ఖమ్మం (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భద్రాచలం, ఏప్రిల్ 18: దక్షిణ అయోధ్యాపురిగా పేరుగాంచిన భద్రగిరిలో పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు రాజాధిరాజుగా దర్శనమిచ్చాడు. స్వర్ణ ఛత్రం, పసిడి పాదుక, రాజదండ, రాజముద్ర, వజ్రకిరీటాలతో స్వర్ణ సింహాసనంపై కొలువుదీరిన జగదభిరాముడు రారాజుగా దర్శనమివ్వడంతో భక్తజనం పులకించిపోయింది. జయజయధ్వానాలతో మిథిలా సామ్రాజ్యం (స్టేడియం) మార్మోగింది. నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సకలగుణాభిరాముడైన భద్రాద్రి రాముడికి గురువారం మహా పట్టాభిషేకం వేడుక మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. రాజలాంఛనాలతో నిర్వహించిన ఈ వేడుకను తిలకించి భక్తజన కోటి పరవశించింది. పట్టాభిషేకం సందర్భంగా భద్రాచలం దేవస్థానం వైదిక సిబ్బంది పావన గోదావరి నది నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో పండితులు తీర్థప్రోక్షణ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో సీతారాముల కల్యాణం జరిగిన మరుసటి రోజు శ్రీరాముడికి మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. బుధవారం కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి స్వామివారికి, సీతమ్మతల్లికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. గురువారం మహా పట్టాభిషేకానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరై పట్టాభిషిక్త రామయ్యకు పట్టువస్ర్తాలను సమర్పించారు.
గురువారం ఉదయం సరిగ్గా 10 గంటల నుంచి శ్రీరామ మహాపట్టాభిషేక క్రతువు ప్రారంభం కాగా.. ఆరాధన అనంతరం వేదస్వస్తితో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవస్థానం స్థానాచార్యులు స్థలశాయి శ్రీరామ మహా పట్టాభిషేక విశిష్టతను భక్తులకు వివరించారు. దేశంలో దేవతలు ఎంతోమంది ఉన్నా అందరికీ కల్యాణం మాత్రమే జరుగుతుందని, కానీ పట్టాభిషేక వైభవ ఘనత శ్రీరాముడికి మాత్రమే జరుగుతుందని వివరించారు. శ్రీరామ పట్టాభిషేక ఘట్టంలో భాగంగా భద్రాద్రి రామయ్యకు ఒక్కో ఆభరణం ధరింపజేస్తూ.. వాటి విశిష్టతను వివరించారు. తొలుత శ్రీరామ బంగారు పాదుకలు, అనంతరం రాజనీతిని తెలియచేసే రాజదండం, రాజముద్రిక, బంగారు ఛత్రం, రాజఖడ్గం తదితరాలను అర్చకస్వాముల వేదమంత్రోచ్ఛారణల మధ్య పట్టాభిషిక్తుడైన రామయ్యకు ధరింపజేశారు. అనంతరం ప్రధాన లాంఛనమైన సామ్రాట్ కిరీటాన్ని రామయ్యకు ధరింపజేశారు. ఆ క్షణంలో భక్తజనకోటి కరతాళధ్వనులతో జేజేలు పలికింది. పురాణాల్లో దేవేంద్రుడు రామయ్యకు కానుకగా పంపినట్లు చెప్పే ముత్యాలహారాన్ని తొలుత రామచంద్రమూర్తికి.. ఆ తర్వాత సీతమ్మ తల్లికి, చివరగా రామభక్త సామ్రాజ్యానికి రారాజు అయిన హనుమంతుడికి సమర్పించి ప్రోక్షణ గావించారు. వేదాశీర్వచనం చేసి అష్టోత్తర శతహారతిని 108 ఒత్తులతో వెలిగించి శ్రీరామచంద్ర ప్రభువుకు సమర్పించడంతో మహాపట్టాభిషేకం సుసంపన్నమైంది. గవర్నర్ రాధాకృష్ణన్, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ రోహిత్రాజ్, ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్, భద్రాద్రి దేవస్థానం ఈవో రమాదేవి పాల్గొన్నారు.
కల్యాణం జరిగిన మూడోరోజున (శుక్రవారం) రామయ్యకు మహదాశీర్వచనం అందజేయడం సంప్రదాయం. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 400 మంది చతుర్వేద పండితుల వేద మంత్రాలతో రామయ్యకు ఆశీర్వచనం అందజేస్తారు. దీనినే సదస్యంగా పిలుస్తారు.
