల్లెవాడ
అన్నివర్గాలకు ప్రాధాన్యం..
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో అన్నివర్గాలకు ప్రాధాన్య ఉంది. ఆసరా పెన్షన్లు, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఢోకా లేదు. గిరిజన సంక్షేమం, ప్రజాపంపిణీ వ్యవస్థ, వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయి. రుణమాఫీ పథకానికి నిధులు కేటాయించి రాష్ట్రప్రభుత్వం రైతులకు భరోసా కల్పించింది. సొంత ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున అందిస్తామని చెప్పడం సంతోషదాయకం. మొత్తంగా బడ్జెట్ ప్రజలకు భరోసానిచ్చింది.
– లింగాల కమల్రాజు, జిల్లా పరిషత్ చైర్మన్, ఖమ్మం
కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం..
కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేస్తామని ప్రకటించి సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా మేమంతా అరకొర జీతాలతో జీవనం సాగిస్తున్నాం. కాంట్రాక్టు అధ్యాపకులను ఏప్రిల్ నుంచి పర్మినెంట్ చేస్తున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి ప్రకటించడం సంతోషాన్నిచ్చింది. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇచ్చిన మాట నెరవేర్చి సీఎం కేసీఆర్ మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
– తోటపల్లి తిరుపతిరావు, కాంట్రాక్ట్ లెక్చరర్, బోనకల్లు
ప్రజాపంపిణీకి నిధులు సంతోషదాయకం..
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు కోటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని ఎంతో కాలంగా ప్రజలకు చేరవేస్తూ రేషన్ డీలర్లు జీవనం సాగిస్తున్నారు. కరోనా నాటి నుంచి పేదలకు ఉచితంగా 10 కిలోల చొప్పున సీఎం కేసీఆర్ బియ్యం పంపిణీ చేశారు. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా పేదలకు బియ్యం సరఫరాకు నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
-జీ.భద్రయ్య, రేషన్ డీలర్, ఖమ్మం అర్బన్
రైతు కష్టాలు తెలిసిన సర్కార్..
సాగులో రైతులు పడుతున్న కష్టాలేంటో ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసు. అందుకే ఏటా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ, సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. ఈ బడ్జెట్లోనూ సుమారు రూ.50 వేల కోట్లు వ్యవసాయ, సాగునీటి రంగాలకు కేటాయించారు. బీఆర్ఎస్ సర్కారు ముమ్మాటికీ రైతు సర్కారు అని మరోమారు రుజువైంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో సాగునీటికి కొరత రాలేదు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. పుష్కలంగా పంటలు పండి చేతికి వస్తుండడంతో రైతుల మోముల్లో సంతోషం కనబడుతోంది. ఇప్పుడు రుణమాఫీ కూడా ప్రకటించి కేసీఆర్ రైతులపై తనకున్న ఉదారతను చాటుకున్నారు.
-సూదగాని సంగయ్య, రైతు, చింతగుర్తి
వ్యవసాయ రంగానికి అధిక నిధులు..
తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.26,931 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.26,800 కోట్లు కేటాయించడం సంతోషకరం. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ రైతు పక్షపాతిగా నిలుస్తోంది. అన్నదాతల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రైతులు సంతోషంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించి రైతుల సంక్షేమానికి పాటుపడుతుండడం వల్లనే వారు సంతోషంగా సాగు పనులు చేసుకుంటున్నారు. రైతులు సంతోషంగా ఉన్నారంటే నిధుల కేటాయింపే నిదర్శనం. వ్యవసాయ, నీటిపారుదల రంగానికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు.
-ప్రసాదరాజు, ఏవో, పెనుబల్లి