“సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గతంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆర్థిక అరాచకవాదిగా అభివర్ణించారు. ఇప్పుడు తన పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు.. పొంగులేటిలో సీఎల్పీ నేతకు కొత్తగా ఏం కనిపించిందో ప్రజలకు చెప్పాలి.. ఏదేమైనా గానీ పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ బీఆర్ఎస్ శని వదులగొడుతున్నారు.. కాంగ్రెస్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, పంటలకు ఉచిత కరెంట్ వంటి పథకాలు లేవు.. వారి ప్రభుత్వంలో విద్యుత్ సరఫరా లేక కరెంట్ మోటర్లు కాలిపోయేవి.. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి.. కాంగ్రెసోళ్ల మాటలు ప్రజలెవరూ నమ్మరు.. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే తమ పార్టీ పాలిస్తున్న రాష్ట్రంలో ఎలాంటి మంచి పథకం అమలు చేస్తున్నారో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలకు చెప్పాలి’‘ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఆయన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. పట్టాలతో రైతులకు చట్టబద్ధమైన హక్కులు వస్తాయన్నారు.
– ఖమ్మం, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాంగ్రెసోళ్లకు మాటలు చెప్పే అలవాటు ఉన్నది.. ఆ మాటలు చెప్పే ప్రజలను దశాబ్దాల నుంచి మోసం చేస్తున్నారు.. అలాంటి నేతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఇందిరా రాజీవ్ సాగర్ పేరుతో నీళ్లను దోచుకుపోతారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ప్రాజెక్ట్పై పనులపై విచారణ చేపడితే తమ పార్టీ నేతల బాగోతాలే బయటపడతాయి.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ పాలనలోనే గిరిజన సంక్షేమం సాధ్యమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఆయన రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్తో కలిసి పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. పట్టాలతో రైతులకు చట్టబద్ధమైన హక్కులు వస్తాయన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి 10 ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు. గిరిజనులు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను ఆదరించాలని పిలుపునిచ్చారు.
రాహుల్గాంధీకి మంత్రి హరీశ్ సవాల్..
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉంటే, వాటిని ప్రజలకు వివరించాలని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, పంటలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు లేవన్నారు. రాహుల్గాంధీ తెలంగాణ వచ్చిన ప్రతిసారి ఇక్కడి నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్నే చదువుతున్నారని, కానీ నిజానిజాలు మాత్రం మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్పై విసుగెత్తే తెలంగాణ ప్రజలు స్వరాష్ర్టాన్ని సాధించుకున్నారని గుర్తుచేశారు. ఉమ్మడి జిల్లా పోడు రైతులపై కేసులన్నింటినీ ప్రభుత్వం తీసివేస్తుందన్నారు. ఈ మేరకు కసరత్తు చేస్తున్నదన్నారు.
పొంగులేటి కాంగ్రెస్లో చేరికతో బీఆర్ఎస్ శనిపోయింది..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆర్థిక అరాచకవాదిగా అభివర్ణించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఇప్పుడు కొత్తగా ఆయనలో ఏం కనిపించిందో వివరించాలని డిమాండ్ చేశారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ బీఆర్ఎస్ శని వదలగొట్టారన్నారు. ఉమ్మడి జిల్లాలో గతంలో బీఆర్ఎస్కు ఒక స్థానం వచ్చి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు చేజారాయని, ఈసారి తొమ్మిది స్థానాలు గెలుస్తామన్నారు. ఖమ్మం, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు నియోజకవర్గాలకు చెందిన 6,589 మందికి 13,139 ఎకరాలకు హకు పట్టాలు అందించామన్నారు. ముందుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రజాగాయకుడు సాయిచంద్ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్యేలు రాములునాయక్, హరిప్రియక్, టీఎస్ సీడ్స్, డీసీఎంఎస్, సుడా చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, రాయల శేషగిరిరావు, విజయ్కుమార్, మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, డీఎఫ్వో సిద్ధార్థ విక్రమ్సింగ్, నేతలు నల్లమల వెంకటేశ్వరరావు, మదన్లాల్, చంద్రావతి, పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, పాలెపు విజయ, వెంకటరమణ, బుడిగెం శ్రీను పాల్గొన్నారు.