తొలుత హెలికాప్టర్ ద్వారా భద్రాచలం చేరుకున్న గవర్నర్కు కలెక్టర్ ప్రియాంక, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పీ రోహిత్రాజ్, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన గవర్నర్కు దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో, వేదమంత్రాలతో ఆహ్వానం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గవర్నర్కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సమయంలో ఆలయ ప్రాశస్థ్యాన్ని వివరించి దేవస్థానం తరఫున శేషవస్త్రాలు, జ్ఞాపిక, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పట్టాభిషేకం నిర్వహించే మిథిలా స్టేడియానికి తోడ్కొని వచ్చారు.
భద్రాచలం, ఏప్రిల్ 18 : దేశం రామరాజ్యంలా సుభిక్షంగా ఉండాలని, అదే మన లక్ష్యమని రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. గురువారం భద్రాచలం పట్టణంలోని మిథిలా స్టేడియంలో శ్రీరామ మహా పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పట్టాభిషేక క్రతువు పూర్తయిన తర్వాత బయట మీడియాతో మాట్లాడారు. కుటుంబం, రాష్ట్రం, దేశంలో శాంతి వెల్లివిరియాలని, దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు. ఏ ఒక్కరికి హాని చేయకూడదని, వీలైతే తోటివారికి సహాయం చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఆనవాయితీ ప్రకారం సీతారాముల కల్యాణం జరిగిన మరుసటి రోజైన దశమి నాడు శ్రీరామచంద్ర మహాప్రభువుకు వైదికులు మహాపట్టాభిషేకాన్ని వైభవంగా జరిపారు. గురువారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం గావించారు. అనంతరం పావన గౌతమీ నది మధ్య భాగం (గోదావరి మధ్య భాగంలో 500 నదులు ప్రవహిస్తాయన్నది పురాణోక్తి) నుంచి అర్చకస్వాములు పవిత్ర జలాలను తీసుకొని వచ్చారు. స్వామివారి ఉత్సవపెరుమాళ్లను సుందరంగా అలంకరించారు. శిల్పకళాశోభితమైన మిథిలా స్టేడియానికి ప్రత్యేక పల్లకీలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను తోడ్కొని వచ్చారు. ముందుగా ఆరాధన, వేదస్వస్తితో వేడుకను ప్రారంభించి విశ్వక్సేన, కర్మణ పుణ్యాహవాచన జరిపి 12 మంది అర్చకస్వాములకు కండువాలు కప్పి వశిష్ట మహర్షి, భరత శత్రఘ్నులు, జాంబవంతుడు, అంగదుడు, వాల్మీకీ తదితరులను పట్టాభిషేకానికి ఆహ్వానించారు. స్వామివారికి ఎదురుగా పంచ కలశాలను ఏర్పాటు చేసి అందులో నాలుగు సముద్ర జలాలను, మధ్య కలశంలో 500 నదుల తీర్థాలను ఆవాహన చేశారు.
మండపారాధనగా అష్టదిక్పాలకులను, త్రిమూర్తులను ఆవాహన చేసి ఆరాధన జరిపారు. పాదుకల్లో ఆదిశేషుడిని, చామరాల్లో గరుత్మంతుడిని, నైరుతి భాగంలో గోదావరి నదిని ఆవాహనం చేశారు. కుడివైపున భరతుడిని, ఎడమ వైపున శత్రుఘ్నుడిని, రాజముద్రికలో లక్ష్మీ దేవిని, ఖడ్గంలో నందకుడిని ఆవాహన చేశారు. అయోధ్య సరయూ నదీ నుంచి తెచ్చిన ఫుణ్యజలాన్ని ఓ వైపున ఉంచారు. ఆగ్నేయం, వాయువ్యం, పశ్చిమల్లో వాసుదేవుడిని, సంకర్షడిని, ప్రద్యుమ్నడిని, అనిరుధుడిని ఆవాహన చేశారు. నాలుగు కలశాల్లో పురుష, సత్య, అచ్యుత,అనంతుడిని, కిరీటంలో నారాయణమూర్తిని ఆవాహన చేశారు. త్రిదండి చిన జీయర్స్వామి 1987లో రూ.50 లక్షలతో చేయించి సమర్పించిన పట్టాభిషేక కిరీటాన్ని శుభ ముహూర్తంలో స్వామివారికి అలంకరించారు. పట్టాభిషేకానికి ముందుగా భరతుడు 14 ఏళ్లపాటు పాలన చేసిన పాదుకలను సింహాసనంపై ఉంచి రామయ్యకు సమర్పించారు. తరువాత పట్టాభిషిక్తుడైన రామయ్యకు శ్రీరంగం నుంచి వచ్చిన పట్టువస్ర్తాలను సమర్పించారు. తదుపరి శ్రీరామ పట్టాభిషేక మంత్రసంపుటిత అష్టోత్తర శతనామార్చన జరిపారు. చివరగా గురువారం రాత్రి భద్రాచలంలో స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించారు.