కొత్తగూడెం ఎడ్యుకేషన్/ ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 3 : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. భద్రాద్రి జిల్లాలో రెగ్యులర్ విద్యార్థుల కోసం 70, ప్రైవేట్ విద్యార్థుల కోసం 2 కేంద్రాలు మొత్తం 72కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 12,540 మందికి హాల్టిక్కెట్లు జారీ చేయగా 12,480 మంది హాజరయ్యారు. 60 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 175మందికి 149మంది హాజరుకాగా, 26మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను డీఈవో సోమశేఖరశర్మ సందర్శించారు. ఐదుగురు ఫ్లైయిగ్ స్కాడ్లు 25 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల సహాయ సంచాలకుడు మాధవరావు మూడు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో ఎక్కడా మాల్ప్రాక్టీస్కు తావులేకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్షా సమయం కంటే గంట ముందుగానే విద్యార్థులు చేరుకోవడంతో సిబ్బంది వారిని పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. అన్ని పరీక్షాకేంద్రాల వద్ద తాగునీటి వసతిని కల్పించారు.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లావ్యాప్తంగా 103 కేంద్రాల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అధికారుల సూచనల మేరకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. తొలి వార్షిక పరీక్ష కావడంతో విద్యార్థులు తమ ఇష్టదైవానికి పూజలు చేశారు. హాల్టిక్కెట్లకు సైతం ప్రత్యేక పూజలు చేయించి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షలో మొత్తం 16,873 మంది విద్యార్థులకు 16,818 మంది హాజరు కాగా 55మంది గైర్హాజరయ్యారు. 99.67 శాతం హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఈ. సోమశేఖరశర్మ తెలిపారు. ఖమ్మం నగరంలోని పలు పాఠశాలలతోపాటు కారేపల్లి, కామేపల్లి మండలాల్లో పరీక్షా కేంద్రాలను డీఈవోతోపాటు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షించారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్..
టెన్త్ ప్రశ్నాపత్రాలను గట్టి భద్రత మధ్య పరీక్ష కేంద్రాలకు తరలించారు. పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్లు ప్రశ్నాపత్రాలను సంబంధిత పోలీస్స్టేషన్ల నుంచి పోలీస్ భద్రతతో తీసుకెళ్లారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు 144వ సెక్షన్ను అమలు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి వేయించారు. పరీక్ష ముగిసిన అనంతరం విద్యార్థులను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు కేంద్రాల సమీపంలో ఉన్నారు. ఇదే అదనుగా ఇంటర్ కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు కరపత్రాలను పంచారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.