సాయిచంద్ మరణం తీరని లోటు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పాల్వంచ పట్టణంలో శుక్రవారం పోడు రైతులకు పట్టాలు అందించేందుకు విచ్చేసి తొలుత సభా ప్రాంగణంలో సాయిచంద్ మృతికి నివాళి అర్పించారు. సాయిచంద్ పాట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊతం ఇచ్చిందన్నారు. ఆయన పాట ప్రజల హృదయాలను గెలుచుకున్నదన్నారు. వారి వెంట ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులతో జాగ్రత్త ప్రజలారా..
ఖమ్మం జిల్లాలో మళ్లీ కాంగ్రెస్ దొంగలు పడుతున్నారు. ఇందిరా రాజీవ్ సాగర్ పేరుతో జిల్లాకు వచ్చే నీళ్లను మళ్లించేందుకు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తమై అలాంటి నాయకుల నుంచి జిల్లాను కాపాడుకోవాలి. తాము అధికారంలోకి వస్తే సీతారామ ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ చేపడతామని కాంగ్రెస్ పార్టీ నేతలు అనడం హాస్యాస్పదం. పారదర్శకంగా, పకడ్బందీగా ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాటలు చెప్పే అలవాటు ఉన్నది. కానీ ప్రజలకు వారేమీ చేయలేరు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 13 వేల ఎకరాలకు పోడుభూములకు పట్టాలు ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ప్రతి పనికీ సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రుణాన్ని ప్రజలు తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఉభయ జిల్లాల పరిధిలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి.
-రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
గిరిజనుల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
పోడు అంటేనే గిరిజన ప్రాంతంలో జఠిలమైన సమస్య. కొన్నిసార్లు పోడుపై ఏజెన్సీలో యుద్ధవాతావరణం నెలకొనేది. ఈ సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందోనని నేను ఎంతో ఆందోళన చెందాను. సీఎం కేసీఆర్ గిరిజనులకు పట్టాలు ఇచ్చి మా భయాలన్నింటినీ తొలగించారు. పట్టాలు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఒక్క పినపాక నియోజకవర్గంలోనే 15 వేల ఎకరాల పోడు భూమికి పట్టాలు అందుతున్నాయి.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే
పట్టాల ఘనత కేసీఆర్దే..
ఏళ్లనాటి పోడు భూముల సమస్యను సీఎం కేసీఆర్ ఒక కొలికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఒకేరోజు 4 లక్షల ఎకరాలకుపైగా 1.55 లక్షల మంది గిరిజనులకు పట్టాలు ఇచ్చి చరిత్ర సృష్టించారు. కేంద్రం.. రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకపోతే సీఎం కేసీఆర్ సొంతంగా రాష్ట్ర నిధులతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. అన్నింటా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేసిన కేసీఆర్ను రానున్న ఎన్నికల్లో గెలిపించుకుందాం.
-నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు
చిల్లరగాళ్లకు బుద్ధి చెప్పాలి..
ఖమ్మంలో కొందరు చిల్లరగాళ్లు తయారయ్యారు. వారికి తగిన బుద్ధి చెప్పాలి. వారు చేసిన తప్పులు సరిచేసుకోకుండా ప్రజలపైన రుద్దుతున్నారు. 2014, 2018లో జరిగిన తప్పులు చేయకుండా ప్రతి ప్రజాప్రతినిధి కష్టపడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లను గెలిపించుకోవాలి. పోడు భూమిపై ఎలాంటి హక్కులు లేని వారికి సీఎం కేసీఆర్ పట్టాలు అందించడం అభినందనీయం. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి.
-వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
పట్టా పొందిన వారికి ‘రైతుబంధు’
సీఎం కేసీఆర్ ఏళ్లనాటి పోడు సమస్యను పరిష్కరించి గిరిజనులకు పట్టాలు అందించారు. 14 ఏళ్లు ఉద్యమం చేసిన నాయకుడు అయినందుకే ఆయనకు పేదల సమస్యలు తెలుసు. పోడు పట్టాలు అందుకున్న వారికి వెంటనే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. అనంతరం మంత్రి హరీశ్రావుకు ఎమ్మెల్సీ తాతా మధు శాలువా కప్పి సత్కరించారు.
-తాతా మధు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
పోడు పట్టాల కోసం పోరాడాను..
పోడు రైతులకు పట్టాలు అందించేందుకు నేనెంతో కృషి చేశాను. కొన్నిసార్లు ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొన్నాం. మా కుటుంబంపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కేసులు అలాగే నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి పోడు రైతులకు పట్టాలు ఇవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చింది. పట్టాలు ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. కారణజన్ముదు కేసీఆర్.
– వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే
గిరిజనుల కల ఫలించింది..
పోడు రైతులు ఎంతోకాలం నుంచి పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామాల పర్యటనలో భాగంగా మేము క్షేత్రస్థాయిలోకి వెళ్లినప్పుడు ఎక్కువమంది అభివృద్ధి పనుల కంటే పోటు పట్టాలు అడిగారు. సర్కార్ పట్టాలు అందించడంతో వారి చిరకాల కల ఫలించింది. ఇప్పుడే గిరిజనుల కళ్లలో నిజమైన ఆనందం కనిపిస్తున్నది. జిల్లాలో ఎక్కువ ఇల్లెందు మండలంలోనే పోడు సాగవుతున్నది. అక్కడ పోడు సాగు చేస్తున్న రైతులందరికీ పట్టాలు అందడం ఆనందాన్నిచ్చింది.
– హరిప్రియానాయక్, ఎమ్మెల్యే ఇల్లెందు
ఇదే అసలు పండుగ..
గిరిజనులు పట్టాలు అందుకోవడమే అసలైన పండుగ. ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం చూపడం పోడు రైతులకు ఆనందాన్నిచ్చింది. ఇంకా ఎంతోమందికి పట్టాలు అందాల్సి ఉన్నది. త్వరలో మిగిలిన వారికీ పట్టాలు అందించేందుకు కృషి చేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు.
– మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే
మా కల నెరవేరింది..
పట్టా పుస్తకం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కానీ సీఎం కేసీఆర్ సార్ పోడు సాగు చేసుకునే వారిపట్ల ప్రత్యేక దృష్టి పెట్టి పట్టా పుస్తకాలు అందించారు. ఈ పట్టాతో మా కల నెరవేరింది.. మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మా భూమి మాదేనన్న ధైర్యం కేసీఆర్ సార్ మాకు కలిగించారు. ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న మాకు చాలా సంతోషంగా ఉంది.
– ఎనిక శివారు, అశ్వాపురం
రైతుబంధు కూడా ఇస్తారు..
మేము ఎన్నో ఎండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమికి ఇప్పుడు యజమానులయ్యాం. సీఎం కేసీఆర్ సార్ రైతుబంధు కూడా ఇస్తామన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక కృషి చేశారు. మాలాంటి వారి ఇబ్బందులను పట్టించుకున్న్న ఇలాంటి సీఎం ఎల్లప్పుడూ సీఎంగా ఉండాలి. ఇవాళ మాకు పండుగ రోజు. కుటుంబం మొత్తం రుణపడి ఉంటాం.
– మడకం కుమారి, కూనవరం
ధైర్యంగా మా భూమిని దున్నుకుంటాం..
సీఎం కేసీఆర్ సార్ పోడు పట్టా పుస్తకాలను అందించడంతో 30 ఎండ్ల ఎదురుచూపులకు తెరపడింది. సాగు చేసుకుందామంటే చాలా భయంగా ఉండేది. ఎవరొచ్చి ఎమంటారోనని ఆందోళన చెందేవాళ్లం. ఇక ఫారెస్టు, ఇతరశాఖల వారితో ఇబ్బందులు ఉండవు. ఎవరూ మమ్మల్ని ఇబ్బందులు పెట్టరు. గతంలో ఎక్కువ రేటు ఇచ్చి ట్రాక్టర్ల ద్వారా దొంగచాటుగా భూమిని దున్నుకునేవాళ్లం. ఇపుడు ధైర్యంగా మా భూమిని మేమే దున్నుకుంటాం.
– కీసర ముత్తయ్య, ఉప్పుసాక
పదేండ్ల కష్టానికి ఫలితం..
పదేండ్ల నుంచి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతూ భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. ఇదే మాకు ఆధారం. ఇన్నేండ్ల తర్వాత ఇప్పటికి పట్టా పుస్తకాల రూపంలో మాకు ఫలితం దక్కింది. ఈ సంతోషాన్ని ఎన్నటికి మర్చిపోం. అందరితోపాటు మాకు కూడా అన్నిరకాల సదుపాయాలు కలిగాయి. దేవుడు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రేగాను చల్లంగ చూడాలి.
– గొగ్గెల స్వర్ణలత, ఆళ్ళపల్లి